తిరుపతి సిటీ: నీట్ పేపర్ వరుస లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు పోరాటం కొనసాగుతుందని విద్యార్థి సంఘాల ఐక్యవేదిక హెచ్చరించింది. ఈ మేరకు ఎస్వీయూలో బుధవారం ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ిపీడీఎస్యూ, పీడీఎస్ఓ, ఎన్ఎస్యూఐ, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించాలని తీర్మానించారు. నాయకులు మాట్లాడుతూ అవినీతి, అక్రమాలకు కేంద్రంగా మారిన ఎన్టీఏను రద్దు చేసి పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల చలో పార్లమెంట్ కార్యక్రమంలో లక్షలాది మంది యువత శాంతియుతంగా పాల్గొన్నారని, వారిని చర్చలకు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పి లాఠీలతో విచక్షణారహితంగా కొట్టించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ క్రమంలో రాష్ట్ర విద్యార్థి సంఘాల పిలుపు మేరకు తిరుపతి జిల్లాలో శుక్రవారం బంద్కు పిలుపునిచ్చామని తెలిపారు. విద్యా సంస్థలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు. సమావేశంలో విద్యార్థి సంఘాల నాయకులు ప్రవీణ్ కుమార్, చిన్న, అక్బర్, పవిత్ర, మల్లికార్జున, బాలాజీ, వినోద్, అశోక్, రవి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


