
ముంబై లోకల్ ట్రైన్ (ప్రతీకాత్మక చిత్రం)
ప్రయాణికులకు నిత్యనరకం అనేది ఎలా ఉంటుందో.. ముంబై లోకల్ ట్రైన్ల రద్దీని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మరీ ముఖ్యంగా రైలు ప్లాట్ఫారమ్ మీదకు రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా ఎగబడిపోవడం, ఫుట్బోర్డు మీద వేలాడుతూనే ప్రయాణాలు చేయడం తరచూ సోషల్ మీడియాలోనూ చూస్తుంటాం. అయితే థానేలో ఇవాళ జరిగిన ఘోర ప్రమాదంతో(Thane Local Train Accident) రైల్వే అధికారులు దిద్దుబాటు చర్యలకు దిగారు.
లోకల్ ట్రైన్స్కు కూడా ఆటోమేటిక్ తలుపులు బిగించాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. థానేలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ చర్యలకు ఉపక్రమించింది. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు కొత్త రైళ్లకూ ఈ తరహా డోర్లు బిగించనున్నట్లు తెలుస్తోంది. ముంబయి సబర్బన్ ప్రాంతంలో నడిచే అన్ని రైళ్లకూ ఆటోమేటిక్ డోర్లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించిందని రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ప్రయాణికుల భద్రతే రైల్వే ప్రథమ ప్రాధాన్యం అని ఆయన పేర్కొన్నారు.
థానేలో ఇవాళ ఉదయం కసారా వైపు వెళ్తున్న లోకల్ ట్రైన్ నుంచి పది మంది కింద పడిపోయారు. ఫుట్బోర్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికుల బ్యాగులు పరస్పరం తాకడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరోవైపు.. ఈ ఘటనపై రైల్వే యంత్రాంగం దర్యాప్తు చేస్తోందని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చెబుతున్నారు.
ఇదీ చదవండి: బస్సు ప్రయాణికులకు బిగ్ షాక్