ఏడాదిగా దగా.. ఏం సాధించారని సంబరాలు? | Chandrababu Govt Cheating People in Andhra pradesh | Sakshi
Sakshi News home page

ఏడాదిగా దగా.. ఏం సాధించారని సంబరాలు?

May 27 2025 3:28 AM | Updated on May 27 2025 1:32 PM

Chandrababu Govt Cheating People in Andhra pradesh

మోసాలతో ప్రజలను వంచించి మహానాడు వేడుకలా బాబూ?

విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలు పూర్తిగా నిర్విర్యం

శాంతి భద్రతల పరిరక్షణలో కూటమి సర్కారు దారుణ వైఫల్యం

పథకాలన్నీ రద్దు.. రెడ్‌బుక్‌ వేధింపులు.. దోపిడీనే ధ్యేయంగా పాలన 

కొత్త పథకాలు ఒక్కటీ ఇవ్వకపోగా.. గతంలో వైఎస్‌ జగన్‌ ఇచ్చినవీ రద్దు 

సూపర్‌ సిక్స్‌ హామీలను ఎగ్గొట్టి.. డైవర్షన్‌తో తిరోగమన పాలన 

అప్పుల నుంచి మద్యం దాకా గత సర్కారుపై విషం చిమ్మడమే లక్ష్యం 

తాము అధికారంలోకి వస్తే వైఎస్‌ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కొనసాగించడంతోపాటు అంతకంటే ఎక్కువగా సంక్షేమం అందిస్తానంటూ ప్రతి ఎన్నికల సభలోనూ నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఏడాదిగా కొత్తవి ఒక్కటి కూడా అమలు చేయకపోగా గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ రద్దు చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రూ.1.37 లక్షల కోట్లు అప్పులు చేసి చంద్రబాబు రికార్డు సృష్టించారు. అన్ని అప్పులు చేసినా ఒక్క సంక్షేమ పథకాన్నీ అమలు చేయలేదు. హామీలను ఎగ్గొట్టి.. పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు రెడ్‌బుక్‌ కుట్రలతో డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు.

ఇసుక,గనులు,మద్యం దాకా ఎల్లో సిండికేట్‌ సహజ వనరులను దోచుకుంటూ రాష్ట్ర ఆదాయానికి గండికొ­డుతోంది. టీడీపీ కూటమి సర్కారు పాలనకు ఏడాది పూర్తవు­తున్న తరుణంలో మహానాడు పేరుతో సంబరాలు చేసుకుంటుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.  గత ప్రభుత్వంలో అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యాదీవెన, ఆసరా తదితర పథకాల ద్వారా ఐదేళ్లలో రూ.2.73 లక్షల కోట్లను డీబీటీ రూపంలో వైఎస్‌ జగన్‌ నేరుగా పారదర్శకంగా అందించి ఆదుకున్నారనే చర్చ గ్రామ గ్రామాన జరుగుతోంది. - సాక్షి, అమరావతి

 ఇది రద్దుల ప్రభుత్వం..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, పథకాలను టీడీపీ కూటమి సర్కారు రద్దు చేసి ప్రజలను ఇక్కట్ల పాలు చేస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలను నిర్వీర్యం చేసింది. ఫీజుల పథకానికి చెదలు పట్టించింది. ఆరోగ్యశ్రీని అటకెక్కించింది. రైతన్నలకు పెట్టుబడి సాయం అందించకుండా అప్పుల పాలు చేసింది. చదువుకునే పిల్లలు, రైతన్నలు, మహిళలు, నిరుద్యోగులను మోసగించి వంచించింది. 2.60 లక్షల మంది వలంటీర్లను రోడ్డున పడేసింది. ఇంటి వద్దకే రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేసే ఎండీయూ వ్యవస్థను రద్దు చేయడంతో 9,280 మంది ఆపరేటర్లు వీధుల పాలయ్యారు.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకత కోసం తెచ్చిన జ్యుడీషియల్‌ ప్రివ్యూ వ్యవస్థ, రివర్స్‌ టెండరింగ్‌ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. టెండర్ల వ్యవస్థను నీరుగార్చి తమ సన్నిహితులు, బినావీులకు పనులు అప్పగిస్తోంది. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు వసూలు చేసుకోవడానికి మొబిలైజేషన్‌ అడ్వాన్సు విధానాన్ని కూటమి ప్రభుత్వం మళ్లీ ప్రవేశపెట్టింది. 2019–24 మధ్య సంక్షేమం, అభివృద్ధిని మేళవించి రాష్ట్రాన్ని వైఎస్‌ జగన్‌ ప్రగతిపథంలో నిలిపారు.

నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులను కార్పొరేట్‌ స్థాయిలో తీర్చిదిద్దారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో కొత్తగా 17 మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని చేపట్టారు. 2023–24లోనే ఐదు ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రారంభించి 750 ఎంబీబీఎస్‌ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు కూటమి సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్న వాటిని ప్రైవేట్‌ పరం చేస్తోంది. 

బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ
ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు 2023 మే 28న రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చే వరకూ నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు చొప్పున అందిస్తామని నమ్మబలికారు. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికీ తల్లికి వందనం పథకం కింద ఏడాదికి రూ.15 వేలు చొప్పున ఇస్తామని.. ఎంత మంది పిల్లలను బడికి పంపితే అంత మందికీ అందచేస్తామని చెప్పారు. అన్నదాతా సుఖీభవ కింద ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందిస్తామన్నారు.

ఆడబిడ్డ నిధి కింద 19 – 59 ఏళ్ల లోపు మహిళలకు ఏడాదికి రూ.18 వేలు చొప్పున అందిస్తామని హామీ ఇచ్చారు. వలంటీర్ల గౌరవ వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచుతామని.. వారు నెలకు రూ.50 వేలు సంపాదించేలా ఆదాయ మార్గాలు కల్పిస్తానని ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఈమేరకు బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో టీడీపీ నేతలు ప్రతి ఇంటికీ బాండ్లు పంపిణీ చేసి నమ్మించారు. సూపర్‌ సిక్స్‌తోపాటు మొత్తం 143 హామీలను టీడీపీ–జనసేన కూటమి ఇచ్చింది. వాటి అమలు బాధ్యత తనదేనంటూ పవన్‌ కళ్యాణ్‌ భరోసానిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఈ సూపర్‌ సిక్స్‌ హామీలన్నీ పూర్తి మోసాలుగా మిగిలాయి. 

జాబ్‌ క్యాలెండర్‌  హుష్‌కాకి..
వైఎస్సార్‌సీపీ హయాంలో ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించి క్రమం తప్పకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టారు. ఒకే నోటిఫికేషన్‌ ద్వారా గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.34 లక్షల ఉద్యోగాలను యువతకు ఇచ్చారు. 2019–24 మధ్య శాశ్వత, అవుట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో 6,38,621 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇక ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) ద్వారా 30.99 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా జాబ్‌ కేలండర్‌ ఊసే లేదు. ఏపీపీఎస్సీ నుంచి ఒక్క నోటిఫికేషన్‌ వెలువడలేదు.

సంస్కరణల పేరుతో గ్రూప్‌–2లో ఉన్న 10 రకాల ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌–1లో కలిపేందుకు నిర్ణయించి గ్రామీణ నిరుద్యోగులకు అన్యాయం తలపెట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు కొత్త తేదీలను చేర్చి డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌గా లీకులిచ్చి నిరుద్యోగులను మోసం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ దాదాపు 1,000 పోస్టుల భర్తీకి అనుమతించినా కూటమి సర్కారు నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు. డీఎస్సీ పేరుతో ఏడాదిగా డ్రామాలాడి విచిత్ర నిబంధనలతో అర్హులైన డీఈడీ, బీఈడీ జనరల్‌ అభ్యర్థులు 3 లక్షల మందిని పరీక్షకు దూరం చేశారు.

ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై విషం.. 
రాష్ట్రంలో భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై చంద్రబాబు దారుణమైన అబద్ధాలను ప్రచారం చేశారు. భూములు లాక్కునేందుకే ఈ చట్టాన్ని తెచ్చారని, భూములకు రక్షణ లేదని, రిజిస్ట్రేషన్‌ దస్తావేజులు ప్రభుత్వం వద్దే ఉంటాయని ప్రజలను భయాందోళనలకు గురి చేశారు. గత ప్రభుత్వం ఈ చట్టాన్ని తెచ్చే క్రమంలో దేశంలోనే మొదటిసారిగా భూముల రీ సర్వే నిర్వహించింది. భూములను జియో ట్యాగింగ్‌ చేసి సరిహద్దు రాళ్లు పాతారు. డ్రోన్, విమానాలతో కోటి ఎకరాలను కొలిచారు. వివాదాలకు ఆస్కారం లేని రీతిలో టైటిల్‌ గ్యారంటీ కల్పించేందుకు టైట్లింగ్‌ చట్టాన్ని తెచ్చారు. చంద్రబాబు తన రాజకీయ కుట్రలకు దీన్ని వేదికగా మార్చుకున్నారు.

ఎడాపెడా అప్పులు.. రెడ్‌బుక్‌ టెర్రర్‌
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.14 లక్షల కోట్లు అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం సృష్టించిందని.. రాష్ట్రాన్ని శ్రీలంకలా మార్చేసిందంటూ ఎన్నికల ముందు చంద్రబాబు, టీడీపీ నేతలు దుష్ఫ్రచారం చేశారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చేశారంటూ ఎల్లో మీడియా తప్పుడు కథనాలను వండివార్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విడుదల చేసిన శ్వేతపత్రంలో రాష్ట్ర అప్పులు రూ.9,74,556 కోట్లు అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్ర అప్పు రూ.పది లక్షల కోట్లు అని చెప్పించారు. గతేడాది నవంబర్‌ 11న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్ర అప్పు రూ.6,46,531 కోట్లేనని అధికారికంగా అంగీకరించారు.

కానీ.. ఆ తర్వాత కూడా అప్పులపై సీఎం చంద్రబాబు దుష్ఫ్రచారం చేసూ్తనే వచ్చారు. నిజానికి గ్యారెంటీ, నాన్‌ గ్యారెంటీ అప్పులు మొత్తం కలిపి 2024 మార్చి నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు రూ.7,21,918 కోట్లే. ఇందులో విభజన జరిగే నాటికి అంటే 2014 జూన్‌ 2 నాటికి రాష్ట్ర అప్పు రూ.1,47,717 కోట్లు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.3,90,247 కోట్లకు చేరుకుంది. అంటే 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు రూ.2,49,350 కోట్లు. ఆ ఐదేళ్లలో ఏటా 22.63 శాతం అప్పులు పెరిగాయి (సీఏజీఆర్‌).

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర అప్పు రూ.7,21,918 కోట్లు. అంటే 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పు రూ.3,32,671 కోట్లు. ఆ ఐదేళ్లలో ఏటా సగటున 13.57 శాతం మాత్రమే అప్పులు పెరిగాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పులో రూ.2.73 లక్షల కోట్లను సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) రూపంలో పేదల ఖాతాల్లో జమ చేశారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రూ.1,37,546 కోట్లు అప్పు చేసింది. అంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పులో 41 శాతాన్ని చంద్రబాబు కూటమి సర్కార్‌ ఒక్క ఏడాదిలోనే చేసింది. 

డైవర్షన్‌ పాలిటిక్స్‌..
సూపర్‌ సిక్స్‌ సహా ఎన్నికల హామీల ఎగవేత.. పరిపాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు సీఎం చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. పచ్చమూకల నరమేథాన్ని దేశానికి చాటిచెప్పేందుకు గతేడాది జూలై 24న వైఎస్‌ జగన్‌ ఢిల్లీలో ధర్నాకు దిగితే దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మదనపల్లెలో అగ్ని ప్రమాదం పేరుతో చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌కు దిగారు.

విజయవాడలో వరదల నియంత్రణలో కూటమి సర్కారు వైఫల్యంతో 50 మందికిపైగా బలయ్యారు. దీని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు పడవలతో ప్రకాశం బ్యారేజ్‌ గేట్లను ఢీకొట్టారంటూ దారుణ­మైన అబద్ధాలను చంద్రబాబు ప్రచారం చేశారు. తన వంద రోజుల పాలన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు.. తిరుమల లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ సెప్టెంబరు 18న సీఎం డైవర్షన్‌ పాలిటిక్స్‌కు తెరతీశారు.  

మాఫియా రాజ్యం..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో తక్కువ ధరలకు ఇసుకను సరఫరా చేసింది. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా రూ.750 కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది వర్షాకాల అవసరాల కోసం నిల్వ చేసిన 80 లక్షల టన్నుల ఇసుకను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పచ్చ ముఠాలు మాయం చేశాయి. ఉచితం ముసుగులో నదులు, వాగులు, వంకలను చెరబట్టిన ఇసుక మాఫియా పర్యావరణ చట్టాలను ఉల్లంఘిస్తూ అడ్డగోలుగా ఇసుకను తవ్వేసి అధిక ధరలకు అమ్ముకుంటూ భారీ ఎత్తున దోచేస్తోంది.

గత ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ పెద్దలు దుష్ప్రచారం చేస్తూ నాడు అధికారులుగా పని చేసిన వారిని బెదిరించి అబద్ధపు వాంగ్మూలాలతో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. లిక్కర్‌, సిలికా, లేటరైట్, క్వార్ట్జ్‌ వరకూ వ్యవస్థీకృతమైన పచ్చ మాఫి­యా ఆకాశమే హద్దుగా దోపిడీకి పాల్పడుతూ రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నారు. అత్యంత విలువైన భూములను సన్నిహితులు, బినావీులకు దోచిపెడుతున్నారు. ఊరూపేరూ లేని ఉర్సాకు 99 పైసలకే ఎకరం చొప్పున రూ.3 వేల కోట్ల విలువైన భూమిని విశాఖలో కట్టబెడుతున్నారు. లూలూ మాల్‌ పేరుతో విశాఖలో రూ.2 వేల కోట్ల విలువైన భూమిని అప్పనంగా అప్పగించేస్తుండటం భూదోపిడీకి పరాకాష్ట.

