పెందుర్తి: విశాఖ జిల్లా పెందుర్తి రెవెన్యూ పరిధిలోని చినముషిడివాడలో ఓ ప్రైవేటు స్థలంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మనుషులు దౌర్జన్యకాండకు దిగారు. దశాబ్దాలుగా వివాదంలో ఉన్న సర్వే నెంబర్ 112/1 భూమిలోకి అక్రమంగా చొరబడి నిర్మాణాలను కూల్చివేశారు. స్థల యజమానిని, అతడి సోదరుడు, కుటుంబ సభ్యులపై భౌతికదాడికి దిగి రెచ్చిపోయారు. సీఎం రమేష్ మనుషులం.. ఈ స్థలం మాది అంటూ పేట్రేగిపోయారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనపై బాధితులు పెందుర్తి పోలీసులను ఆశ్రయించారు. వివరాలివీ..
ఎన్ఆర్ఐ బీమరశెట్టి మనోజ్ కుటుంబ సభ్యులు సర్వే నెంబర్ 112/1లో 1979లో 50 సెంట్ల భూమిని కొనుగోలు చేశారు. నాటి నుంచి వారి స్వాధీనంలోనే భూమి ఉంది. అయితే, పినిశెట్టి చంద్రమోహన్ అనే వ్యక్తి తమ కుటుంబ సభ్యులకు వారసత్వ హక్కులు ఉన్నాయంటూ గతంలో భూమిలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో అప్పట్లో వివాదం పోలీస్స్టేషన్కు చేరింది.
అనంతరం దీనిపై రెవెన్యూ కార్యాలయం నుంచి పోలీసులు వివరణ తీసుకోగా.. ఇరువురి పత్రాలు పరిశీలించి ఇది పూర్తిగా సివిల్ తగాదా అంటూ రిపోర్టు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో.. గురువారం ఉదయం పినిశెట్టి చంద్రమోహన్ తన కుటుంబ సభ్యులతో స్థలంలోకి చొరబడ్డారు. ఎంపీ సీఎం రమేష్ మనుషులమంటూ స్థలంలో హడావుడి చేశారు.
అడ్డుకున్న మనోజ్ సోదరుడు నితిన్పై దాడికి తెగబడ్డారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా.. ఇరువురి మధ్య బైండోవర్ చేసినట్లు సీఐ సతీష్కుమార్ తెలిపారు. బైండోవర్ చేశాక కూడా సీఎం రమేష్ మనుషులు స్థలాన్ని ఖాళీ చేయడంలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.


