ప్రజలు, దేవుడు.. అంతా చూసున్నారు: వైఎస్‌ జగన్‌ | YS Jagan Reaction On Posani Arrest | Sakshi
Sakshi News home page

ప్రజలు, దేవుడు.. అంతా చూసున్నారు: వైఎస్‌ జగన్‌

Feb 27 2025 10:59 AM | Updated on Feb 27 2025 11:41 AM

YS Jagan Reaction On Posani Arrest

గుంటూరు, సాక్షి: పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) అక్రమ అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఖండించారు. పోసాని భార్య కుసుమలతను ఫోన్‌లో పరామర్శించిన ఆయన.. పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. 

‘‘ప్రజలు, దేవుడు అంతా చూస్తున్నారు. పోసాని కృష్ణమురళికి వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది. మేం అందరం మీకు తోడుగా ఉంటాం. పార్టీ తరఫున న్యాయ సహాయం అందిస్తాం. సీనియర్‌ న్యాయవాదులకు ఆ బాధ్యతలు అప్పగించాం. పొన్నవోలు సహా అందరినీ రాజంపేటకు పంపించాం. నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించాం. ఈ కష్టకాలంలో మీరు ధైర్యంగా ఉండండి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదు’’ అని వైఎస్‌ జగన్‌(YS Jagan) అన్నారు. 

ఇదిలా ఉంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏపీఎఫ్‌టీవీడీసీ ఛైర్మన్‌గా పోసాని పని చేశారు. అయితే ఏపీ  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు.  ఆపై ప్రెస్‌ మీట్‌ నిర్వహించి మరీ ఇకపై రాజకీయాలు మాట్లాడబోనని, వాటికి దూరంగా ఉంటానని ప్రకటించారు. అయితే.. 

అనూహ్యంగా హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన అన్నమయ్య జిల్లా రాయచోటి పోలీసులు.. ఆయనపై కేసు నమోదైందని చెబుతూ అప్పటికప్పుడే ఆయన భార్యకు నోటీసులు అందజేసి వెంట తీసుకెళ్లారు. తన ఆరోగ్యం బాగోలేదని, భోజనం చేసి తానే వస్తానని చెప్పినా వినలేదు. ఈ క్రమంలో పోసాని కుటుంబ సభ్యులతోనూ రాయచోటి పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మరోవైపు పోసానిని ఎక్కడికి తీసుకెళ్తున్నారనే విషయం కూడా చెప్పకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. 

గతంలో.. సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని జనసేన(Jana Sena) నేత మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణ మురళిపై అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. పోసానిపై 196, 353(2), 111 రెడ్‌విత్‌ 3(5) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఇదీ చదవండి: పోసాని అరెస్ట్‌.. అసలు జరిగింది ఇదే!

Advertisement
 
Advertisement
Advertisement