బెయిల్‌.. అరెస్ట్‌.. రిపీట్‌ | Fresh Arrests After Bail: YouTuber Ravana Case Triggers Political Storm | Sakshi
Sakshi News home page

బెయిల్‌.. అరెస్ట్‌.. రిపీట్‌

Jul 3 2026 7:25 AM | Updated on Jul 3 2026 7:25 AM

Fresh Arrests After Bail: YouTuber Ravana Case Triggers Political Storm

తెలుగు యూట్యూబర్‌ బచ్చలకూరి జోసెఫ్‌ అలియాస్‌ ప్రశ్న రావణ్‌పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆగడం లేదు. పవన్‌ కల్యాణ్‌ను దూషించాడని ఆరోపిస్తూ జనసేన నేతలు వరుస ఫిర్యాదులు చేస్తుండడంతో కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కోర్టులు వరుసగా అతనికి బెయిల్‌ ఇస్తుండగా.. ఒక్కో కేసును తెర మీదకు తెస్తూ నిమిషాల వ్యవధిలోనే పోలీసులు అరెస్ట్‌ చేస్తుండడం గమనార్హం. ఈ పరిణామంపై రాజకీయ ప్రముఖులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సర్పవరం పీఎస్‌ కేసులో.. యూట్యూబర్‌ రావణ్‌కు గురువారం రాత్రి కాకినాడ మొబైల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అయితే, బెయిల్‌పై బయటికొచ్చిన రావణ్‌ను కృష్ణాజిల్లా మచిలీపట్నం, గుడివాడ పోలీసులు సంయుక్తంగా అదుపులోకి తరలించారు. అంతకు ముందు.. బుధవారం రాత్రి కూడా ఇదే తరహా సీన్‌ రిపీట్‌ అయ్యింది. 

కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు నమోదు చేసిన కేసులో ప్రశ్న రావణ్‌ను అరెస్టు చేయగా.. కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఆ వెంటనే  కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు అరెస్ట్‌ చేశారు. రావణ్‌ ఏ తప్పు చేయలేదని.. ప్రశ్నించడమే అతను చేసిన నేరమా? అని కొందరు సోషల్‌ మీడియాలో నిలదీస్తున్నారు.

ఈ పరిణామాలపై రావణ్‌ తరఫున వాదనలు వినిపిస్తున్న జైభీమ్‌ భారత్‌ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ భగ్గుమన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి “అంతిమ దినం”లా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగం అమల్లో ఉన్నా, దాని అమలుపై మరోసారి ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.

పిఠాపురం మెజిస్ట్రేట్ వాదనలు విని రావణ్‌కు బెయిల్ మంజూరు చేసినప్పటికీ, కేవలం ఐదు నిమిషాల్లోనే సర్పవరం పోలీస్ స్టేషన్‌లో మరో కేసు చూపిస్తూ మళ్లీ అరెస్ట్ చేయడం ఆందోళనకరమని ఆయన అన్నారు. కనీస సమాచారం కూడా కుటుంబానికి ఇవ్వకుండా అరెస్ట్ చేసి కాకినాడ కోర్టులో హాజరుపరిచారని ఆరోపించారు. మూడు గంటల పాటు వాదనలు విన్న తర్వాత కాకినాడ కోర్టు బెయిల్ మంజూరు చేసిందని.. ఇది ప్రజాస్వామ్యంలో రెండవ విజయం అని ఆయన అభివర్ణించారు. అయితే బెయిల్ వచ్చినప్పటికీ మళ్లీ ఇతర కేసుల్లో అదుపులోకి తీసుకోవడం అన్యాయమని అన్నారు. 

రావణ్‌పై జరుగుతున్న చర్యలు రాజకీయ కక్షసాధింపుగా కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని నాయకులను గౌరవించాల్సిన అవసరం లేదని, చట్టాలు, రాజ్యాంగం శాశ్వతమని పోలీసులు గుర్తుంచుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 35 కేసులు నమోదైనట్లు తెలుస్తోందని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో జర్నలిస్టుల సంఘాలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై స్పందించకపోవడం పట్ల ఆయన ప్రశ్నించారు.

రావణ్ ప్రయాణిస్తున్న వాహనంపై జనసేన శ్రేణులు రాళ్లు, కోడిగుడ్లతో దాడి చేశాయని.. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన విమర్శించారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వ పెద్దలు ఖండించాలా? లేదా? అని ప్రశ్నించారు. తాను కూడా అవసరమైతే మళ్లీ మచిలీపట్నం వెళ్లి వాదనలు వినిపిస్తానని, ప్రభుత్వ చర్యలపై చివరివరకు పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. ప్రజల కోసం అవసరమైతే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని పేర్కొన్నారు.

“నన్ను జైలుకు పంపితే అది ప్రభుత్వానికి ఎదురుదెబ్బలా మారుతుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం తాను వెనక్కి తగ్గబోనని జడ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement