5జీ కోసం బీఎస్ఎన్ఎల్ ప్లాన్: జియోకు పోటీ!? | BSNL Joins Hands With Tata for 5G | Sakshi
Sakshi News home page

5జీ కోసం బీఎస్ఎన్ఎల్ ప్లాన్: జియో, ఎయిర్‌టెల్‌కు పోటీ!?

Feb 9 2025 3:58 PM | Updated on Feb 9 2025 4:21 PM

BSNL Joins Hands With Tata for 5G

భారతదేశంలో జియో, ఎయిర్‌టెల్ వంటి టెలికాం ఆపరేటర్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. వీటికి గట్టి పోటీ ఇవ్వడానికి, యూజర్లకు మెరుగైన సేవలు అందించడానికి 'భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్' (BSNL) సిద్ధమైంది.

దేశంలో నాల్గవ అతిపెద్ద టెలికాం ఆపరేటర్.. 'బీఎస్ఎన్ఎల్' దేశవ్యాప్తంగా మెరుగైన సేవలను అందించడానికి తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. ఈ కంపెనీ ఇప్పటికే 65,000 4జీ సైట్‌లను ఏర్పాటు చేసింది. ఇటీవల కేరళలో కూడా 5,000 కొత్త సైట్‌లను జోడించింది. కంపెనీ దేశం అంతటా మొత్తం ఒక లక్ష 4G సైట్‌లను చేరుకోవడమే లక్ష్యంగా కృషి చేస్తోంది.

బీఎస్ఎన్ఎల్ ప్రపంచంలోనే అత్యంత సరసమైన 4G టారిఫ్‌లను అందించడంలో ప్రసిద్ధి చెందింది. అయితే కనెక్టివిటీని మెరుగుపరచడానికి, కంపెనీ వివిధ ప్రాంతాలలో కొత్త సైట్ ఇన్‌స్టాలేషన్‌లను చురుకుగా ప్లాన్ చేస్తోంది. కంపెనీ ఒక లక్ష 4జీ సైట్ లక్ష్యాన్ని పూర్తి చేసిన తర్వాత.. 5G నెట్‌వర్క్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం.

బీఎస్ఎన్ఎల్ తన 4జీ నెట్‌వర్క్‌ను 5జీకి అప్‌గ్రేడ్ చేయడానికి.. 'టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్' (TCS) సహకరిస్తోంది. కంపెనీ తన ప్రస్తుత 4జీ మౌలిక సదుపాయాలను సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ద్వారా 5జీగా మార్చాలని యోచిస్తోంది. ఎయిర్‌టెల్ మాదిరిగానే కంపెనీ భారతదేశం అంతటా 5జీ నాన్ స్టాండలోన్ (NSA) టెక్నాలజీని కూడా విడుదల చేయడానికి యోచిస్తోంది.

ఇదీ చదవండి: వాట్సాప్‌లోనే కరెంట్ బిల్, మొబైల్ రీఛార్జ్: కొత్త ఫీచర్ వచ్చేస్తోంది

బీఎస్ఎన్ఎల్ 5జీ స్టాండలోన్ (SA) టెక్నాలజీని పరీక్షిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో 5G SA టెస్టింగ్ జరుగుతోంది. ఇవన్నీ సవ్యంగా జరిగితే.. ఇంటర్నెట్ సేవలు మరింత చౌకగా లభిస్తాయి. ఇదే జరిగితే జియో, ఎయిర్‌టెల్ యూజర్లు కూడా బీఎస్ఎన్ఎల్ వైపు తిరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కంపెనీ తన నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడంలో మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా వినియోగదారులకు వేగవంతమైన కనెక్టివిటీని తీసుకురావడానికి కృషి చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement