మళ్లీ ఐపీవోల జోరు | 23 firms launch IPOs worth Rs 27000 cr in 2026 | Sakshi
Sakshi News home page

మళ్లీ ఐపీవోల జోరు

Jun 17 2026 4:21 AM | Updated on Jun 17 2026 4:21 AM

23 firms launch IPOs worth Rs 27000 cr in 2026

ఈ ఏడాది ఇప్పటికే 23 కంపెనీలు  

రూ. 27,000 కోట్లు సమీకరణ 

లిస్టులో సీఎంఆర్‌ గ్రీన్, హెక్సాగాన్‌ న్యూట్రిషన్‌

163 కంపెనీలకు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌

న్యూఢిల్లీ: మార్కెట్లలో అనిశ్చితి, ఒడిదుడుకులు నెలకొన్నప్పటికీ ఐపీవో మార్కెట్‌ నెమ్మదిగా పుంజుకుంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఈక్విరస్‌ క్యాపిటల్‌ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు రూ. 27,000 కోట్ల సమీకరణ కోసం 23 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూల బాట పట్టాయి. సీఎంఆర్‌ గ్రీన్‌ టెక్నాలజీస్, హెక్సాగాన్‌ న్యూట్రిషన్‌ జూన్‌లోనే ఐపీవోకి వచ్చాయి. 

ఇన్సూర్‌టెక్‌ సంస్థ టర్టిల్‌మింట్‌ ఫిన్‌టెక్‌ సొల్యూషన్స్, అద్విత్‌ జ్యుయెల్స్‌ ఐపీవోలు జూన్‌ 19, 23 తేదీల్లో మొదలవుతున్నాయి. కార్డీలియా క్రూయిజెస్‌ని నిర్వహించే వాటర్‌వేస్‌ లీజర్‌ టూరిజం ఇష్యూ కూడా ఇదే నెలలో రానుంది. ఇక, దేశీయంగా అతి పెద్ద స్టాక్‌ ఎక్సే్చంజ్‌ ఎన్‌ఎస్‌ఈ ఈ వారంలో ముసాయిదా పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. అటు క్విక్‌ కామర్స్‌ దిగ్గజం జెప్టో,  ఎస్‌బీఐ మ్యూచువల్‌ ఫండ్స్‌ వచ్చే నెలలో పబ్లిక్‌ ఇష్యూలను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  

సన్నాహాల్లో మరో 236 సంస్థలు .. 
ఈ ఏడాది మే నాటికి 236 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాల్లో ఉన్నాయి. వీటిలో 163 సంస్థలకు మార్కెట్ల నియంత్రణ సంస్థ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించగా, మరో 73 కంపెనీలు ఆమోదముద్ర కోసం ఎదురుచూస్తున్నాయి. 2025లో 103 ఇష్యూల ద్వారా కంపెనీలు రికార్డు స్థాయిలో రూ. 1.76 లక్షల కోట్లు సమీకరించాయి. అంతక్రితం ఏడాది 2024లో 90 కంపెనీలు రూ. 1.6 లక్షల కోట్లు, 2023లో 57 సంస్థలు రూ. 49,436 కోట్లు దక్కించుకున్నాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో నాలుగు కంపెనీలు ఐపీవోల ద్వారా రూ. 2,422 కోట్లు సమీకరించాయి. 

తొలి త్రైమాసికంలో 19 సంస్థలు రూ. 24,772 కోట్లు సమకూర్చుకున్నాయి. 2025 నాలుగో త్రైమాసికంలో 30 ఇష్యూల ద్వారా కంపెనీలు రూ. 91,058 కోట్లు దక్కించుకున్నాయి. ఈక్విరస్‌ రిపోర్ట్‌ ప్రకారం మార్కెట్లో పరిస్థితులు కఠినతరం కావడం, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో గతేడాది సెప్టెంబర్‌ తర్వాత నుంచి ఐపీవో కార్యకలాపాలు గణనీయంగా నెమ్మదించాయి. అయితే విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నప్పటికీ, దేశీ రిటైల్‌ ఇన్వెస్టర్లు మాత్రం సిప్‌ల విధానంలో మార్కెట్లో పెట్టుబడులను కొనసాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో నెలవారీ సిప్‌ల ద్వారా రూ. 30,000 కోట్లకు పైగా పెట్టుబడులు మార్కెట్లోకి వస్తున్నాయి.

19న టర్టిల్‌మింట్‌ ఇష్యూ.. 
ఇన్సూర్‌టెక్‌ సంస్థ టర్టిల్‌మింట్‌ ఫిన్‌టెక్‌ సొల్యూషన్స్‌ ఐపీవో జూన్‌ 19న ప్రారంభమై 23న ముగియనుంది. జూన్‌ 29న లిస్ట్‌ అవుతుంది.  ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 883 కోట్లు సమీకరిస్తోంది. షేరు ధర శ్రేణి రూ. 144–152గా ఉంటుంది. ఐపీవోలో భాగంగా రూ. 660.72 కోట్ల విలువైన షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద ప్రస్తుత షేర్‌హోల్డర్లు రూ. 221.95 కోట్ల విలువైన విక్రయించనున్నారు.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement