
సాక్షి, తిరుపతి: కూటమి ప్రభుత్వం అమాయకులపై కేసులు పెట్టి జైలుకు పంపుతోందని.. ఇందుకోసం తప్పుడు కేసులు, సాక్ష్యాలు సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. ఏపీఎస్పీడీసీఎల్ మాజీ ఉద్యోగి బాలాజీ అక్రమ నిర్బంధం, అబద్దపు వాంగ్మూల సేకరణకు జరుగుతున్న ప్రయత్నాలు, తనను లిక్కర్ కేసులో ఇరికించాలని ప్రభుత్వం చేస్తున్న కుట్రపై ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.
తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ మాజీ ఉద్యోగి బాలాజీని అక్రమంగా నిర్బంధించారు. బాలాజీని రహస్య ప్రాంతానికి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని వేధిస్తున్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి.. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తోంది. అయినా మేం భయపడం. ఎందుకంటే తప్పుడు కేసులు నిలవబడవు కాబట్టి. నేను ఎలాంటి విచారణకైనా సిద్ధం అని చెవిరెడ్డి స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డికి సంబంధం ఉన్నట్లు చెప్పాలంటూ బాలాజీతో సహా ముగ్గురుని పోలీసులు వేధిస్తున్నారు. ఈ క్రమంలో సిట్ కార్యాలయంలో కాకుండా ఓ రహస్యప్రదేశంలో వాళ్లను హింసిస్తున్నట్లు సమాచారం. మరోవైపు.. తమ వాళ్లను పోలీసులు అక్రమంగా తీసుకెళ్లి చిత్ర హింసలకు గురి చేస్తుండడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం ఆయన్ని ఇంటి నుంచి తీసుకెళ్లినట్లు కుటుంబీకులు చెబుతున్నారు. పోలీసుల దుశ్చర్యను ప్రశ్నిస్తూ.. హైకోర్టులో హెబియస్ కార్పస్ వేయబోతున్నట్లు సమాచారం.