సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురవగా.. అనేక చోట్ల ఎండ, ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. మరో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అత్యధికంగా 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 44.2, తణుకులో 43.9, ఇంకొల్లు, కూనవరంలో 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు శ్రీకాకుళం జిల్లా గరికిపాలెంలో 72.5 మి.మీ, లావేరులో 64.5 మి.మీ. వర్షం కురిసింది. మధ్య బంగాళాఖాతం నుంచి కర్ణాటక, కోస్తాంధ్ర, తెలంగాణ వరకు ద్రోణి విస్తరించి ఉండటంతో గురువారం మార్కాపురం, రాయలసీమ జిల్లాలతో పాటు పలు కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.


