సాక్షి,నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు తనకు భారీ మెజార్టీతో గెలిపిస్తామని ముందస్తుగా హామీ ఇస్తేనే తాను పోటీకి దిగుతానని ఆయన స్పష్టం చేశారు.
ప్రజల పూర్తి మద్దతు, నమ్మకం ఉంటేనే రాజకీయాల్లో కొనసాగుతానని తన అభిప్రాయం వ్యక్తం చేశారు. తన రాజకీయ నిబద్ధతను,ఆస్తుల వివరాలను ప్రస్తావిస్తూ.. తనకు నల్లగొండలో సొంత ఇల్లు గానీ, తన సొంత గ్రామంలో ఎలాంటి భూములు గానీ లేవని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. తాను స్వార్థం కోసం కాకుండా, కేవలం ప్రజల సేవ కోసమే రాజకీయాలు చేస్తున్నానని అన్నారు.
నల్లగొండ పట్టణాభివృద్ధిపై తనకున్న లక్ష్యాన్ని చాటిచెప్పిన ఆయన, నల్లగొండను సాధారణ పట్టణంలా కాకుండా ఒక అత్యాధునిక నగరంగా, రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం ఇప్పటికే నల్లగొండను కార్పొరేషన్గా మార్చామని, రహదారులు, మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి వివరించారు.


