సాక్షి, విశాఖ: చెరుకు రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయం చేయడం దండగ అన్న విధంగా చంద్రబాబు పాలనను నడిపిస్తున్నారన్నారు. ఈ రోజు (శుక్రవారం) విశాఖలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. చెరుకు రైతులను కూటమి సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని వారికి చెల్లించాల్సిన డబ్బులను సైతం చెల్లించడం లేదన్నారు.
రాష్ట్రంలో ఉన్న ఆరు షుగర్ ఫ్యాక్టరీలు మూసివేసేలా చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఏటికొప్పాక, తాండవ, భీమసింగ్ ఫ్యాక్టరీలను మూసివేయడానికి చంద్రబాబు యత్నిస్తున్నాడని తెలిపారు. షుగర్ రైతులను ఆదుకుంటున్నట్లు నలుగురు మంత్రులతో కమిటీ వేసి చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఒక్క గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మాత్రమే సహకార రంగంలో నడుస్తుందని, గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి రూ. 30 కోట్లు విలువైన చెరుకు తోలారని ఇప్పటికీ రైతులకు బకాయిలు ఇవ్వలేదన్నారు.
ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తామని చక్కెర పరిశ్రమల్లో రైతులే వాటాదారులని సెప్టెంబర్ నాటికి రైతులకు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి ప్రతిపాదన వస్తే మేము వ్యతిరేకించామని. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాలు రైతుల నడ్డి విరుస్తున్నాయన్నారు. చెక్కర కర్మాగారం కోసం పోరాడెందుకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి ప్రకటించారు.


