
గుజరాత్లోని ‘పాలిటానా’ నగరం ప్రపంచంలో మాంసాహారం నిషేధించబడిన ఏకైక నగరంగా నిలిచింది. ఈ నగరంలో, మాంసాహార ఆహార పదార్థాల వినియోగం, అమ్మకం, కలిగి ఉండటం కూడా పూర్తిగా నిషేధం. పర్యాటకులకు కూడా మాంసాహారం తీసుకురావడానికి, తినడానికి అనుమతి లేదు. అసలేంటీ నగరం ప్రత్యేకత. ఇలాంటి నిర్ణయం ప్రభుత్వం ఎందుకు తీసుకుంది తెలుసుకుందామా..!
గుజరాత్లోని భావ్నగర్ జిల్లాలో ఉంది పాలిటానా నగరం. రాజధాని నగరం అహ్మదాబాద్ సమీపంలో సౌకర్యవంతంగా ఉంది. జైనులకు ఎంతో పవ్రితమైన ప్రదేశంగా, "జైన్ టెంపుల్ టౌన్" గా పాలిటానా ప్రసిద్ది చెందిది. ఈ ప్రత్యేకతను మరింత నిలుపుకునేలా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా శాఖాహార నగరంగా ప్రకటించింది. 900 కి పైగా జైన దేవాలయాలు ఒక్కడ కొలువు దీరి ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వేలాది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఏడాది పొడవునా జైన భక్తులు ఇక్కడికి క్యూ కడతారు.
జైనమతం బోధించే వాటిల్లో ప్రధాన సూత్రం అహింస లేదా అనువ్రతం. ఏ జీవికి హాని కలిగించకూడదని విశ్వసిస్తుంది. 2014లో, జైన సన్యాసుల అభ్యర్థనలను అనుసరించి, గుజరాత్ ప్రభుత్వం పాలిటానాను "మాంసం లేని నగరం"గా ప్రకటించింది. దీని ప్రకారం మాంసం, చేపలు ,గుడ్ల అమ్మకం మరియు వినియోగంపై పూర్తి నిషేధాన్ని విధించింది. పూర్తిగా శాఖాహార నగరంగా ప్రకటించిన పాలిటానాలో ఎటువంటి కబేళాలులేదా మాంసాహార రెస్టారెంట్లు ఉండటానికి వీల్లేదు. పర్యాటకులు నగరంలోకి మాంసాహార ఆహారాన్ని తీసుకు రావడం కూడా చట్ట రీత్యా నిషేధం.
శ్వేతాంబర జైన సమాజానికి ప్రాథమిక తీర్థయాత్ర స్థలంగా, "సిద్ధక్షేత్రం" లేదా మోక్షాన్ని పొందే ప్రదేశంగా పరిగణించబడే పాలిటానాలో సుమారు 900 దేవాలయాలు ఉన్నాయి. జైన విశ్వాసాల ప్రకారం, అనేక మంది తీర్థంకరులు ఈ కొండపై మోక్షాన్ని పొందారు, దీని ఫలితంగా 2014లో జైన సన్యాసులు మతపరమైన ఉపవాసం ఆచరించారు. శత్రుంజయ దేవాలయాలు 11వ , 20వ శతాబ్దాల మధ్య నిర్మించబడిన వాటి సంక్లిష్టమైన చెక్కబడిన వాస్తుశిల్పం, అద్భుతమైన పాలరాయి పనికి ప్రసిద్ధి చెందాయి. శత్రుంజయ కొండపై ఉన్న ఈ దేవాలయాలను చేరుకోవడానికి సుమారు 3,500 మెట్లు ఎక్కాలి. ఈ ప్రదేశం జైన మతం మరియు గోహిల్ రాజ్పుత్ల వంటి ప్రాంతీయ పాలకులకు ప్రాముఖ్యతను కలిగి ఉంది.
చదవండి: భారత్- భూటాన్ ఛిల్.. లాంగ్.. టూర్
పాలిటానా జనాభా సుమారు 65,000, అధిక అక్షరాస్యత రేటు 85%. జనాభాలో 60% జైనులు, 35% హిందూ మరియు 5% ముస్లిం మరియు ఇతర వర్గాలు ఉన్నారు. ముఖ్యంగా, పాలిటానాలో నివసించే ముస్లింలు కూడా మాంసాహార నిషేధాన్ని పాటిస్తారు. నగర ఆర్థిక వ్యవస్థ మతపరమైన పర్యాటకంపై వృద్ధి చెందుతుంది, ఏటా లక్షలాది మంది భక్తులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తుంది, ఆలయ నిర్వహణ కార్యకలాపాలు, హోటళ్ళు, ధర్మశాలల ద్వారా అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.