
వెంకన్నకు ఎప్పటిలాగే ని‘వేదన’
ఫాదర్స్ డే స్పెషల్ : తండ్రులకు మద్దతుగా పిల్లలూ దీక్ష
300 రోజులకు చేరిన శ్రీవారిమెట్టు చిరు వ్యాపారుల దీక్షలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్: 10 నెలల బాలుడి నుంచి 75 ఏళ్ల ముదుసలి వరకు కుటుంబ సభ్యులతో సహా శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు దీక్ష చేశారు. స్థానిక కపిల తీర్థం రోడ్డులోని టీటీడీ పరిపాలనా భవనం వద్ద శ్రీవారిమెట్టు చిరువ్యాపారులు చేస్తున్న నిరసన దీక్ష ఆదివారం 300వ రోజుకు చేరుకుంది. ఆదివారం పూర్తిగా నిరాహార దీక్ష నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, అధ్యక్షులు జి.బాలసుబ్రమణ్యం, కార్యదర్శులు ఎస్.జయ చంద్ర, పి.మునిరాజలతోపాటు వ్యాపారులు, వారి కుటుంబ సభ్యులు సంఘీభావం ప్రకటించారు.
ఈ పర్యాయం దీక్షలో మహిళలు వారి పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం..ఫాదర్స్ డే రోజున తండ్రుల పోరాటానికి మద్దతుగా పసిపిల్లలు డిమాండ్ల ప్లకార్డులను పట్టుకుని నినాదాలు చేయడం ఆ మార్గంలో పలువురి దృష్టినీ ఆకర్షించింది. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్య దర్శి, శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల సంఘం గౌరవాధ్యక్షులు కందారపు మురళి మాట్లాడు తూ, చిన్న సమస్య పరిష్కారానికి వ్యాపారులు 300 రోజులుగా దీక్షలు చేస్తున్నా టీటీడీ యాజమాన్యం గానీ, కూటమి ప్రభుత్వం గానీ పరిష్కరించక పోవడం శోచనీయమని నిరసించా రు. టీటీడీ ఇఓ శ్యామలరావు, అడిషనల్ ఇఓ వెంకయ్య చౌదరి పలు పర్యాయాలు బాధితుల గోడు ఆలకించిననూ వారికి న్యాయం చేయలేదని విమర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, రిపబ్లికన్ పార్టీ దక్షిణ భారత అధ్యక్షులు పూతలపట్టు అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంగాటి గోపాల్ రెడ్డి, సీపీఐ నేత ఎన్డీ రవి, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు నీరుగట్టు నగేష్, తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నేత డీఎంసీ భాస్కర్, అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా కార్యదర్శి పి. సాయిలక్ష్మి, ఆప్కాస్ రాష్ట్ర అధ్యక్షులు చినబాబు, కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ జిల్లా చైర్మన్ నాగ వెంకటేష్ తదితరులు బాధితులకు సంఘీభావంగా మాట్లాడారు. సంఘ అధ్యక్షులు చిట్టిబాబు, యూనియన్ కార్యదర్శి మధు, యుగంధర్, ప్రకాష్ రామ్మూర్తి, శేఖర్, నరసింహ, మ ల్లి, మల్లికార్జున్, రాంబాబు, చిరంజీవి, శివ, గణేష్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.