తిరుపతి అర్బన్: పంట బీమా రైతులకు ఆర్థిక భరోసాను కల్పిస్తుందని, ప్రతి రైతూ పంట బీమా చేసుకోవాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సూచించారు. గురువారం ఆయన కలెక్టరేట్ నుంచి జిల్లా అగ్రికల్చర్ అధికారులతో పంట బీమాపై సమీక్షించారు. ప్రకృతి వైపరీత్యాలు, అధిక వర్షాలు, వర్షాభావం, తుపాన్లు, తాజాగా ఎన్నినో ప్రభావం తదితర పరిస్థితులతో పంటలకు నష్టం జరిగితే పంట బీమా ఆదుకుంటుందని తెలిపారు. అగ్రికల్చర్, ఉద్యానశాఖ, సహకార, రెవెన్యూశాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
వివాదాల పరిష్కారానికి ‘విశ్వాస్’
తిరుపతి అర్బన్: పెండింగ్లోని ఈపీఎఫ్ఓ (ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్) జరిమానా వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం వన్టైమ్ సెటిల్మెంట్ కోసం ఏర్పాటు చేసిన విశ్వాస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పీజనర్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్–1 రవితేజకుమార్రెడ్డి గురువారం ఓ ప్రకటనలో సూచించారు. ఈ పథకం జూన్ 29 నుంచి ఆరు నెలలు మాత్రమే అమల్లో అందుబాటులో ఉంటుందని, ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం కోర్టు కేసులను తగ్గించడం, దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న జరిమానా వివాదాలను త్వరితగతిన ముగించడమేనని పేర్కొన్నారు. 2024, జూన్ 14 కంటే ముందు జరిగిన పీఎఫ్ చెల్లింపులు ఆలస్యానికి సంబంధించి జరిమానాలు భారీగా తగ్గించనున్నట్టు వెల్లడించారు.
రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదల
తిరుపతి సిటీ: శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల అటానమస్ హోదాలో గత నెల 27 నుంచి ఈ నెల 8వ తేదీ వరకు జరిగిన డిగ్రీ సెకండ్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విడుదల చేసింది. ఈ మేరకు గురువారం ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ ఫలితాలను విడుదల చేశారు. పరీక్షల్లో 97.4 శాతం మంది విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించినట్టు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ ఎ విద్యుల్లత తెలిపారు. డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ భద్రమణి, డాక్టర్ దివ్యవాణి, డాక్టర్ సునీత, డాక్టర్ సరిత పాల్గొన్నారు.
బొప్పాయి రైతులను
ఇబ్బంది పెడితే కేసులు
తిరుపతి అర్బన్: బొప్పాయి రైతులను ఇబ్బంది పెడితే క్రిమినల్ కేసులు తప్పవని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ హెచ్చరించారు. గురువారం ఆయన జాయింట్ కలెక్టర్ గోవిందరావుతో కలసి బొప్పాయి రైతుల సమస్యల పరిష్కారం కోసం అధికారులతో సమీక్షించారు. డిమాండ్ లేదంటూ తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఊరు కోమని హెచ్చరించారు. సమావేశానికి రావా లని వ్యాపారులను ఆహ్వానించినా వారు హాజరుకాకపోవడం బాధ్యతారహిత్యమని పేర్కొన్నారు. మార్కెట్లలో కృత్రిమంగా బొప్పాయి నిల్వలు ఉంచి డిమాండ్ లేదని చూపితే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉద్యానశాఖ జిల్లా అధికారి జయభరత్రెడ్డి, మార్కెటింగ్ శాఖ అధికారి సురేంద్రబాబు పాల్గొన్నారు.
నేడు యథావిధిగా పీటీఎం
తిరుపతి ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాలు (పీటీఎం)ను కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం యథావిధిగా నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కేవీఎన్.కుమార్ తెలిపారు. విద్యార్థి సంఘాలు విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చినప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఈ పీటీఎంలో భాగంగా కలెక్టర్ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్పీజేఎన్ఎం పాఠశాలలో శుక్రవారం చేపట్టిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొననున్నట్లు తెలిపారు.


