తిరుమలలో దారుణం | Anjaneya Swamy statue stolen from Ghat Road | Sakshi
Sakshi News home page

తిరుమలలో దారుణం

Jul 23 2026 4:55 AM | Updated on Jul 23 2026 4:55 AM

Anjaneya Swamy statue stolen from Ghat Road

విగ్రహం లేకుండా కనిపిస్తున్న ఆంజనేయస్వామి ఆలయం , చోరీకి గురైన ఆంజనేయ స్వామి విగ్రహం

ఘాట్‌ రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం అపహరణ 

భద్రతా వ్యవస్థ, టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ తీరుపై విమర్శలు 

సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన.. అన్ని కోణాల్లో దర్యాప్తు 

ఆ విగ్రహం పురాతనమైనది కాదని చెప్పడంపై విమర్శలు 

ఒంగోలులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  

తిరుమల: తిరుమల–తిరుపతి మొదటి ఘాట్‌ రోడ్డులో­ని ఏడో మైలు వద్ద భక్తులు నిత్యం పూజలు నిర్వహించే ఆంజనేయస్వామి విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం వేకువజామున అపహరించడం కలకలం రేపింది. ఈ ఘటనతో టీటీడీ భద్రతా వ్యవస్థ, విజిలెన్స్‌ విభాగం రాత్రి గస్తీ నిర్వహణపై  సందేహాలు తలెత్తుతున్నాయి. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

బుధవారం ఉదయం పూజల కోసం వచ్చిన స్థానికులు, భక్తులకు విగ్రహం కనిపించకపోవడంతో వెంటనే టీటీడీ విజిలెన్స్‌ విభాగానికి, పోలీ­సులకు సమాచారం అందించారు. పోలీసులు, క్లూస్‌ టీమ్‌ ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. ఘాట్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తుల కదలికలను గుర్తించే పనిలో ప్రత్యే­క బృందాలు నిమగ్నమయ్యాయి. విగ్రహాన్ని వాహ­నంలో తరలించారా? లేక కాలినడకన తీసుకెళ్లా­రా? అనే కోణాల్లోనూ విచారణ కొనసాగుతోంది.

తిరు­మలలో 24 గంటలపాటు టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది గస్తీ నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆంజనేయస్వామి విగ్రహం మాయం కావడం భద్రతా వ్యవస్థ సమర్థతపై సందేహాలకు తావిస్తోంది. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘాట్‌ రోడ్డులోని చిన్న దేవాల­యాలు, విగ్ర­హాలు, మండపాలకు ప్రత్యేక భద్రత కల్పించా­లని కోరుతున్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్‌ను మ­రింత బలో­పేతం చేయడంతో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణను మరింత సమర్థంగా నిర్వహించాలని సూచిస్తున్నారు.

పోలీసుల అదుపులో నిందితుడు 
సాంకేతిక ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు, ఇతర కీలక సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు ఒంగోలు రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీసుల ప్రాథ­మిక విచారణలో నిందితుడు విశాఖపట్నానికి చెందిన పి.జస్వంత్‌గా గుర్తించారు. నిందితుడి నేపథ్యం, విగ్రహం స్వా«దీనం తదితర అంశాలపై తిరుపతి జిల్లా పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. 

పోలీసులు అలా ఎందుకు చెప్పారు? 
హనుమాన్‌ విగ్రహం చోరీ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, అనుమానితుల కదలికల ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు. విగ్రహాన్ని త్వరలోనే స్వా«దీనం చేసుకుని బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై టీటీడీ అధికారులు పూర్తి స్థాయి నివేదిక కోరినట్లు సమాచారం. కాగా, ఈ ఘటనకు సంబంధించి తిరుపతి జిల్లా పోలీసులు విడుదల చేసిన ప్రకటనపై పలు ప్రశ్నలు, సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. 

ఒక అడుగు ఎత్తున్న హనుమాన్‌ రాతి విగ్రహాన్ని జూలై 22వ తేదీ తెల్లవారుజామున 3 గంటల సమయంలో గోవిందమాల ధరించిన ఓ భక్తుడు తీసుకెళ్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పోలీసులు, టీటీడీ విజిలెన్స్‌తో కలిసి 10 ప్రత్యేక బృందాల ద్వారా ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ ఘటన ఎక్కడికి దారితీస్తుందోనని ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. ఈ విగ్రహం పురాతనమైనది కాదని చెప్పే ప్రయత్నం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విగ్రహాన్ని కొందరు భక్తులు 2000 సంవత్సరం తర్వాత ప్రతిష్టించారని ప్రత్యేకించి చెప్పడంలో ఉద్దేశం ఏమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన టీటీడీ నిఘా, భద్రత వ్యవస్థలో డొల్లతనాన్ని మరోమారు ఎత్తి చూపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement