colored stones
-
రంగురాళ్ల తవ్వకాలకు భారీ స్కెచ్
కూటమి పాలనలో అక్రమార్కుల ఆటలు తారస్థాయికి చేరాయి. ఏడాది కాలంలో ఇసుక, గ్రావెల్, లేటరైట్, మైనింగ్ వంటి ప్రభుత్వ సంపదను దోచుకోవడమే కాక.. ఇప్పుడు ఏకంగా రంగురాళ్లపైనే కన్నేశారు. ఇందుకోసం అటవీ శాఖలో కింది నుంచి పై వరకు తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకుంటున్నారు. నేడో రేపో డీఎఫ్వోగా అస్మదీయుడినే నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సాక్షి, అనకాపల్లి: అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రేంజ్ పరిధిలో గల గొలుగొండ కరక క్వారీలో లభ్యమయ్యే రంగురాళ్ల అక్రమ తవ్వకాలకు భారీ స్కెచ్ వేశారు. ఈ రంగురాళ్లకు దేశంలోనే అత్యంత గిరాకీ ఉంటుంది. కరక క్వారీలో అలెక్స్ (సిసలైన పచ్చ వైఢూర్యం) లభ్యమవుతుంది. రంగురాళ్ల తవ్వకాలు చేపట్టేందుకు ఎన్నో ఏళ్లుగా అక్రమార్కుల ముఠా ఎదురుచూస్తోంది. టీడీపీ ప్రభుత్వం వస్తేనే వీరికి అనుకూలంగా ఉంటుంది.ఈ పరిసర ప్రాంతంలోకి ఎవరైనా అక్రమార్కులు ప్రవేశించాలంటే అటవీ శాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. అందుకే గార్డు స్థాయి నుంచి ఫారెస్ట్ రేంజ్ అధికారి వరకూ ఇటీవల బదిలీలలో మార్పు చేసుకున్నారు. ఇప్పుడు డీఎఫ్వోగా తమకు అనుకూలమైన వ్యక్తిని రప్పించేందుకు కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్సు లేఖతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అతని సిఫార్సుతోనే ఫారెస్ట్ రేంజ్ అధికారిని తెచ్చుకున్నారు. ఇప్పుడు జిల్లా ఫారెస్ట్ అధికారిని కూడా మార్చేందుకు తీవ్ర ప్రయత్నం జరుగుతోంది. అవినీతి అధికారికి అందలం! ప్రస్తుతం అనకాపల్లి జిల్లా డీఎఫ్వోగా పనిచేస్తున్న శామ్యూల్ను మార్పు చేసి కూటమి ఎమ్మెల్యే కుమారుడి సిఫార్స్ లేఖతో తనకు అనుకూలంగా పనిచేసే అధికారిని తెచ్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అవినీతికి మారుపేరు అయిన ఒక అధికారిని తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. సదరు అధికారి గతంలో విజయనగరంలో రూ.5 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ ట్రాప్లో చిక్కారు.గతంలో శ్రీకాకుళంలో కూడా ఇతని మీద ఒక ఏసీబీ కేసు ఉంది. రంగురాళ్ల తవ్వకాలకు అడ్డు లేకుండా అలాంటి వ్యక్తిని నర్సీపట్నం తీసుకొస్తున్నారనే వార్త చక్కర్లు కొడుతోంది. ఆయన వీఎంఆర్డీ డీఎఫ్వోగా రావటానికి భారీ ముడుపులు ఇచ్చి ప్రయత్నం చేసినప్పటికీ.. ఏసీబీ కేసు ఉండటం వలన సంస్థ తీసుకోవటానికి ఇష్టపడలేదు. సదరు అధికారి ప్రస్తుతం విజయవాడలో పనిచేస్తున్నారు. బదిలీ జీవో నేడో, రేపో రానున్నట్లు సమాచారం. అనుకూలస్తులనే తెచ్చుకున్నారు..! ఈ నెల 9వ తేదీన కరక క్వారీ ప్రాంత గార్డు అయిన నవీన్, ఫారెస్ట్ రేంజ్ అధికారి లక్ష్మీనరసింహలకు ఐదేళ్ల కాలపరిమితి ముగియకపోయినా బదిలీ చేయించి, తమకు అనుకూలంగా ఉండే వారిని తెచ్చుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక్కడకు గారు్డగా వచ్చిన వ్యక్తి స్థానిక కూటమి నేతలకు బాగా పరిచయస్తుడు. ఇక్కడకు కొత్తగా వచ్చిన ఫారెస్ట్ రేంజ్ అధికారి కూడా ఈ ప్రాంత కూటమి నాయకులకు సుపరిచితుడు. ఏడాది క్రితం కేడీ పేటలో డీఆర్వోగా పనిచేసి ప్రమోషన్పై పాడేరు డివిజన్లో ఫారెస్ట్ రేంజ్ అధికారిగా పదోన్నతిపై వెళ్లారు. మళ్లీ నర్సీపట్నం ఫారెస్ట్ రేంజ్ అధికారిగా బదిలీపై వచ్చేశారు. -
