ఎల్‌అండ్‌టీ చైర్మన్‌గా వైదొలిగిన ఎ.ఎం. నాయక్ | AM Naik formally steps down as LandT Group Chairman | Sakshi
Sakshi News home page

ఎల్‌అండ్‌టీ చైర్మన్‌గా వైదొలిగిన ఎ.ఎం. నాయక్.. దాతృత్వంతో ప్రత్యేక గుర్తింపు

Sep 30 2023 10:08 PM | Updated on Sep 30 2023 10:09 PM

AM Naik formally steps down as LandT Group Chairman - Sakshi

ప్రముఖ పారిశ్రామికవేత్త ఎ.ఎం. నాయక్ లార్సెన్ & టూబ్రో (L&T) నాన్-ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా అధికారికంగా వైదొలిగారు. 23 బిలియన్‌ డాలర్ల వ్యాపార సమ్మేళనం నాయకత్వ బాధ్యతలను ఎస్‌ఎన్‌ సుబ్రహ్మణ్యన్‌కు అందించారు.

81 ఏళ్ల నాయక్ ఇక ఐటీ కంపెనీలు, ఉద్యోగుల ట్రస్ట్‌కు చైర్మన్‌గా ఉంటారని, గత కొన్నేళ్లుగా ఆయన చేపడుతున్న దాతృత్వ కార్యక్రమాలను మరింత పెంచడంపై దృష్టి సారిస్తారని ఎల్ అండ్ టీ ఒక ప్రకటనలో తెలిపింది.

దాతృత్వంతో ప్రత్యేక గుర్తింపు

ఎ.ఎం. నాయక్‌ పారిశ్రామిక, దాతృత్వ వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ ఇండియన్‌ పోస్ట్ సంస్థ ఈ సందర్భంగా ఆయనపై ఒక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించింది.  త్వరలో ప్రచురితం కానున్న ఎ.ఎం.నాయక్‌ జీవిత చరిత్ర పుస్తకం ‘ది మ్యాన్ హూ బిల్ట్ టుమారో’ ముఖచిత్రాన్ని ఎల్‌ అండ్‌ టీ మాజీ డైరెక్టర్లు, నాయక్ కుటుంబ సభ్యులు 
ఆవిష్కరించారు.

నాయక్ ఛారిటబుల్ ట్రస్ట్‌ పేరుతో అణగారిన వర్గాల విద్య, నైపుణ్యాలను పెంపొందించడానికి ఎ.ఎం.నాయక్‌ కృషి చేస్తున్నారు. అలాగే నిరాలీ మెమోరియల్ మెడికల్ ట్రస్ట్ ద్వారా రాయితీ ధరకు సూపర్ స్పెషాలిటీ హెల్త్‌కేర్‌ను పేదలకు అందిస్తన్నారు.

గుజరాత్‌లో ఉపాధ్యాయుల కుటుంబం నుంచి వచ్చిన నాయక్, 1965లో ఎల్‌అండ్‌టీ కంపెనీలో జూనియర్ ఇంజనీర్‌గా చేరారు. ఆరు దశాబ్దాలు ఆ సంస్థలో పనిచేసిన ఆయన 1999లో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా, 2003లో ఛైర్మన్‌గా నియమితులయ్యారు.  కంపెనీ బోర్డు ఆయనకు ఛైర్మన్ ఎమిరిటస్ హోదాను సైతం ప్రదానం చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement