తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణం సీతానగరంలోని విజయకీలాద్రి దివ్య క్షేత్రంపై ఆదివారం బదరి నారాయణ తిరునక్షత్ర మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్స్వామి మంగళాశాసనాలతో బదరి నారాయణ తిరునక్షత్ర మహోత్సవం ఘనంగా జరిగిందని తెలిపారు. కార్యక్రమాల్లో భాగంగా ఉదయం అష్టాక్షరి మంత్ర జపం, 9 గంటలకు వేణుగోపాల స్వామికి అభిషేకం, అర్చన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా మల్నేని హనుమంతరావును పోటీలో నిలుపుతున్నట్లు పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీలు వి.బాలసుబ్రమణ్యం, కేఎస్ లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావులు ఆదివారం ఓ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. పీడీఎఫ్ అభ్యర్థిగా ఎం.హనుమంతరావు అభ్యర్థిత్వానికి యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతునిస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ తెలిపారు. పల్నాడు జిల్లా యడ్లపాడు మండలానికి చెందిన హనుమంతరావు 1996 నుంచి సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడిగా వృత్తిని ప్రారంభించి, స్కూల్ అసిస్టెంట్, ఇన్చార్జి హెచ్ఎంగా 30 ఏళ్ల సర్వీసును పూర్తి చేసుకుని, ఇటీవల ఉద్యోగ విరమణ చేశారు. 30 ఏళ్లలో యూటీఎఫ్ మండల ప్రధాన కార్యదర్శిగా, జిల్లా కోశాధికారిగా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రచురణ విభాగ చైర్మన్గా బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారని గుర్తుచేశారు. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడిగా సీపీఎస్ రద్దు పోరాటాలతో పాటు విద్యారంగ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో చురుగ్గా పాల్గొన్నారు.
గుంటూరు వెస్ట్(క్రీడలు): లాన్ టెన్నిస్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో జిల్లా స్థాయి అండర్ 10, 12,14,16 బాలబాలికలతోపాటు పురుషులు, మహిళల విభాగాల్లో పోటీలు నిర్వహించారు. జిల్లా సంఘం చైర్మన్ నాయబ్ కమల్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 200 మంది పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఈ ఎంపికల నుంచి ప్రతి విభాగంలో ఐదుగురిని ఎంపిక చేసి రాష్ట్ర సంఘం నిర్వహించే ర్యాంకింగ్ పోటీలకు పంపుతామని తెలిపారు. తర్వాత విజేతలకు బహుమతులను నాయబ్ కమల్, అధ్యక్షుడు ఎన్.సాంబశివ రావు అందజేశారు. కార్యక్రమంలో టెన్నిస్ శిక్షకులు జీవీఎస్ ప్రసాద్, అహ్మద్, కుమార్, నరసింహారావు, ఆనంద్ కుమార్, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా ఆదివారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన డీజీపీకి ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, హరీష్కుమార్గుప్తా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ ఈఓ, చైర్మన్లు ఆయనకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టు వస్త్రాలను అందజేశారు.


