Diamond Found In Jonnagiri Kurnool District - Sakshi
Sakshi News home page

పొలంలో దొరికిన వజ్రం .. రూ.25 లక్షలకు కొన్న వ్యాపారి?

Jul 17 2023 9:28 AM | Updated on Jul 17 2023 9:44 AM

Diamond found in Kurnool District  - Sakshi

పత్తికొండ: కర్నూలు జిల్లాలో ఓ మహిళ పంట పండింది. తుగ్గలి మండలం జొన్నగిరి పొలాల్లో ఇటీవల ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి తేనె రంగు వజ్రం లభించిందని ప్రచారం జరిగింది. ఈ వజ్రాన్ని స్థానిక వ్యాపారి రూ.25 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అదే రోజు మరో రెండు వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం. మద్దికెర మండలం మదనంతపురం వాసి పొలంలో కలుపు తీస్తుండగా శనివారం వజ్రం దొరికినట్లు ప్రచారం సాగుతోంది.

మహిళా రైతు శనివారం పొలంలో కలుపు మొక్కలు తీసే పనుల్లో ఉన్నారు. ముందు రోజు రాత్రి వర్షం కురవడంతో తళతళ మెరిసే రాయి కనిపించింది. వెంటనే ఆ రాయిని తీసుకెళ్లి పెరవళిలో ఓ వ్యాపారికి చూపించగా.. వెంటనే రూ.14 లక్షలు డబ్బులు.. 2 తులాలు బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని వ్యాపారి సొంతం చేసుకున్నట్లు తెలిసింది. అంటే దాదాపు రూ.15 లక్షల వరకు రాగా.. ఒక్క రోజులో ఆమె లక్షాధికారి అయ్యారు.

తొలకరి వర్షాలు కురవగానే కర్నూలుతో పాటుగా అనంతపురం జిల్లాల్లోని గ్రామాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతుంది. భూమిలో నుంచి వజ్రాలు బయట పడతాయని ప్రచారం ఉంది. దీంతో గ్రామాల్లో జనాలు పొలాలకు వెళతారు.. వజ్రాల కోసం గాలిస్తుంటారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి.. అలాగే మద్దికెర మండలం వజ్రాల బసినేపల్లి, పెరవళి, మదనంతాపురంలలో వజ్రాలు దొరుకుతాయనే ప్రచారం ఉంది.

ఈ వజ్రాల కోసం కర్నూలు జిల్లాల వాళ్లే కాదు ఆ పొరుగు ఉండే జిల్లాల్లు, రాష్ట్రాల నుంచి వస్తుంటారు. పొలాల్లో తిరుగుతూ వజ్రాల వేటలో ఉంటారు. వజ్రాలు దొరికితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతుంటారు. ఒకవేళ వజ్రం దొరికితే.. బరువు, రంగు, రకాన్ని బట్టి క్యారెట్లలో లెక్కకట్టి డబ్బులు చెల్లిస్తారు. ఈ వ్యాపారం అధికారికంగా జరగదనే చర్చ ఉంది. గత నెలలో మద్దికెర మండలం వజ్రాల బసినేపల్లిలో ఓ వ్యక్తికి రూ.2 కోట్ల విలువైన వజ్రం దొరికిందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement