రెండేళ్లుగా కొనేవారు లేక ధరలు పతనమై నష్టపోతున్నాం
వైఎస్ జగన్తో గోడు వెళ్లబోసుకున్న పొగాకు రైతులు
ప్రభుత్వం ఆదుకునే చర్యలు తీసుకోవడం లేదు
కంపెనీలు, వ్యాపారులు సిండికేట్గా మారారు
ధర పెంచకుండా దోపిడీకి పాల్పడుతున్నారు
ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి పట్టించుకోవడం లేదు
ఆయన చెబుతున్నది ఒకటి.. జరుగుతోంది మరొకటి
మీరు మా ప్రాంతంలో పర్యటించాలని ముక్త కంఠంతో కోరిన అన్నదాతలు
సాక్షి, అమరావతి: ‘రెండేళ్లుగా పొగాకు రైతుల పరిస్థితి దుర్భరంగా తయారైంది. గతేడాది నల్లబర్లి పొగాకు కొనేవారు లేక నష్టపోతే, ఈ ఏడాది ధరల పతనంతో ఆర్థికంగా కుదేలవుతున్నాం. ఈ ప్రభుత్వానికి రైతులను ఆదుకోవాలి.. అండగా నిలవాలన్న ఆలోచన ఏ కోశాన కన్పించడం లేదు’ అని పొగాకు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగైతే ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వారు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో పార్టీ కేంద్ర కార్యాలయంలో భేటీ అయ్యారు. రెండేళ్లుగా తీవ్ర కష్టాలు, నష్టాలు ఎదుర్కొంటున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం ఏమాత్రం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు ఏమన్నారంటే..
కోవిడ్ పరిస్థితులున్నా మీరు అండగా నిలిచారు
మీ హయాంలో పొగాకు సాగులో సంక్షోభం ఉంటే, మీరు చాలా చొరవ చూపారు. అప్పుడు కోవిడ్ ఉన్నా, మీరు స్వయంగా పొగాకు కొంటామని చెప్పారు. అది చేసి చూపారు. మీరు మార్కెట్లో జోక్యం చేసుకోవడం వల్ల మంచి ధర లభించింది. ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొనే వారులేక ప్లాట్ఫామ్స్ నుంచి పొగాకు వెనక్కు తీసుకువెళ్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఫిబ్రవరి వరకు వేలం కొనసాగే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్లో కర్ణాటకలో వేలం మొదలవుతుంది. ఆలోగా ఇక్కడ కొనుగోళ్లు పూర్తికాకపోతే, మాకు చాలా సమస్య వస్తుంది. సిగరెట్ ప్యాకెట్ల రేటు రూ.170 నుంచి రూ.240 వరకు పెరిగింది. పొగాకు పండించే రైతుకు మాత్రం రేటు పడిపోయింది. పొగాకు పంట సాగుకు ఎకరానికి రూ.2.30 లక్షలు ఖర్చు అవుతుంది. కానీ, ఇప్పుడు పలుకుతున్న ధరలు ఏ మాత్రం గిట్టుబాటు కావడం లేదు. – మారెడ్డి సుబ్బారెడ్డి, టుబాకో బోర్డు మెంబర్, ప్రకాశం జిల్లా
ఎప్పటికి కొంటారో తెలియడం లేదు
ప్రభుత్వం ఇచ్చిన ఇండెంట్ ప్రకారం పొగాకు ఎప్పటికి కొంటారో తెలియడం లేదు. గత ఏడాది కంటే ఈసారి పెట్టుబడి కేజీకి రూ.30 పెరగ్గా, ధర కేజీకి రూ.70 తగ్గింది. కేజీ పొగాకుతో 1,000 సిగరెట్లు తయారవుతున్నాయి. వాటి ద్వారా రూ.24 వేలు సంపాదిస్తున్నారు. అదే కేజీ పొగాకుకు మాకు రూ.265 మాత్రమే ఇస్తున్నారు. ఇదేం న్యాయం? ఎరువుల ధరలు పెరిగాయి. సాగు వ్యయం పెరిగింది. ధర దారుణంగా పడిపోయింది. మీరు దృష్టి పెడితేనే మాకు న్యాయం జరుగుతుంది.– మధు, పోలవరం, ఏలూరు జిల్లా
