
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం వచ్చాక తమను పట్టించుకోవడం లేదని, తాము పండించిన పంటలకు గిట్టుబాట ధర ఉండడం లేదని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కోకో, పామాయిల్, పొగాకు రైతులు వాపోతున్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ(YSRCP) కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరాలతో సహా ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
మేం పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం లేకుండా పోయింది అని రైతులు వైఎస్ జగన్(YS Jagan) వద్ద వాపోయారు. అయితే ఎవరూ అధైర్యపడొద్దని, రైతులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆయన వాళ్లకు భరోసా ఇచ్చారు. అనంతరం రైతులు మీడియాతో మాట్లాడారు.

నాకు నాలుగెకరాలు పామాయిల్ ఉంది, సీజన్ ప్రారంభం అయింది, గతంలో సీజన్ లేనప్పుడు పామాయిల్ టన్ను రూ. 21,400 ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం టన్ను రూ. 18,600 కు వచ్చింది, మాకు పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి, రైతులకు ఏం మిగలడం లేదు, ఇంకా రేటు తగ్గితే మేం పూర్తిగా నష్టపోతాం, దయచేసి ప్రభుత్వం కనీసం టన్నుకు రూ. 20,000 మద్దతు ధర అయినా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మేం మా సమస్యను వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చాం. ఆయన తప్పక మాకు అండగా ఉంటామన్నారు.
::అన్నవరపు గణేష్, రైతు, రావికంపాడు, చింతలపూడి నియోజకవర్గం, ఏలూరు జిల్లా
మేం కోకో రైతులం. జగన్ను కలిసి మా సమస్యను వివరించాం, కోకోను ప్రైవేట్ కంపెనీలు గతంలో కేజీ రూ. 1,000 కి కొనుగోలు చేశాయి, కానీ ఇప్పుడు మాత్రం కేజీ రూ. 750 సీజన్ ప్రారంభంలో ఇచ్చి ఇప్పుడు రూ. 400 ఇస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం కేజీ రూ. 850 అమ్ముతుంటే ఇక్కడ మాత్రం సిండికేట్ అయి రూ. 300-400 మధ్య కొనుగోలు చేస్తున్నారు. పైగా టీడీపీ రైతుల(TDP Farmers) దగ్గరే కొంటున్నారు. మేం వైఎస్సార్సీపీ సానుభూతిపరులమని మా దగ్గర కొనడం లేదు. ఇవన్నీ జగన్ గారికి చెప్పాం.

పైగా నిరుడు రేట్ పలికిందని ఈ ఏడు కౌలు రేట్లు కూడా పెంచడంతో మేం తీవ్రంగా నష్టపోతున్నాం. మా రైతులంతా ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, ఇలాగైతే మా రైతులు ఏమవ్వాలి, మా సమస్యలు విని వైఎస్సార్సీపీ రైతులకు అండగా ఉంటుందని వైఎస్ జగన్ భరోసానిచ్చారు.
::తాతా రవి, రైతు, బాదరాల గ్రామం, ఏలూరు జిల్లా