రెండేళ్ల తర్వాత ఆ రైతు కుటుంబానికి దొరికిన మరో వజ్రం
పన్నా(మధ్యప్రదేశ్): జీవితకాలంలో అత్యంత ఖరీదైన ఒక్క వజ్రం దొరకడమే ఎంతో అరుదైన విషయం. మధ్యప్రదేశ్ రాష్ట్రం పన్నా జిల్లాకు చెందిన ఒక గిరిజన రైతు కుటుంబాన్ని మాత్రం ఇలాంటి అదృష్టం ఏకంగా రెండుసార్లు వరించింది. రెండేళ్ల క్రితం 2024లో ఈ కుటుంబానికి 19.22 క్యారెట్ల వజ్రం దొరికింది. అప్పట్లో ప్రభుత్వ వేలంలో అది ఏకంగా రూ. 93 లక్షలు పలికింది. అదే కుటుంబం ఇప్పుడు మళ్లీ 11.19 క్యారెట్ల వజ్రాన్ని వెలికితీసింది.
విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందని అంచనా. రాకేశ్ ఆదివాసీ, అతడి ముగ్గురు సోదరులు, కొందరు బంధువులు కలిసి ఏప్రిల్ అహిర్గావ్ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ భూమిని లీజుకు తీసుకున్నారు. అందులో వజ్రాల వేట మొదలుపెట్టారు. రెండు నెలల పాటు రేయింబవళ్లు శ్రమించారు. సోమవారం వారికి అనుకోకుండా 11.19 క్యారెట్ల నాణ్యత కలిగిన వజ్రం లభించింది. వారు వెంటనే ప్రభుత్వ వజ్రాల కార్యాలయంలో దాన్ని డిపాజిట్ చేశారు. ఈ వజ్రం ఎంతో నాణ్యమైందని పన్నా జిల్లా డైమండ్ ఇన్స్పెక్టర్ నూతన్ జైన్ నిర్ధారించారు.


