టారిఫ్లను ఎత్తివేసినందుకు బెల్జియం కంపెనీ కానుక
బ్రస్సెల్స్: ఖతార్ ప్రభుత్వం నుంచి గతంలో కానుకగా రూ.3,360 కోట్ల విమానాన్ని కానుకగా అందుకున్న ట్రంప్కు కానుకలు వచ్చి పడుతూనే ఉన్నాయి. తాజాగా, బెల్జియం వజ్రాభరణాల కంపెనీ రూ.21 లక్షలకు పైగా విలువ చేసే వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని ఇచ్చేందుకు సిద్ధమైంది. అధ్యక్షుడికి 250 ఏళ్ల అమెరికా ఉత్సవాలకు కానుకగా ఇస్తున్నట్లు బెల్జియంకు చెందిన ఆంట్వెర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్(ఏడబ్ల్యూడీసీ) తాజాగా ప్రకటించింది. ఏడబ్ల్యూడీసీ నుంచి అమెరికాకు ఏటా ఎగుమతయ్యే రూ.16,800 కోట్ల పాలిష్ చేసిన వజ్రాలపై టారిఫ్లను రద్దు చేసినందుకే ఈ బహుమానమని ఏడబ్ల్యూడీసీ తెలిపింది.
ఈ భారీ ఉంగరంలో ప్రత్యేకతలేమంటే..డజన్ల కొద్దీ వజ్రాలతో అమెరికా జాతీయ పతాకం, 1776–2026 సంవత్సరాలు, సూపర్మ్యాన్ లోగో ఆకారంలో 45, 47 సంఖ్యలు.. వజ్రాల రెక్కలు కలిగిన ఒక గరుడ పక్షి, కెంపుతో చేసిన డాలును మోస్తూ, పచ్చలు పొదిగిన ఆలివ్ కొమ్మను తన కాళ్లతో పట్టుకుని ఉంది. పైన మెరిసిపోయే 250 అంకె, కింద 18–క్యారెట్ల బంగారంతో ‘250 YEARS USA’ అనేవి ఉన్నాయి.
దీని తయారీకి 321 వజ్రాలు, 56 నీలాలు, 13 పచ్చలు, ఆరు కెంపులను పొదిగిన, గడియారమంత ఉన్న ఈ బంగారు ఉంగరాన్ని అధ్యక్షుడు ట్రంప్కు ఇవ్వాలంటూ అమెరికాలో తమ బిల్ వైట్కు అందజేసినట్లు ఏడబ్ల్యూడీసీ తెలిపింది. ఉంగరం ఖరీదు రూ.21 లక్షల నుంచి రూ.29 లక్షల వరకు ఉండొచ్చన్నది నిపుణుల అంచనా. ఈ వజ్రపు ఉంగరాన్ని ఇంకా అధ్యక్షుడు ట్రంప్కు అందజేయలేదని వైట్హౌస్లోని ఓ అధికారి తెలిపారు.


