దేశ జీఎస్టీ వసూళ్లు గడిచిన జూన్లో బలమైన వృద్ధిని నమోదు చేశాయి. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. స్థూల జీఎస్టీ ఆదాయం 13.9 శాతం పెరిగి రూ.1,94,812 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే నెలలో ఇది రూ.1,71,105 కోట్లుగా ఉండటం గమనార్హం.
నికరంగా (రిఫండ్లు మినహాయించిన తరువాత) జీఎస్టీ వసూళ్లు 11.2 శాతం పెరిగి రూ.1,62,377 కోట్లుగా నమోదయ్యాయి. అదే సమయంలో నెలలో రీఫండ్లు గణనీయంగా పెరిగి రూ.32,436 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 29.1 శాతం అధికం.
కేంద్ర జీఎస్టీ (CGST) వసూళ్లు 8 శాతం పెరిగి రూ.37,376 కోట్లకు చేరగా, రాష్ట్ర జీఎస్టీ (SGST) 4 శాతం వృద్ధితో రూ.45,116 కోట్లుగా నమోదైంది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (IGST)లోనూ బలమైన పెరుగుదల కనిపించింది. దేశీయ లావాదేవీల ద్వారా వచ్చిన ఐజీఎస్టీ రూ.52,282 కోట్లుగా ఉండగా, దిగుమతులపై వసూళ్లు 34.6 శాతం భారీ వృద్ధితో రూ.60,038 కోట్లకు చేరాయి.
దేశీయ స్థూల ఆదాయాలు మొత్తం 6.5 శాతం పెరిగి రూ.1,34,774 కోట్లుగా నమోదయ్యాయి. ఇది దేశీయ వినియోగం, సేవల రంగంలో కొనసాగుతున్న స్థిరమైన డిమాండ్ను సూచిస్తోందని ఆర్థిక వర్గాలు పేర్కొంటున్నాయి.
రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర 9 శాతం వృద్ధితో రూ.30,714 కోట్ల జీఎస్టీ వసూళ్లను నమోదు చేసి మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తరప్రదేశ్ 19 శాతం వృద్ధితో రూ.9,165 కోట్లు సాధించింది. గుజరాత్ రూ.11,743 కోట్లు (12% వృద్ధి), కర్ణాటక రూ.12,937 కోట్లు (10% వృద్ధి), హర్యానా రూ.10,065 కోట్లు (9% వృద్ధి) నమోదు చేశాయి. అయితే తమిళనాడు మాత్రం స్వల్పంగా 2 శాతం తగ్గుదలతో రూ.9,776 కోట్లకు పరిమితమైంది.