2023–24లో మంచి ధర పలికింది
మాది నీరు పెట్టి సాగు చేసే పొగాకు. ఈ ఏడాది 88 మిలియన్ కేజీల పంట కొంటారని అంచనా వేయగా, ఈరోజు వరకు 7.62 మిలియన్ కేజీలే కొన్నారు. ఈ ఏడాది కొనుగోలు ధర కేజీకి రూ.265 మాత్రమే. అది కూడా చెల్లించడం లేదు. ఇండెంట్ ఇచ్చినప్పుడు ఒక రేటు చెబుతున్నారు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రెండేళ్ల క్రితం 2023–24లో కేజీ పొగాకు ధర రూ.320కి పైగా పలికింది. ఈసారి 80 మిలియన్ కిలోల పొగాకు ఉంది. కానీ ఎంత వరకు కొంటారో తెలియడం లేదు. 40 శాతం పొగాకును వేలం కేంద్రాల్లో తిరస్కరిస్తున్నారు. పొగాకును బయటకు తీసుకొచ్చి, మళ్లీ తీసుకుపోతే రంగు మారుతుంది. క్వాలిటీ పడిపోతుంది. పొగాకు కొనుగోళ్లలో ఐటీసీ కూడా చొరవ చూపడం లేదు. – రాజేంద్రబాబు, గోపాలపురం, తూర్పుగోదావరి జిల్లా
మీరు వస్తేనే మాకు న్యాయం జరుగుతుంది
మా ప్రాంతంలో 2 వేలం కేంద్రాలున్నాయి. ఇప్పటి వరకు 4 రౌండ్ల వేలం జరిగింది. ఒక్కో రైతు నుంచి 8 క్వింటాళ్ల నుంచి 9 క్వింటాళ్ల వరకు మాత్రమే కొనుగోలు జరిగింది. అమ్మకాలు లేకపోవడం వల్ల పొగాకు క్వాలిటీ తగ్గుతోంది. పొగాకు మగ్గి పోవడంతో ఎగుమతి కాదంటూ వ్యాపారులు తిరస్కరిస్తున్నారు. కొంటున్న పొగాకుకు కూడా కేజీకి రూ.160 మాత్రమే దక్కుతోంది. రైతులు నష్టపోతున్నారు. మీరు వస్తే తప్ప మాకు న్యాయం జరగదు . – ఎన్.వెంకటేశ్వరరెడ్డి, కందుకూరు, నెల్లూరు జిల్లా
జీఎస్టీ సాకు చూపి ధరలో కోత పెడుతున్నారు
పొగాకు రైతుల బాధలు అన్నీ ఇన్నీ కావు. వ్యాపారుల మాయాజాలం చూస్తే.. ఎగుమతిదారులు ఆర్డర్ను డాలర్లలోనే ఇస్తారు. అలానే తీసుకుంటారు. డాలర్ ధర చాలా ఎక్కువగా ఉంది. గతేడాది ధర లేదు. పార్టీలకతీతంగా రైతులంతా మిమ్మల్ని కోరుకుంటున్నారు.. మీరు మా ప్రాంతాన్ని సందర్శించాలి. సిగరెట్ ఉత్పత్తిదారులు జీఎస్టీ సాకు చూపి తక్కువ ధర చెల్లిస్తున్నారు. – మారెళ్ల బంగారుబాబు, ఒంగోలు, ప్రకాశం జిల్లా
ఏటా 20 శాతం సాగు వ్యయం పెరుగుతోంది
ఏటా 20 శాతం వంతున వ్యయం పెరుగుతోంది కానీ ఆ స్థాయిలో ధర పెరగడం లేదు. ఈసారి ధర రూ.265 నుంచే మొదలు పెట్టారు. చివరకు దాన్ని రూ.175కు తగ్గించారు. ప్రారంభ ధర రూ.265 కూడా గిట్టుబాటు కాదు. కానీ, ఆ ధరకు కూడా కొనేది చాలా తక్కువ. ఈ ఏడాది 26 వేల బేళ్ల పొగాకు తెస్తే, కేవలం 6 వేల బేళ్ల పొగాకు మాత్రమే కొన్నారు. మార్కెట్లో డిమాండ్ లేదని వ్యాపారులు చెబుతున్నారు. పొగాకు వల్ల ఏటా కేంద్రానికి రూ.50 వేల కోట్ల నుంచి రూ.55 వేల కోట్ల ఆదాయం వస్తుంది. ఆ పొగాకు పండించే రైతులకు మాత్రం నష్టాలే మిగులుతున్నాయి. మాకు మీ వల్లనే న్యాయం జరుగుతుంది. మీరు అడుగు పెడితే, మా కష్టాలు తీరుతాయి.
– ఎస్.వెంకట్రావు, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా
క్వాలిటీ మా చేతుల్లో లేదు కదా..
