నందిగం సురేష్‌ కేసు.. పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు | Supreme Court Issue Notices To AP police Over Nandigam Suresh Case | Sakshi
Sakshi News home page

నందిగం సురేష్‌ కేసు.. పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు

Nov 22 2024 12:06 PM | Updated on Nov 22 2024 12:06 PM

Supreme Court Issue Notices To AP police Over Nandigam Suresh Case

సాక్షి, ఢిల్లీ: మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఏపీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కిషోర్ మిశ్రా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

మాజీ ఎంపీ సురేష్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా నందిగం సురేష్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ వాదనలు వినిపిస్తూ..‘ఇది రాజకీయ కక్షతో పెట్టిన కేసు. ఘటన జరిగిన ప్రాంతంలో సురేష్ లేరు. దర్యాప్తు అధికారి ఫేవర్ చేశారని  స్థానిక జడ్జి ఎలా చెబుతారు. 2020లో రాయి తగిలి మృతిచెందిన మరియమ్మ కేసులో 78వ నిందితుడుగా చేర్చి సురేష్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుడైన మాజీ ఎంపీ సురేష్ పేరును అక్రమంగా ఈ కేసులో చేర్చారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా టీడీపీ ప్రభుత్వం సురేష్‌పై కేసులు బనాయిస్తోంది. ఇతర కేసులు పెట్టి మాజీ ఎంపీని ప్రభుత్వం వేధిస్తోందన్నారు. వాదనల అనంతరం​, ధర్మాసనం పోలీసులకు నోటీసులు ఇచ్చింది.

మరోవైపు.. సురేష్‌ బార్య బీబీ లత మాట్లాడుతూ..‘టీడీపీ ప్రభుత్వం మాపైన అక్రమ కేసులు బనాయిస్తోంది. దళితుడు ఎదగడాన్ని ఓర్చలేక అసూయతో కేసులు పెడుతున్నారు. నాలుగేళ్ల నాటి కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశారు. న్యాయస్థానాలపై మాకు నమ్మకం ఉంది. న్యాయపోరాటంలో మేము గెలుస్తాం. దేవుడు, మా అధ్యక్షుడు వైఎస్ జగన్ మాకు అండగా ఉన్నారని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement