
పెళ్లి మండపం నుంచి భర్తను ఈడ్చుకువచ్చి చెప్పుతో కొట్టిన భార్య
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భర్త రహస్యంగా రెండో వివాహం చేసుకుంటున్నట్లు తెలుసుకున్న భార్య.. నేరుగా కల్యాణమండపం చేరుకొని అతన్ని బయటకు ఈడ్చుకు వచ్చి చెప్పుతో కొట్టి బుద్ధి చెప్పింది. ఈ ఘటన చిత్రదుర్గ లో ఆదివారం చోటుచేసుకుంది. చిక్కమగళూరు జిల్లా అరసీకెరె తాలూకా తిప్పఘట్టకు చెందిన కార్తీక్ నాయక్కు నాలుగేళ్ల క్రితం దావణగెరె జిల్లా న్యామతి తాలూకా ముశేనాళ గ్రామానికి చెందిన తనూజాతో వివాహం జరిగింది.
అయితే భార్యకు తెలియకుండా రెండో వివాహానికి సిద్ధపడ్డాడు. చిత్రదుర్గలోని గాయత్రి కల్యాణ మండపంలో పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఈ విషయం తనూజాకు తెలియడంతో ముహూర్తం సమయానికి వెళి కార్తీక్ను పెళ్లి పీటల మీద నుంచి ఈడ్చుకు వచ్చి చెప్పుతో చితకబాదింది. ఈ హఠాత్ పరిణామంతో పెళ్లికి వచ్చిన వారు కంగుతిన్నారు. సంఘటనకు సంబంధించి చిత్రదుర్గ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.