ఎక్కడా పొగాకు అమ్ముడు పోవడం లేదు. బోర్డుకు తీసుకుపోతే నో బిడ్. పొగాకును ప్లాట్ఫామ్స్కు తీసుకుపోతే కొనకపోవడంతో, వెనక్కి తీసుకురావడం కష్టంగా ఉంది. చెట్టుకు 25 వరకు ఆకులు వస్తాయి. అన్నీ ఒకే నాణ్యతతో ఉండవు. కిందవి వేరుగా ఉంటాయి. చెట్టు మధ్య ఆకులు మాత్రమే బాగుంటాయి. కేవలం నాణ్యమైన ఎఫ్–1, ఎఫ్–2 పొగాకు మాత్రమే తెమ్మంటున్నారు. అది ఎలా సాధ్యం? క్వాలిటీ అనేది మా చేతుల్లో లేదు కదా? క్వాలిటీ లేదని రోజూ దాదాపు 45 శాతం వెనక్కు పంపిస్తున్నారు. టుబాకో బోర్డు మొత్తం సరుకు కొనేలా ఒత్తిడి తేవాలి. – జి.వెంకటేశ్వర్రెడ్డి, పొదిలి, ఉమ్మడి ప్రకాశం జిల్లా
జీవనోపాధి లేకుండా పోతుంది..
మా దగ్గర 13 వేల కుటుంబాలు పొగాకు సాగు చేస్తున్నాయి. ఇంకా సమీప ప్రాంతాల నుంచి చాలా మంది పొలాల్లో పని చేస్తున్నారు. దాదాపు లక్ష మంది వలస కూలీలు జీవనోపాధి వెతుక్కున్నారు. కానీ, పొగాకుకు ధర రావడం లేదు. గత ఏడాదీ అంటే. ఈ ఏడాది రూ.265 నుంచి మొదలు పెట్టి, కేవలం రూ.170 మాత్రమే చెల్లిస్తున్నారు. – మధ్యాహ్నపు ఏసు, కొయ్యలగూడెం, ఏలూరు జిల్లా
సిండికేట్ అయ్యామని వ్యాపారులే చెబుతున్నారు
మా దగ్గర పొగాకు కొనుగోళ్లు అస్సలు జరగడం లేదు. వ్యాపారులను అడిగితే, మేమంతా సిండికేట్ అయ్యాం. చంద్రబాబును కలిశాం. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు.. అంటున్నారు. మరో వైపు సీఎం మాత్రం మంచి ధర ఇవ్వాలని చెబుతున్నాడు. కానీ, వ్యాపారులు మాత్రం బేలుకు రూ.30 వేలు కాదు కదా.. రూ.16 వేలకు కూడా కొనడం లేదు. అంటే సీఎం మాటకు విలువ లేదా? లేక ఆయన డ్రామాలు చేస్తున్నాడా? మిమ్మల్ని ఓడించినందుకు అందరికీ బుద్ధి వచ్చింది. జగన్ ఉంటేనే అందరికీ న్యాయం జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నాం. – వెంకటేశ్వర్రెడ్డి, యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా
నాడు కరోనా వేళ కూడా మంచి లాభాలు
కరోనా విపత్కర పరిస్థితుల్లో సైతం కిలో పొగాకు రూ.180 నుంచి రూ.260 వరకు కొన్నారు. మాకు మంచి లాభాలు వచ్చాయి. ఇప్పుడు అస్సలు ధర లేదు. సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని, గిట్టుబాటు ధర వస్తుందని ప్రచారం చేశారు. కానీ, వ్యాపారులు పట్టించుకోవడం లేదు. ఈ ప్రభుత్వం చెబుతున్నది ఒకటి.. జరుగుతోంది మరొకటి. – ఎం.వెంకటనారాయణ, సంతనూతలపాడు, ప్రకాశం జిల్లా
ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదు
రాష్ట్రంలో 2.92 లక్షల ఎకరాల్లో పొగాకు సాగవుతోంది. ఇందులో ప్రకాశం, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాల్లోనే 1.75 లక్షల ఎకరాలు, ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 60 వేల ఎకరాలు సాగులో ఉంది. పొగాకు ధర గత ఏడాది నుంచి మరింత దారుణంగా పడిపోయింది. ప్రతి రోజూ ధర అమాంతం పడిపోతోంది. చాలా ప్లాట్ఫామ్స్ మీద 27 శాతం తిరస్కరణకు గురయ్యింది. ఇంకా కొన్ని చోట్ల అది దాదాపు 40 శాతం వరకు ఉంది. ప్రభుత్వం స్వయంగా కొనుగోలు చేస్తే సమస్య ఉండదు. ఇప్పుడు మార్క్ఫెడ్ను రంగంలోకి దింపాలి. అప్పుడే మంచి ధర వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం కేంద్రాన్ని కోరడం తప్ప ఏమీ చేయడం లేదు. – ఎంవీఎస్ నాగిరెడ్డి,వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు విభాగం)