గంగ రాళ్ల గలగల
కోరుట్ల: ఎక్కడైనా... ఎవరైనా గోదావరి తీరానికి వెళ్లడం సర్వసాధారణమే.. కానీ అక్కడి తీర గ్రామాల ప్రజల దృష్టి వేరేగా ఉంటుంది. ఇసుక తిన్నెల్లో దొరికే గంగరాళ్లను సేకరిస్తారు. పూజ గదుల్లో భద్రపరుస్తారు. ఇంట్లో అవి ఉంటే శుభప్రదమని విశ్వసిస్తారు. గోదావరి తీరానికి మొక్కులు, శుభకార్యాల కోసం వెళ్లిన ప్రతీ ఒక్కరు రంగురంగుల గంగరాళ్లపై దృష్టి పెడతారంటే అతిశయోక్తి కాదు. జగిత్యాల జిల్లాలో ఇబ్రహీంపట్నం నుంచి ధర్మపురి మండలం రాయపట్నం వరకు సుమారు 90 కిలోమీటర్ల గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో సుమారు 28 గ్రామాల వరకు ఉన్నాయి. ఈ గ్రామాల్లోనే కాదు.. చుట్టుపక్కల ఉన్న పట్టణ ప్రాంతాల్లోనూ గంగరాళ్ల సెంటిమెంట్ ఉంటుంది.శుభకార్యాలతో ముడిపడి..నీటితోనే మనిషి మనుగడ.. జలం జాడలున్న చోటే జనం అవాసాలు ఏర్పాటు చేసుకోవడం సాధారణం. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చే గోదావరి నది.. నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల వెంబడి ప్రవహిస్తుంది. ఈ ప్రాంతవాసులు గోదావరి గంగ అని పిలుచుకుంటారు. ప్రతీ శుభకార్యానికి గోదావరి నదికి వెళ్లి మొక్కులు తీర్చుకోవడం ఇక్కడి వారి సంప్రదాయం. పుట్టువెంట్రుకలు, గర్భిణులకు గంగ తెప్పలు, పౌర్ణమి పుణ్యస్నానాలు, గంగ మొక్కులు చెల్లించుకోవడమే కాకుండా.. పితృదేవతలకు పిండాలు పెట్టడం, ఎవరైనా చనిపోతే.. ఆ వెంటనే గంగస్నానాలు చేయడం వంటి కార్యక్రమాలను గోదావరి తీరంలోనే చేస్తుంటారు. ఈ క్రమంలో గోదావరి (గంగ)తో ఇక్కడి ప్రాంతవాసుల జీవనశైలి, ఆచార వ్యవహారాలతో విడదీయరాని బంధం ఉంది. గంగరాళ్ల సెంటిమెంట్గంగ తీరంలో శుభకార్యాల కోసం బంధు మిత్రులతో కలిసి వెళ్లిన వారు పుణ్యస్నానాలు ముగించుకుని ఇక్కడి ఇసుకలో దొరికే రంగు రంగుల గంగరాళ్ల కోసం వెతకడం కనిపిస్తుంది. వీటిని పెద్దవాళ్లు శుభసూచకంగా భావిస్తే.. చిన్నపిల్లలు ఆట వస్తువులుగా.. గంగరాళ్లను సేకరిస్తారు. గంగ నీటి ప్రవాహంలో వందలాది కిలోమీటర్ల దూరం కొట్టుకువచ్చిన ఈ రాళ్లు.. విభిన్నమైన ఆకృతుల్లో, రంగుల్లో ఉంటాయి. దీంతో వీటిని ఇష్టంగా ఇంటికి తీసుకెళ్తారు. ఇలా తీసుకువచ్చిన గంగరాళ్లను వ్యాపారులు తమకు శుభాలు కలగాలని కౌంటర్ టేబుల్పై పేపర్వెయిట్గా ఉపయోగిస్తారు. చిన్నగా ఉండి లింగాకారంలో ఉండే రంగురాళ్లను శివునికి ప్రతీకగా పూజ గదుల్లో ఉంచుతారు. మరికొంతమంది గంగరాళ్లను దేవుడి గది ముందు ఉంచుతారు. ఇంట్లో శుభకార్యాలు జరిగినపుడు అదే రాయిపై కొబ్బరికాయలు కొట్టి దేవుళ్లకు అభిషేకం చేస్తుంటారు. మరికొంతమంది ఈ రంగురాళ్లను నీళ్లజాడీలో ఉంచి అలంకరణ కోసం వాడతారు. ఇలా ఈ ప్రాంత జనంలో గంగరాళ్ల సెంటిమెంట్ అనాదిగా కొనసాగుతోంది.