సాక్షి, అనంతపురం: తాడిపత్రిలో శాంతి భద్రతలను పోలీసులు గాలికొదిలేశారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి. పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా? అని ప్రశ్నించారు. తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ చొక్కా తీసేసి.. టీడీపీ కండువాలు వేసుకుంటే మంచిది అంటూ ఘాటు విమర్శలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి డైరెక్షన్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. విచ్చలవిడిగా గంజాయి, ఛైన్ స్నాచింగ్స్ కొనసాగుతున్నాయి. అయినప్పటికీ పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇచ్చే లంచాలకు పోలీసు అధికారులు అలవాటు పడ్డారు. అందుకే తాడిపత్రిలో శాంతి భద్రతలను పోలీసులు గాలికొదిలేశారు. పోలీసు అధికారులు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆగడాలను చూసిచూడనట్లు వదిలేస్తున్నారు.
పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయాలంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అనుమతి కావాలా?. నేరాలకు పాల్పడటం. కౌంటర్ కేసులు పెట్టడం. జేసీ ప్రభాకర్ రెడ్డికి అలవాటుగా మారింది. తాడిపత్రి పోలీసు అధికారులు ఖాకీ చొక్కా తీసేసి.. టీడీపీ కండువాలు వేసుకుంటే మంచిది. జేసీ దౌర్జన్యాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటాం. ఈనెల 26వ తేదీన జరిగే సామూహిక దీక్ష విజయవంతం చేయండి’ అని పిలుపునిచ్చారు.


