
తిరుమల: అక్టోబరు 15 నుంచి 23వ తేదీ వరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్రెడ్డితో కలిసి ఈవో సమీక్ష నిర్వహించారు. ఈవో మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయన్నారు.
అక్టోబరు 19న గరుడసేవ, 20న పుష్పక విమానం, 22న స్వర్ణరథం, 23న చక్రస్నానం నిర్వహించనున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలలో వయోవృద్ధులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్నపిల్లల తల్లిదండ్రుల ప్రత్యేక ప్రవేశ దర్శనాలను రద్దు చేసినట్లు ఈవో చెప్పారు. అక్టోబర్ 19న గరుడసేవ సందర్భంగా ఆ రోజు ద్విచక్ర వాహనాలను అనుమతించరన్నారు. జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, సీవీఎస్వో నరసింహ కిషోర్, సీఈ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నవీ ముంబయిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం..
నవీ ముంబయిలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తిరుమలలోని సింఘానియా గ్రూప్తో టీటీడీ ఎంఓయూ కుదుర్చుకుంది. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, రేమాండ్ గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ హరి సింఘానియా సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది. ఈవో మాట్లాడుతూ.. ముంబయి ఉల్వే ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో రూ.70 కోట్లతో శ్రీవారి ఆలయాన్ని నిరి్మంచేందుకు ఓ దాత ముందుకొచ్చారని తెలిపారు.