బెల్లం రంగు రాళ్లు ఇష్టంగంగరాళ్లు అంటే నాకు చాలా ఇష్టం. వాటిలో బెల్లం రంగులో ఉండే రాళ్లు బాగుంటాయి. ఎప్పుడు గోదావరి తీరానికి వెళ్లినా అలాంటి రాళ్లను వెతికి తెచ్చుకుంటాను. ను న్నటి పెద్ద గంగరాయి దొరికితే.. దాన్ని పూజ గదిలో ఉంచుకుంటాం. ఇంట్లో శుభకార్యాలు, దేవునికి పూజలు చేసే సమయాల్లో కొబ్బరి కాయలు కొట్టడానికి వాడతాం. – కంటాల అనితదేవి, కోరుట్లవ్యాపారం బావుండాలని..వ్యాపారులు గంగరాళ్లను కౌంటర్ టేబుల్పై పెట్టుకుంటారు. దీన్ని ఒకవైపు పేపర్వెయిట్గా.. మరోవైపు వ్యాపారాల్లో లాభాలు తెచ్చే శుభసూచకంగా వినియోగి స్తారు. మా పిల్లలు గంగకు వెళ్లినప్పుడు ఆసక్తిగా ఇసుకలో రంగురాళ్లను వెతికి తెచ్చుకుని ఆటపాటల్లో వినియోగిస్తారు. – చిద్రాల వినోద్, వ్యాపారి, కోరుట్ల -
పొలంలో దొరికిన వజ్రం .. రూ.25 లక్షలకు కొన్న వ్యాపారి?
పత్తికొండ: కర్నూలు జిల్లాలో ఓ మహిళ పంట పండింది. తుగ్గలి మండలం జొన్నగిరి పొలాల్లో ఇటీవల ఒంగోలుకు చెందిన ఓ వ్యక్తికి తేనె రంగు వజ్రం లభించిందని ప్రచారం జరిగింది. ఈ వజ్రాన్ని స్థానిక వ్యాపారి రూ.25 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అదే రోజు మరో రెండు వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం. మద్దికెర మండలం మదనంతపురం వాసి పొలంలో కలుపు తీస్తుండగా శనివారం వజ్రం దొరికినట్లు ప్రచారం సాగుతోంది. మహిళా రైతు శనివారం పొలంలో కలుపు మొక్కలు తీసే పనుల్లో ఉన్నారు. ముందు రోజు రాత్రి వర్షం కురవడంతో తళతళ మెరిసే రాయి కనిపించింది. వెంటనే ఆ రాయిని తీసుకెళ్లి పెరవళిలో ఓ వ్యాపారికి చూపించగా.. వెంటనే రూ.14 లక్షలు డబ్బులు.. 2 తులాలు బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని వ్యాపారి సొంతం చేసుకున్నట్లు తెలిసింది. అంటే దాదాపు రూ.15 లక్షల వరకు రాగా.. ఒక్క రోజులో ఆమె లక్షాధికారి అయ్యారు. తొలకరి వర్షాలు కురవగానే కర్నూలుతో పాటుగా అనంతపురం జిల్లాల్లోని గ్రామాల్లో వజ్రాల వేట ప్రారంభమవుతుంది. భూమిలో నుంచి వజ్రాలు బయట పడతాయని ప్రచారం ఉంది. దీంతో గ్రామాల్లో జనాలు పొలాలకు వెళతారు.. వజ్రాల కోసం గాలిస్తుంటారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి, ఎర్రగుడి, ఉప్పర్లపల్లి.. అలాగే మద్దికెర మండలం వజ్రాల బసినేపల్లి, పెరవళి, మదనంతాపురంలలో వజ్రాలు దొరుకుతాయనే ప్రచారం ఉంది. ఈ వజ్రాల కోసం కర్నూలు జిల్లాల వాళ్లే కాదు ఆ పొరుగు ఉండే జిల్లాల్లు, రాష్ట్రాల నుంచి వస్తుంటారు. పొలాల్లో తిరుగుతూ వజ్రాల వేటలో ఉంటారు. వజ్రాలు దొరికితే కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడుతుంటారు. ఒకవేళ వజ్రం దొరికితే.. బరువు, రంగు, రకాన్ని బట్టి క్యారెట్లలో లెక్కకట్టి డబ్బులు చెల్లిస్తారు. ఈ వ్యాపారం అధికారికంగా జరగదనే చర్చ ఉంది. గత నెలలో మద్దికెర మండలం వజ్రాల బసినేపల్లిలో ఓ వ్యక్తికి రూ.2 కోట్ల విలువైన వజ్రం దొరికిందని ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. -
హవాయిలో పచ్చల వాన!
హవాయి ప్రాంతంలో ఓ అగ్నిపర్వతం పేలిపోయిందని.. దాంట్లోంచి లావా చుట్టుపక్కల ప్రాంతాలను ఆక్రమిస్తోందని మనకు తెలుసు కదా.. అక్కడే ఇంకో ఆశ్చర్యకరమైన సంఘటన కూడా చోటు చేసుకుంటోంది. అగ్నిపర్వతపు పొగ, లావాల నుంచి పచ్చటి రంగు రాళ్లు వర్షంలా కురుస్తున్నాయి. ఇంకేముంది.. హవాయి వెళ్లి కొన్ని పచ్చలు తెచ్చుకుందామని అనుకుంటున్నారా? కొంచెం ఒపిక పట్టండి. అక్కడ పచ్చల వాన కురుస్తున్న మాట వాస్తవమే అయినప్పటికీ అవి నవరత్నాల్లోని పచ్చలంత అరుదైనవి ఏమీ కాదు. ఒలివీన్ అనే సాధారణ ఖనిజంతో తయారయ్యాయి ఇవి. అగ్ని పర్వతాల ధూళిలో ఇలాంటివి కనపడటం కొంచెం అరుదు. ఇటీవల లావా పెద్ద ఎత్తున ఆకాశంలోకి ఎగజిమ్మడంతో అక్కడి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా లావాలోని రసాయనాలు ఘనీభవించి ఇలా పచ్చల్లా మారి ఉంటాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వీటి విలువ మాటెలా ఉన్నప్పటికీ హవాయి ప్రజలు మాత్రం వీటిని సేకరించి జాగ్రత్త చేసుకుంటున్నారు. -
రంగురాళ్లు తరలిస్తున్న ఇద్దరు అరెస్టు
5 బస్తాల రంగురాళ్లు స్వాధీనం దాచేపల్లి : అక్రమంగా రంగురాళ్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురవారం అరెస్ట్ చేశారు. సారంగపల్లి అగ్రహారానికి చెందిన జాఠవత్ కొండా నాయక్, ఆదూరి నరసింహారావు రంగురాళ్లను అక్రమంగా తరలిస్తుండటంతో అరెస్ట్ చేసి గురజాల కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్సై కట్టా ఆనంద్ తెలిపారు. ఎస్సై కథనం మేరకు.. శంకరపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో రంగురాళ్లను అక్రమంగా తవ్వించి విక్రయించేందుకు వాహనంలో తరలిస్తున్నారు. దాచేపల్లిలోని నాయుడుపేట వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారులో 5 బస్తాల రంగురాళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రంగురాళ్లను తరలిస్తున్న కొండానాయక్, నరసింహారావును అదుపులోకి తీసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై ఆనంద్ వెల్లడించారు. -
రంగురాళ్లకు ఇంకా పరుగులు
అమూల్యమైన రాళ్లతో కోట్లలో వ్యాపారం తవ్వకాలకు అనుమతులకై కొందరి యత్నం గత ప్రమాదాలు విస్మరించి డబ్బు కోసం ఆరాటం నర్సీపట్నం రూరల్: వేలాది మంది గిరిజనుల బతుకుకు, మెతుకుకు పూచీ పడే సుదీర్ఘ గిరులు తూర్పు కనుమలు. ఎంతో విలువైన అటవీ సం పదకు ఆలవాలమైన ఈ పర్వత పంక్తులు వెలకట్టలేని సంపదకు నెలవుగా వన్నెకెక్కాయి. జిల్లాలోని తూర్పు కనుమల పరిధిలో లభించే అమూల్యమైన రంగురాళ్లు ఇప్పటికే ఎందరికో కోట్లు ఆర్జించిపెట్టాయి. అదే సమయంలో ఎందరో అమాయకుల ప్రాణాలను తవ్వకాలు బలి తీసుకున్నాయి. ఎన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నా రంగురాళ్లపై ఆశ కొందరిని పరుగులు తీయిస్తోంది. అందుకే లీజ్ కోసం కొందరి ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మరోవైపున నిఘా సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తూ ఉండడంతో అతి కీలకమైన గొలుగొండ మండలంలోని అనధికారిక క్వారీల్లో వ్యాపారం ముమ్మరంగా సాగుతోంది. కరక మెరుపు తునక : గొలుగొండ మండలంలోని కరక రిజర్వు ఫారెస్టులో దొరికే రంగురాళ్లు ఎంతో విలువైనవిగా వన్నెకెక్కాయి. రెండు దశాబ్దాల క్రితం గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెంలో తొలిసారిగా రంగు రాళ్లు బయిటపడ్డాయి. ఇక్కడ కేట్స్ ఐ, అలెక్స్ రకం రంగురాళ్లు దొరికేవి. కాలక్రమేణా కరక రిజర్వు ఫారెస్టులో అత్యుత్తమమైన అలెక్స్ రంగురాళ్లు లభ్యం కావడంతో, వీటికి లక్షల్లో ధర పలకడంతో తవ్వకాలు ఊపందుకున్నాయి. కొద్ది ఏళ్లలో ఇక్కడ వందల కోట్ల లావాదేవీలు సాగి ఉంటాయంటున్నారు. ఎడాపెడా ప్రమాదాలు : రంగురాళ్ల ద్వారా కోట్లు లభిస్తూ ఉండడంతో ఎందరో ఎగబడ్డారు. దాంతో ప్రమాదాలు భారీ ఎత్తున జరిగాయి. పదుల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు, అధికారులు ప్రేక్షక పాత్ర వహించడంతో తవ్వకాలు విస్తృతంగా సాగుతున్నాయన్నది విస్పష్టం. ప్రస్తుతం కరక చుట్టుపక్కల ప్రాంతాల్లో క్వారీలు నిర్వహించేందుకు వ్యాపారులు ప్రణాళికలు చేశారు. లీజుకు దరఖాస్తు చేసిన కొంతమంది అనుమతులు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు భోగట్టా. -
రంగురాళ్ల క్వారీలపై వ్యాపారుల కన్ను
మన్యంలో విస్తృత సర్వే పాడేరు: మన్యంలో లభించే విలువైన రంగురాళ్ల క్వారీలపై బడా వ్యాపారులు కన్ను పడింది. ఒడిశా, రాజస్థాన్ సహా జిల్లాకు చెందిన ప్రముఖ వ్యాపారులు ప్రస్తుతం మన్యంలో అధికంగా సంచరిస్తున్నారు. గొలుగొండ మండలం కరక, జీకే వీధి మండలం గుర్రాలగొంది క్వారీలను అటవీ, పోలీసు శాఖలు మూసివేసాయి. ఈ రంగురాళ్ల క్వారీల్లో రంగురాళ్ల మట్టి తవ్వకాలపై నిషేధం ఉండటంతో వ్యాపారం నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో వ్యాపారులంతా కొత్త క్వారీల్లో తవ్వకాలపై దృష్టి సారించారు. చింతపల్లి, జి.మాడుగుల, పాడేరు ప్రాంతాల్లో పలు చోట్ల గతంలో తవ్వకాలు జరిపిన క్వారీల్లో మళ్లీ మట్టి తవ్వకాలకు వ్యాపారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక గిరిజనులతో మంతనాలు జరుపుతున్నారు. విలువైన క్యాట్స్ ఐ రకం రంగురాళ్లు లభించే కొత్త క్వారీలను కూడా వ్యాపారులు అన్వేషిస్తున్నారు. అబ్రకం ఖనిజం జాడలు కనిపించిన భూముల్లో మట్టి తవ్వకాలు జరిపి నమూనాలను సేకరిస్తున్నారు. ప్రస్తుతం రంగురాళ్ల వ్యాపారులు పాడేరు, జి.మాడుగుల,చింతపల్లి, జీకే వీధి ప్రాంతాల్లో అధికంగా సంచరిస్తున్నారు. నర్సీపట్నం, విశాఖపట్నం కేంద్రాలుగా బడా వ్యాపారులు మకాం వేసి రంగురాళ్ల క్వారీల వేటలో నిమగ్నమయ్యారు. హైదరాబాద్లోని పేరొందిన రంగురాళ్ల ముఠా కూడా ఏజెన్సీలోని రంగురాళ్ల సంపదపై కన్నేసింది. గతంలో వారు పాడే రు మండలం మినుములూరు క్వారీలో అక్రమంగా మట్టిని తవ్వించారు. విలువైన రంగురాళ్లు లభించడంతో రాజకీయ అండదండలతో శ్రీలంకకు తరలించి రూ.కోట్లలో వ్యాపారం చేసారు. అప్పట్లో పోలీసుశాఖ కూడా రాజకీయ ఒత్తిళ్లకు గురైందనే ఆరోపణలు వినిపించాయి. వ్యాపారుల మధ్య పోటీతత్వం నెలకొనడంతో చివరికి ఫిర్యాదులు అధికమై పోలీసులు, రెవెన్యూ అధికారులు మినుములూరు క్వారీని రెండేళ్ల కిందట మూసివేసారు. వ్యాపారులు మాత్రం ఈ క్వారీలో తవ్వకాలకు నిరంతరం ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. క్వారీ ఉన్న ప్రాంతం పట్టా భూమి కావడంతో భూమి యజమాని తవ్వకాలకు అనుమతి మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నారు. దీంతో రంగురాళ్ల వ్యాపారులంతా ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలను కూడా వ్యాపారులు ప్రసన్నం చేసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. -
రూ.కోట్లు కొట్టారు
మన్యంలో జోరుగా రంగురాళ్ల తవ్వకాలు సంక్రాంతి పూట గుట్టుచప్పుడు కాకుండా నిర్వహణ పోలీసుల సహకారంతో పేట్రేగిపోయిన వ్యాపారులు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మన్యంలో మళ్లీ రంగురాళ్ల అక్రమ తవ్వకాలు పెద్ద ఎత్తున ఆరంభమయ్యాయి. కోట్ల రూపాయల సరకు తరలిపోయింది. పోలీసుల సంపూర్ణ సహకారాలతో సంక్రాంతి సమయంలో స్మగ్లర్లు కొత్త క్వారీలను తెరచి నిపుణులైన కార్మికులతో తవ్వకాలు జరిపించారని తెలిసింది. జిల్లా ఎస్పీ దుగ్గల్ గూడెం కొత్తవీధి మండలంలో పర్యటించిన సమయంలోనే ఆయన కళ్లుగప్పి చింతపల్లి పోలీసులు రంగురాళ్ల తవ్వకాలకు అనుమతులిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం రంగురాళ్ల అక్రమ వ్యాపారులు కిందిస్థాయి పోలీసు అధికారులకు రూ.లక్షల్లో మామూళ్లను ముట్టజెప్పారని తెలిసింది. ప్రజలంతా సంక్రాంతి సంబరాల్లో ఉండగా చింతపల్లి, గూడెం మండలాల్లో రంగురాళ్ల తవ్వకాలు జరిగాయి. చింతపల్లి, నర్సీపట్నం ప్రాంతానికి చెందిన వ్యాపారులు పేరుమోసిన స్మగ్లర్ చింతపాకల గోవిందు ఆధ్వర్యంలో తవ్వకాలు జరిపించి సరకు తరలించారన్న ఫిర్యాదులు పోలీసు ఉన్నతాధికారుల వరకూ వెళ్లాయి. పోలీసుల సహకారంతో రక్షిత అటవీ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన తవ్వకాలపై అటవీశాఖాధికారులు ఆలస్యంగా దృష్టిసారించారు. గతంలో అప్పటి నర్సీపట్నం ఏఎస్పీ ఉక్కుపాదం మోపడంతో తవ్వకాలు పూర్తిగా ఆగిపోయాయి. అప్పట్లో తవ్వకందారులు, వ్యాపారులపై గట్టి సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం మంచి ఫలితాలనే ఇచ్చింది. ఏఎస్పీతో పాటు ఎస్పీ కూడా మారిపోవడం, కింది స్థాయి అధికారులు కూడా బదిలీ కావడంతో అక్రమ వ్యాపారులు తిరిగి విజృంభిస్తున్నారు. చింతపల్లితో పాటు పాడేరుకు సమీపంలోని మినుములూరు వద్ద గతంలో తెరచిన క్వారీలో తిరిగి తవ్వకాలు జరిపేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల మద్దతు కూడా అక్రమ తవ్వకందార్లుకు ఉండడంతో అటవీశాఖాధికారుల కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.