AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే! | "No thrust, losing power...": Pilots Last Message Before Ahmedabad Plane Crash Tragedy, Know What Is Mayday Call | Sakshi
Sakshi News home page

What Is Mayday Call: AI-171 విమానం నుంచి చివరి సందేశం ఇదే!

Jun 14 2025 5:53 PM | Updated on Jun 14 2025 6:29 PM

AI Plane Incident: No thrust losing power Pilots last message

ఢిల్లీ:  అహ్మదాబాద్‌ విమాన ‍ప్రమాదంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.  ప్రమాదానికి గురైన ఎయిర్‌ ఇండియా విమానం నుంచి ఏటీసీకి చివరిగా వచ్చిన మే డే కాల్‌లో ఐదు సెకన్ల పాటు రికార్డ్‌ అయిన ఆడియో సందేశంలో కీలక విషయం వెల్లడైంది. ఎయిర్‌ ఇండియా విమానం నుంచి ఏటీసీకి వచ్చిన మే డే కాల్‌లో.. మే డే.. మే డే.. మే డే.. నో పవర్‌.. నో త్రస్ట్‌.. గోయింగ్‌ డౌన్‌  ఇవి కెప్టెన్‌ సబర్వాల్‌ ఆఖరి సందేశంగా రికార్డైంది. దీనికి సంబంధించి ఆడియో ప్రస్తుతం ఏటీసీ వద్ద ఉందని తాజాగా వెల్లడించారు.   

మే డే కాల్‌కు శతాబ్ధానికి పైగా చరిత్ర!
సివిల్‌ ఏవియేషన్‌ రంగంలో మేడే అనే పదాన్ని మొదట 1920లో వాడారు. లండన్‌లోని క్రోయ్‌డన్‌ విమానాశ్రయంలో రేడియో ఆఫీసర్‌గా పనిచేసిన ఫ్రెడరిక్‌ స్టాన్లీ మాక్‌ఫీల్డ్‌ ఈ పదాన్ని మొదట ఉపయోగించినట్లు రికార్డుల్లో ఉంది. ఇది ఫ్రెంచ్‌ పదమైన మైడెర్‌కు సమానార్ధకం. ఫ్రెంచ్‌లో మైడెర్‌ అంటే సహాయం చేయండి (హెల్ప్‌ మీ) అని అర్థం. 1923 నుంచి అంతర్జాతీయ రేడియో కమ్యూనికేషన్‌ వాడే పైలట్లు, సముద్రయానం చేసే మెరైన్‌ సిబ్బంది ఈ మేడే పదాన్ని వాడటం మొదలుపెట్టారు. అధికారికంగా మాత్రం సివిల్‌ ఏవియేషన్‌ రంగం 1927 నుంచి ఈ పదాన్ని స్వీకరించింది. అత్యవసర సమయాల్లో మేడేతోపాటు ఎస్‌ఓఎస్‌ పదాన్ని కూడా వాడుతుంటారు. కానీ, మేడే పదమే బాగా ప్రాచుర్యంలో ఉంది.

మేడే కాల్‌ వస్తే..!
ఎవరైనా పైలట్‌ నుంచి ఏటీసీకి మేడే కాల్‌ వచ్చిందంటే ఆ విమానం కూలిపోయే ప్రమాదంలో ఉందని అర్థం. వెంటనే ఏటీసీ అధికారులు అత్యవసరం కాని సేవలన్నింటినీ నిలిపేసి ఆ విమానాన్ని కాపాడేందుకు ప్రయత్నం మొదలు పెడతారు. సహాయం కోసం మేడే కాల్‌ ఇచ్చిన పైలట్‌ తన విమానం ఏ ప్రాంతంలో ఉంది? ఎంత ఎత్తులో ఉంది? ఎలాంటి ప్రమాదంలో ఉంది? విమానంలో ఎంతమంది ప్రయాణిస్తున్నారు అనే విషయాలు కూడా అందించాల్సి ఉంటుంది. దాన్ని బట్టి సహాయ చర్యలు ఎలా చేపట్టాలన్నది ఏటీసీ అధికారులు నిర్ణయిస్తారు. ఈ మేడే సిగ్నల్‌ను సాధారణంగా 121.5 మెగాహెడ్జ్, 243 మెగాహెడ్జ్‌లో పంపుతుంటారు. ఈ ఫ్రీక్వెన్సీలను ఏటీసీ అధికారులు అనుక్షణం పరిశీలిస్తుంటారు.  

కాగా, జూన్‌ 12వ తేదీ మధ్యాహ్నాం లండన్‌ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం టేకాఫ్‌ అయిన కాసేపటికే కూలి.. పేలిపోయింది. ఘటనలో విమానంలో ప్రయాణికులు, సిబ్బందితో పాటు జనావాసాలపై కూలి మరో 24 మంది మొత్తం 265 మంది మరణించారు. విమానంలోని ఒకే ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు ఈ కేసును ప్రత్యేక బృందం దర్యాప్తు జరుపుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement