ఏఐని నమ్ముకుంటే ఇంజినీరింగ్‌ నైపుణ్యాలకు దెబ్బ | Nasscom warns of decline in deep engineering skills as AI takes over routine work | Sakshi
Sakshi News home page

ఏఐని నమ్ముకుంటే ఇంజినీరింగ్‌ నైపుణ్యాలకు దెబ్బ

Jul 15 2026 12:09 AM | Updated on Jul 15 2026 12:09 AM

Nasscom warns of decline in deep engineering skills as AI takes over routine work

నాస్కామ్‌ హెచ్చరిక

న్యూఢిల్లీ: ప్రాథమిక ఇంజినీరింగ్‌ నైపుణ్యాలను పెంపొందించడంలో పరిశ్రమ, విద్యా సంస్థలు గనుక విఫలమైతే భారత్‌లో సాంకేతిక నిపుణులు ఏఐని రూపొందించే వారిగా కాకుండా, ఏఐపై ఆధారపడిన ఉద్యోగులు గా మారిపోయే ప్రమాదం ఉందని ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్‌ హెచ్చరించింది. దేశంలో కొత్తగా ఉద్యోగాల్లో చేరుతున్న టెకీల్లో  90 శాతం మందికి పైగా ఇప్పటికే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)ని వాడుకుంటున్నారని.. అయితే, సాధారణ కోడింగ్‌ పనులను తగ్గించుకోవడం వల్ల ప్రాథమిక సాంకేతిక నైపుణ్యాలు పడిపోతే మొదటికే మోసం వస్తుందని పేర్కొంది.

’భారత్‌లో ఏఐ–నేటివ్‌ టాలెంట్‌ పరిస్థితి’ పేరుతో మంగళవారం విడుదల చేసిన అధ్యయన నివేదిక మొదటి ఎడిషన్‌లో నాస్కామ్‌ ఈ అంశాలను వెల్లడించింది. ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులతో సహా మూడేళ్ల వరకు అనుభవం ఉన్న ప్రారంభ స్థాయి టెక్నాలజీ ప్రొఫెషనల్స్‌లో ఏఐ సామర్థ్యాలను అంచనా వేసేందుకు నిర్మాణాత్మక పరిశ్రమ ప్రామాణికతను ఇది అందిస్తుంది. ‘ఏఐ–నేటివ్‌ టెక్నాలజీ ప్రతిభకు గ్లోబల్‌ హబ్‌గా ఆవిర్భవించే వినూత్న అవకాశం భారత్‌ ముందుంది.

ఏఐ నైపుణ్యాలను విస్తరించడం, ఏఐ రూపకల్పన ఒకటి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. భారత్‌లో ఏఐని అభివృద్ధి్ద చేసే ఉద్యోగులకు బదులు ఏఐపై ఆధారపడే వారిని తయారు చేసే ప్రమాదం పొంచి ఉంది. విద్యా సంస్థలు మౌలిక అంశాలను బలోపేతం చేయాలి. అలాగే ఏఐ వాడకం ద్వారా రోజువారీ కోడింగ్‌ పనులను తగ్గించుకోవడం వల్ల ప్రాథమిక ఇంజినీరింగ్‌ నైపుణ్యాలు పడిపోకుండా ఉండేలా పరిశ్రమ కూడా ఆన్‌బోర్డింగ్, మెంటార్‌íÙప్‌లను మెరుగుపరుచుకోవాలి’ అని నాస్కామ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్, చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ సంగీతా గుప్తా అభిప్రాయపడ్డారు.  

నివేదికలో ముఖ్యాంశాలివీ...
భారత్‌లోని యువ ఉద్యోగుల్లో మూడింట రెండొంతుల మందిలో ‘ఏఐ నైపుణ్యం’ ఉంది, కేవలం 23 శాతం మంది మాత్రమే ‘ఏఐ–నేటివ్‌’ అర్హతను కలిగి ఉన్నారు. 
అయితే, ఇంజినీరింగ్‌ నైపుణ్యం, సాంకేతిక మూలాలను బలోపేతం చేయడం ద్వారా ఈ ప్రతిభావంతుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవచ్చు. 
ఉత్పాదకతను మెరుగుపరచడం, వేగంగా నేర్చుకోవడంలో ఏఐ చాలా బాగా ఉపయోగపడుతోంది, అయితే, జూనియర్‌ ఇంజినీర్లు తమ ప్రాథమిక పరిజ్ఞానాన్ని పెంచుకునే సాధారణ పనులు సైతం ఏఐ వల్ల ఆటోమేట్‌ అవుతున్నాయి. 

దీంతో గతంలో ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకున్న స్వతంత్ర నిర్ణయాధికారం, సమన్వయ నైపుణ్యాలను ఇంజినీర్లు అభివృద్ధి చేసుకునేందుకు కంపెనీలు, విద్యా సంస్థలు ఉద్దేశపూర్వకంగా అవకాశాలను తిరిగి సృష్టించాల్సి వస్తుంది. 
ఈ మార్పు జరగాలంటే సుదీర్ఘ కాలంగా పాటిస్తున్న నిర్వహణ విధానాల విషయంలో ఐటీ పరిశ్రమ పునారాలోచించుకోవాల్సి ఉంటుంది. 
నియామకాల మదింపు కోసం ప్రాథమిక కోడింగ్‌ పరిజ్ఞానం నుంచి సమగ్రమైన ఏఐ–నేటివ్‌ సామర్థ్యాలను అంచనా వేసే దిశగా మారాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement