విదేశాలకే వి‘హారం’ | Increasing emigration of Indians | Sakshi
Sakshi News home page

విదేశాలకే వి‘హారం’

Jun 3 2024 4:25 AM | Updated on Jun 3 2024 4:25 AM

Increasing emigration of Indians

భారతీయుల్లో పెరుగుతున్న విదేశీయానం 

మాస్టర్‌ కార్డ్‌ ఎకనామిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజా నివేదికలో వెల్లడి 

ఎప్పుడూ లేనంతగా అంతర్జాతీయ ప్రయాణాలు 

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 10 కోట్ల మంది విమానయానం 

ఇది దశాబ్దం కిందటి వరకు ఒక ఏడాదిలో చేసే ప్రయాణాల సంఖ్య కావడం గమనార్హం 

వచ్చే ఐదేళ్లలో దేశంలో 2 కోట్ల మందికిపైగా విదేశీ పర్యటనలు 

ఈ వేసవిలో ఆమ్‌స్టర్‌డామ్, సింగపూర్, లండన్, ఫ్రాంక్‌ఫర్ట్, మెల్‌బోర్న్‌ల సందర్శనకు భారతీయుల ఆసక్తి 

హోటళ్ల రేట్లు పెరగడంతో క్రూయిజ్‌ ప్రయాణాలకు మొగ్గు చూపుతున్న పర్యాటకులు 

సాక్షి, అమరావతి:  భారతీయులు విదేశీయానాల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. 2019తో పోలిస్తే జపాన్‌లో 53 శాతం, అమెరికాలో 59 శాతం, వియత్నాంలో 248 శాతం భారతీయ ప్రయాణికులు రాకపోకలు పెరగడం విశేషం. మాస్టర్‌ కార్డ్‌ ఎకనామిక్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ‘బ్రేకింగ్‌ బౌండరీస్‌’ పేరుతో తాజా ట్రావెల్‌ ట్రెండ్స్‌ను విడుదల చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా భారతీయులు అంతర్జాతీయ ప్రయాణాలు చేస్తున్నట్టు నివేదిక పేర్కొంది. 

ఆదాయాన్ని మెరుగు పరచుకోవడంతో విదేశాలకు వెళ్లే భారతీయ ప్రయాణికులు సంఖ్య ట్రావెల్, టూరిజం రంగానికి ఊతమిస్తోందని నివేదిక పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల మందికిపైగా మధ్య తరగతి ప్రజలు (ఏడాదికి రూ.12 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్నవారు). 

దాదాపు 20 లక్షల మంది అధిక ఆదాయ ప్రజలు (ఏటా రూ.66 లక్షలు కంటే ఎక్కువ సంపాదిస్తున్న వారు) కూడా అంతర్జాతీయ ప్రయాణికుల జాబితాలో చేరతారని అంచనా వేసింది. విస్తరిస్తున్న విలాసవంతమైన ఆలోచనలు ఔట్‌ బౌండ్‌ ఇండియా ట్రావెల్‌ రంగాన్ని అసాధారణ వృద్ధిలోకి తీసుకెళ్తున్నాయని అభిప్రాయపడింది. 

తొలి త్రైమాసికంలో 10 కోట్ల మంది 
ఈ ఏడాది తొలి త్రైమాసికంలోనే సుమారు 10 కోట్ల మంది విమాన ప్రయాణాలు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒక 
దశాబ్దం కిందటి వరకు ఈ సంఖ్యలో ప్రయాణాలు చేయాలంటే ఏడాది సమయం పట్టేది. అంటే భారతీయుల్లో ఏ స్థాయిలో ప్రయాణాలు వృద్ధి చెందాయో నివేదిక స్పష్టం చేస్తోంది. 

ఈ ఏడాది మార్చి నాటికి దేశీయ ప్రయాణాలు 21శాతం, విదేశీ ప్రయాణాలు 4 శాతం మేర పెరిగినట్టు గుర్తించింది. ఆమ్‌స్టర్‌డామ్, సింగపూర్, లండన్, ఫ్రాంక్‌ఫర్డ్, మెల్‌బోర్న్‌లు ఈ వేసవి (జూన్‌–ఆగస్టు)లో భారతీయ ప్రయాణికులు సందర్శించే ఐదు ట్రెండింగ్‌ గమ్యస్థానాలుగా నిలవడం విశేషం. 2019, 2020లో ఒక పర్యటన సగటు వ్యవధి నాలుగు రోజులుగా ఉంటే ఈ ఏడాది ఐదు రోజులకు పెరిగింది.   

పెరిగిన క్రూయిజ్‌ ప్రయాణాలు 
ప్రపంచ వ్యాప్తంగా చూస్తే యూరోపియన్‌ చాంపియన్‌íÙప్‌ కారణంగా 2024లో జర్మనీలోని మ్యూనిచ్‌ టాప్‌ ట్రెండింగ్‌ డెస్టినేషన్‌గా నిలిచింది. గత మార్చికి ముందు 12 నెలల్లో ప్రజలు అత్యధికంగా ప్రయాణించిన గమ్యస్థానంగా జపాన్‌ నిలిచింది. ముఖ్యంగా ఐదు మార్కెట్లలో నాలుగు యూరోపియన్‌ గమ్యస్థానాలు, టాప్‌ 10లో 50 శాతం ఆసియా–పసిఫిక్‌ గమ్యస్థానాలు ఉన్నాయి. 

గడిచిన ఏడాది అత్యధికంగా ప్రయాణికులను ఆకర్షించిన గమ్యస్థానాల్లో జపాన్, ఐర్లాండ్, రొమేనియా, ఇటలీ, స్పెయిన్, మలేషియా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, యూఏఈ, ఇండోనేషియా నిలిచాయి. అయితే విదేశీ సందర్శకుల రికవరీలో అమెరికా 2019తో పోలిస్తే 6 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. 

హోటల్‌ పరిశ్రమలలో నిరంతరం ధరల పెరుగుదల కారణంగా క్రూయిజ్‌ ప్రయాణాలు ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో గ్లోబల్‌ క్రూయిజ్‌ ప్యాసింజర్‌ లావాదేవీల సంఖ్య 2019 కంటే దాదాపు 16 శాతం పెరిగాయి.    

Advertisement
 
Advertisement
Advertisement