తిరోగమన‘మే’ | Sales tax reduced along with GST in Chandrababu coalition govt | Sakshi
Sakshi News home page

తిరోగమన‘మే’

Jun 19 2025 4:44 AM | Updated on Jun 19 2025 4:44 AM

Sales tax reduced along with GST in Chandrababu coalition govt

మే నెలలోనూ అదే దుస్థితి  రాష్ట్రంలో సంపద పెరగలేదు.. అప్పులే పెరిగాయి

జీఎస్టీతోపాటు అమ్మకం పన్ను తగ్గింది 

గత ఏడాది మే నెల వరకు పోలిస్తే జీఎస్టీ రూ.350 కోట్లు తగ్గింది 

ఇదే కాలంలో అమ్మకం పన్ను రూ.136 కోట్లు డౌన్‌ 

ప్రజల కొనుగోలు శక్తి నేలచూపులు  

సామాజిక, సంక్షేమ వ్యయం రూ.6,184 కోట్లు కిందికి.. 

కేంద్ర గ్రాంట్లలో భారీగా రూ.1,300 కోట్లు తగ్గుదల 

ఈ ఏడాది రెండు నెలల్లోనే రూ.22,505 కోట్లు అప్పు 

మే నెల వరకు బడ్జెట్‌ గణాంకాలను వెల్లడించిన కాగ్‌

సాక్షి, అమరావతి: ఈ ఏడాది మే నెలలోనూ రాష్ట్ర సంపద తిరోగమనంలోనే సాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర సంపద పెంచడంలో విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం పెంచడంలో మాత్రం గణనీయ ప్రగతి కనబరుస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలలైన ఏప్రిల్, మే నెల వరకు కాగ్‌ వెల్లడించిన బడ్జెట్‌ గణాంకాలను పరిశీలిస్తే  జీఎస్టీతోపాటు ఆమ్మకం పన్ను, పన్నేతర ఆదాయం తగ్గిపోయింది. 

ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు నెలల్లోనే ఏకంగా రూ.22,505 కోట్లు అప్పు చేసినట్లు స్పష్టమైంది. జీఎస్టీ, అమ్మకం పన్ను తగ్గిపోతోందంటే ప్రజల కొనుగోలు శక్తి దారుణంగా పడిపోతోందనడానికి బలమైన సంకేతమని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. ప్రజల కొనుగోలు శక్తి పెరిగితేనే జీఎస్టీ, అమ్మకం పన్నుల్లో వృద్ధి నమోదవుతుందని, లేదంటే ఆదాయం తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు. 

గత ఆర్థిక సంవత్సరం మే నెల వరకు వచ్చిన జీఎస్టీ ఆదాయం కన్నా.. ఈ ఏడాది మే నెల వరకు వచ్చిన ఆదాయం రూ.350 కోట్లు తగ్గిపోయింది. అమ్మకం పన్ను కూడా రూ.136 కోట్లు పడిపోయింది.  పన్నేతర ఆదాయమూ రూ.49 కోట్లు తగ్గిపోయింది. కేంద్ర నుంచి గ్రాంట్ల రూపంలో రాష్ట్రానికి రావాల్సిన నిధులూ ఏకంగా రూ.1300 కోట్లు తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం భాగస్వామిగా ఉన్నా.. గ్రాంట్లను తీసుకురావడంలో విఫలమైంది.  

ఇతర రాష్ట్రాల్లో పెరుగుదల.. ఇక్కడ తగ్గుదల  
సాధారణంగా జీఎస్టీ, అమ్మకం పన్నుల్లో ఏటా ఎంతో కొంత పెరుగుదల కనిపిస్తుంటుంది. అయితే ఈ ఏడాది ఎలాంటి విపత్కర పరిస్థితులు లేకున్నా.. జీఎస్టీ, పన్నుల ఆదాయం తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశమేనని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. 

జీఎస్టీ రాబడి మిగతా రాష్ట్రాల్లో పెరుగుతుండగా రాష్ట్రంలో తగ్గుతోందని, దీనికి కారణాలను లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. మరో పక్క ఈ ఏడాది ఏప్రిల్, మే రెండు నెలల్లోనే రూ.22,505 కోట్లు అప్పు తెచ్చినా.. మూలధన వ్యయం మే నెల వరకు రూ.2,242 కోట్లు మాత్రమే చేయడం కూడా ఆందోళన కలిగించే అంశమనే వాదన వినిపిస్తోంది. 

గత ఆర్థిక సంవత్సరం మేనెల వరకు విద్య, వైద్య, సంక్షేమం తదితర సామాజిక రంగాలపై చేసిన వ్యయంతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా రూ.6,184 కోట్లు తగ్గిపోయింది. సామాజిక రంగ వ్యయమూ సాధారణంగా గతం కన్నా  పెరగాలి. అయితే అందుకు భిన్నంగా తగ్గిపోవడం గమనార్హం. 

సంపద సృష్టించి సంక్షేమం, అభివృద్ధి చేస్తానంటూ ఎన్నికల ముందు ప్రగల్భాలు పలికిన సీఎం చంద్రబాబు గత ఆర్థిక సంవత్సరం సంపద సృష్టించకపోగా రాష్ట్ర ప్రజలపై అప్పుల భారం మోపారు. ఈ ఆర్థిక సంవత్సరమూ రెండు నెలల్లోనే భారీగా అప్పులు చేశారు. ఇదే విషయాన్ని కాగ్‌ గణాంకాలూ స్పష్టం చేస్తున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement