
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. యాక్టివ్ కేసుల 7,400కు చేరింది. గత 24 గంటల్లో 269 కేసులు నమోదు కాగా తొమ్మిది మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం తెలిపింది. కర్ణాటకలో అత్యధికంగా ఒక్కరోజులోనే 132 కేసులు నమోదయ్యాయి. గుజరాత్లో 79, కేరళలో 54, మధ్యప్రదేశ్లో 20, సిక్కింలో 11, తమిళనాడులో 12, హర్యానాలో 9తోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా 24 గంటల్లో యాక్టివ్ కోవిడ్ కేసుల్లో పెరుగుదల నమోదైంది.
అరుణాచల్ ప్రదేశ్, చండీగఢ్, లద్దాఖ్, మిజోరం, పంజాబ్, పశ్చిమ బెంగాల్లో కేసులేవీ నమోదు కాలేదని ఆరోగ్య శాఖ తెలిపింది. గత 24 గంటల్లో మహారాష్ట్రలో నలుగురు, కేరళలో ముగ్గురు, రాజస్థాన్, తమిళనాడులలో ఒక్కొక్కరు మరణించారు. జనవరి 1 నుంచి ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 87కు చేరుకుంది. కోవిడ్కు అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రంగా కేరళ ఉంది. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,109గా ఉంది. తరువాత స్థానాల్లో గుజరాత్ 1,437, ఢిల్లీ 672, మహారాష్ట్ర 613, కర్ణాటక 527, ఉత్తరప్రదేశ్ 248, తమిళనాడు 232, రాజస్థాన్ 180, ఆంధ్రప్రదేశ్ 102 ఉన్నాయి. మణిపూర్, రాజస్థాన్లలోనూ కేసులు పెరిగాయి.