మళ్లీ కులగణన.. అధిష్టానం ఆదేశాలతో కర్ణాటక సర్కార్‌ కీలక నిర్ణయం | Karnataka Government Again Conduct Caste Census | Sakshi
Sakshi News home page

మళ్లీ కులగణన.. అధిష్టానం ఆదేశాలతో కర్ణాటక సర్కార్‌ కీలక నిర్ణయం

Jun 10 2025 5:20 PM | Updated on Jun 10 2025 5:32 PM

Karnataka Government Again Conduct Caste Census

బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మళ్లీ కులగణన చేపట్టాలని భావిస్తోంది. అధిష్టానం ఆదేశాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ మంగళవారం సూచన ప్రాయంగా ప్రకటించారు. అయితే కుల గణన అంశంపై సమీక్ష జరిపేందుకు ఎల్లుండి (జూన్‌ 12న) కర్ణాటక కేబినెట్‌ ప్రత్యేకంగా సమావేశం కానుంది. 

ఇదిలా ఉంటే. . కర్ణాటకలో 2015లోనే అప్పటి ప్రభుత్వం కుల గణన జరిపింది. హెచ్‌ కాంతారాజ్‌ నేతృత్వంలో కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్‌ ఈ సర్వేను నిర్వహించింది. ఆ సమయంలో కోటి 35 లక్షల ఇళ్లను సర్వే చేశారు. 51 ప్రమాణాల ఆధారంగా 5.98 కోట్ల మంది డాటాను సేకరించారు. అయితే.. రాజకీయపరమైన కారణాలు, ఇతర కారణాల దృష్ట్యా ఆ నివేదికను సీల్డ్‌ కవర్‌లోనే ఉంచారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కేబినెట్‌ ముందుకు ఆ నివేదిక వచ్చింది. 

అప్పటి నుంచి దఫ దఫాలుగా కేబినెట్‌ భేటీ అవుతూ.. కర్ణాటక సోషియో ఎకనమిక్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ సర్వేపై చర్చలు జరుపుతోంది. అయితే ఆ నివేదికలోని ఓబీసీ రిజర్వేషన్లను 51 శాతానికి పెంచాలన్న ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. అదేసమయంలో లింగాయత్‌, వక్కలింగ కులాలు ఈ నివేదికను తోసిపుచ్చుతున్నాయి.

మరోవైపు .. మళ్లీ కుల గణన చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఇటు రాజకీయ వర్గాలు, అటు మేధో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా టీచర్లను సర్వేలో భాగం చేయడం వల్ల అకడమిక్‌ ఇయర్‌కు విఘాతం కలిగే అవకాశం ఉందని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. 

జన గణనతో పాటే కుల గణన చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరోసారి కుల గణన జరపాలని అనుకుంటుండడం విశేషం. కేబినెట్‌ సబ్‌కమిటీ లేదంటే లెజిస్లేటివ్‌ కమిటీ ద్వారా కుల గణన సర్వేపై తుది నిర్ణయం తీసుకోవాలని కర్ణాటక ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement