
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లని నిండి వెలుపల క్యూలైన్ లో వేచిఉన్న భక్తులు స్వామివారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. సర్వదర్శనం కోసం 24గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 5 గంటలు. ఇక ఆదివారం 80,964 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్లో 27,657 తలనీలాలు సమర్పించారు. మొత్తంగా శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.89 కోట్లు లెక్క తేలింది.
నేడు శ్రీవారి పార్వేట ఉత్సవం
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పార్వేట ఉత్సవం మకర సంక్రాంతి పర్వదినం మరుసటిరోజున కనుమ పండుగనాడైన నేడు మంగళవారం (జనవరి 16న) అత్యంత ఘనంగా జరగనుంది. ఇదే రోజు గోదాపరిణయోత్సవం విశేషంగా నిర్వహిస్తారు.
గోదాపరిణయోత్సవం సందర్భంగా ఉదయం 9 గంటలకు ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ్యర్స్వామి మఠం నుండి ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి తీసుకు వెళ్ళి స్వామివారికి సమర్పిస్తారు.
ఆనంతరం మధ్యాహ్నం 1 గంటకు శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ కృష్ణస్వామివారు పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఆస్థానం, పారువేట కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం స్వామివారు ఆలయానికి చేరుకుంటారు.
ఆర్జితసేవలు రద్దు :
ఈ ఉత్సవాల కారణంగా జనవరి 16న శ్రీవారి ఆలయంలో నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, బ్రహ్మోత్సవం మరియు సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.