జనగామ: ప్రేమించిన పెళ్లి చేసుకున్న భార్యను భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్ పరి«ధిలోని నాలుగో డివిజన్ కృష్ణాకాలనీలో శనివారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతల తండాకు చెందిన గుగులోత్ రజిత (26), నర్సంపేట మండలం రాజీపేటకు చెందిన అనిల్ ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. నెల రోజుల క్రితం రజిత–అనిల్ దంపతులు బతుకుదెరువు కోసం నగరానికి వచ్చారు. కృష్ణాకాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నారు.
కొంతకాలంగా వీరి కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. శనివారం రాత్రి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అనిల్ తన భార్య రజిత కాళ్లు, చేతులు కట్టి కత్తితో మెడ కోసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనలో రజిత అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న కేయూసీ పోలీస్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సై నవీన్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తల్లి హత్యకు గురికావడంతో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.


