
ఈ ఏడాది 10–15 శాతమే
అంచనాలు తగ్గించిన కంపెనీలు
ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాలు
ఉష్ణోగ్రతలు తగ్గడంతో తక్కువ విక్రయాలు
జూన్లో తిరిగి పుంజుకున్న అమ్మకాలు
గతేడాది 25 శాతం వృద్ధి నమోదు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా భిన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది రూమ్ ఏసీల విక్రయాలు 10–15 శాతమే పెరగొచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా అధిక డిమాండ్ ఉండే జూన్లో ఉత్తర, పశ్చిమ భారత్లో వేడి వాతావరణం నెలకొనగా, మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో కంపెనీలు తమ అంచనాలను తగ్గించుకున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా ఏసీల అమ్మకాలకు వేసవి సీజన్ ఎంతో కీలకం.
అధిక శాతం అమ్మకాలు ఈ సీజన్లోనే నమోదవుతుంటాయి. కానీ ఈ ఏడాది వేసవిలో మధ్యంతర వర్షాలు ఈ రంగం ఆశలపై నీళ్లు చల్లింది. జూన్లో ఉత్తరాది అంతటా వేడి వాతావరణం నెలకొనడం ఒక్కటి విక్రయాలకు కాస్తంత మద్దతునిచ్చే అంశం. నిజానికి ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఫిబ్రవరి, మార్చిలోనే రూమ్ ఏసీల అమ్మకాలకు అధికంగా నమోదు కావడం గమనార్హం. దీంతో గతేడాది సీజన్తో పోలి్చతే ఈ ఏడాది 25 శాతం అధిక అమ్మకాలపై కంపెనీలు అంచనాలు వేసుకున్నాయి.
తర్వాత మారిన వాతావరణ పరిస్థితులతో ఈ అంచనాలు నిజం కాలేదు. ‘‘25–30 శాతం మేర అమ్మకాల వృద్ధిని ఆశించాం. కానీ, అనుకున్న స్థాయిలో అమ్మకాలు సాధించలేదు. ఈ వేసవి నిరాశపరిచిందనడంలో సందేహం లేదు. కానీ, వ్యాపారంలో ఇదొక భాగమే. ఈ పరిస్థితులను అధిగమించి ముందుకు వెళ్లాల్సిందే’’అని బ్లూస్టార్ ఎండీ బి.త్యాగరాజన్ తెలిపారు. మొత్తానికి ఈ ఏడాది ఆర్ఏసీ విక్రయాలు 10–15% వృద్ధికి పరిమితం కావొచ్చని చెప్పారు. జూన్ మధ్య నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయంటూ భారత వాతావరణ శాఖ గత వారం అంచనాలు వెల్లడించడం గమనార్హం.
సెపె్టంబర్ క్వార్టర్లో పుంజుకోవచ్చు..
ప్రస్తుత జూన్ త్రైమాసికం రూమ్ ఏసీ రంగానికి అనుకూలంగా లేదని.. సెపె్టంబర్ త్రైమాసికంలో విక్రయాలు పుంజుకోవచ్చని త్యాగరాజన్ పేర్కొన్నారు. పండుగల సందర్భంగా డిమాండ్ పెరగొచ్చన్నారు. ఎనర్జీ లేబుళ్లు మారుతుండడం, డిస్కౌంట్ ఆఫర్లతో గత నిల్వలను తగ్గించుకోగలమన్నారు. ఇంధన ఆదా లేబుళ్లను మార్చే ముందు ముందస్తు కొనుగోళ్లు పెరగడం సహజమేనన్నారు.
2024 అమ్మకాలతో పోల్చి చూసినప్పుడు గత రెండు నెలల్లో ఎలాంటి వృద్ధి కనిపించలేదని వోల్టాస్ ఎండీ, సీఈవో ప్రదీప్ బక్షి సైతం తెలిపారు. కనుక జూన్ త్రైమాసికంలో అమ్మకాల పరంగా పెద్ద వృద్ధి నమోదు కాకపోవచ్చని, గతేడాది మాదిరిగా 25 శాతం వృద్ధిని సాధించడం సవాలుగా పేర్కొన్నారు. వేసవిలో అమ్మకాలు గరిష్టంగా ఉండే సమయంలో వర్షాలు దెబ్బతీసినట్టు చెప్పారు. ఏప్రిల్, మే నెలలో అమ్మకాల వృద్ధిని కోల్పోవడంతో, మిగిలిన ఏడాదిలో కోలుకోవడం కష్టమని అభిప్రాయపడ్డారు. గత కొన్ని రోజుల నుంచి ఉత్తరాదిలో వేడి వాతావరణంతో ఏసీల అమ్మకాలు పుంజుకున్నాయంటూ, ఇదొక్కటే సానుకూలతగా పేర్కొన్నారు.
జూన్లో కాస్త మెరుగు..
హైయర్ అప్లయన్సెస్ ఇండియా మాత్రం ఈ ఏడాది ఇప్పటి వరకు మెరుగైన వృద్ధిని సొంతం చేసుకుంది. గతేడాదితో పోలి్చతే రూమ్ ఏసీల అమ్మకాలు 30 శాతం పెరిగినట్టు సంస్థ ప్రెసిడెంట్ ఎన్ఎస్ సతీష్ వెల్లడించారు. ‘‘ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలకు సానుకూలంగా లేవు. 10–15 శాతం మేర అమ్మకాలు తగ్గాయి. జూన్లో తిరిగి అమ్మకాలు పుంజుకున్నాయి.
ఫిబ్రవరి, మార్చిలోనే ప్రణాళిక మేరకు ముందస్తు కొనుగోళ్లు జరిగాయి’’అని వివరించారు. కానీ, ఏప్రిల్, మే నెలల్లో కొనుగోలు చేద్దామనుకున్న కస్టమర్లు.. ఉష్ణోగ్రతలు పెరగకపోవడంతో వాయిదా వేసుకున్నట్టు చెప్పారు. ముఖ్యంగా జూన్లో గత పది రోజులుగా ఉత్తరాది ప్రాంతంలో అమ్మకాలు పెరిగినట్టు తెలిపారు. 2025 సంవత్సరంలో మిగిలిన కాలానికి పరిశ్రమ అంచనాలు తగ్గించుకున్నట్టు సతీష్ తెలిపారు. గతేడాది స్థాయిలో వృద్ధి ఉండకపోవచ్చంటూ.. అమ్మకాలు 10–15 శాతం వృద్ధికి పరిమితం కావొచ్చన్నారు.