దుష్ప్రచార కుట్రలు  బట్టబయలు..
ఇంటి గుమ్మం వద్దకే ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో 2019 ఆగస్టు 15న నాటి సీఎం వైఎస్‌ జగన్‌ వలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి 2.60 లక్షల మందిని నియమించారు. ప్రతి నెలా ఒకటో తేదీ తెల్లవారకముందే ఇంటివద్దే పెన్షన్ల నుంచి అన్ని రకాల పౌర సేవలను వలంటీర్ల ద్వారా ప్రభుత్వం అందించింది. కరోనా మహమ్మారి సమయంలో వలంటీర్ల సేవల పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమయ్యాయి.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుండటంతో ఆ వ్యవస్థపై అప్పట్లో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ విషం చిమ్మారు. వలంటీర్ల ద్వారా 33 వేల మంది మహిళలను మాయం చేసి అక్రమ రవాణాకు పాల్పడ్డారంటూ పవన్‌ కళ్యాణ్‌ (Pawan Kalyan) నిరాధార ఆరోపణలు చేశారు. అయితే 2019–24 మధ్య మహిళల అక్రమ రవాణా కేసులు 34 మాత్రమే నమోదు అయ్యాయని.. 46 మంది బాధితులని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 నవంబర్‌ 16న అసెంబ్లీలో వెల్లడించడం గమనార్హం.

చ‌ద‌వండి: ద‌ళిత‌, మైనార్టీల ఆత్మ‌గౌర‌వంపై బాబు స‌ర్కార్ 'బూటు' దెబ్బ‌

ప్రశ్నించే గొంతులు నొక్కుతూ..
చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక  390 మంది హత్యలకు గురయ్యారు. హత్యలు, హత్యాయత్నాలు, దాడులకు గురైన వైఎస్సార్‌సీపీ, నాయకులు, కార్యకర్తలు 766 మంది ఉన్నారు.  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై 2,466 అక్రమ కేసులు బనాయించి  500 మంది నాయకులు, కార్యకర్తలను జైళ్లకు పంపారు. సోషల్‌ మీడియా కార్యకర్తలు 440 మందిపై అక్రమ కేసులు బనాయించి 79 మందిని జైలుకు పంపారు. 11 మంది జర్నలిస్టులపై దాడులు చేశారు. జర్నలిస్టులపై 63 అక్రమ కేసులు బనాయించి 8 మందిని జైలుకు పంపారు. ప్రజాసంఘాల నాయకులపై 73 అక్రమ కేసులు పెట్టి ఇద్దరిని జైలుపాలు చేశారు. మహిళలపై లైంగిక దాడులు, అత్యాచారాలు 198 నమోదయ్యాయి.

ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నాం
గత ప్రభుత్వంతో పోల్చితే కూటమి సర్కారు పాలన ఏం బాలేదు. అమ్మ ఒడి, రైతు భరోసా, చేయూత లాంటి సంక్షేమ పథకాలేవీ అమలు కావడం లేదు. చేయడానికి పనులు దొరకడం లేదు. ఇసుక ఉచితంగా ఇస్తామన్నారు. అది ఆచరణలో ఎక్కడా అమలు జరగడం లేదు. మా కుటుంబానికి గత ప్రభుత్వంలో రైతు భరోసా, డ్వాక్రా రుణమాఫీ వచి్చంది. 200 యూనిట్ల వరకూ విద్యుత్‌ను ఉచితంగా ఇచ్చేవారు. ఇప్పుడు అవేవీ లేవు. ఇప్పటి వరకూ ఇవ్వని కూటమి ప్రభుత్వం ఇకపై వచ్చే నాలుగేళ్లలో ఇస్తుందనే నమ్మకం లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎన్నికలు వచ్చి ఈ ప్రభుత్వం పోవాలని కోరుకుంటున్నాం. 
– బయ్యే నాగవిజయబాబు, శెట్టిపేట, తూర్పు గోదావరి జిల్లా

కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలుతో పాటు శెట్టిపేట, తాళ్లపాలెం, పశ్చిమ గోదావరి జిల్లా కడియద్ద, కృష్ణాపురం, కొమ్ముగూడెం తదితర చోట్ల వివిధ వర్గాల ప్రజల అభిప్రాయాలు ఇలా..

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు జ్యోతి కాలనీలో నివసించే దిద్దే ఆనంద్‌కుమార్‌ భవన నిర్మాణ కార్మికుడు. విధి వక్రీకరించి ఆర్నెల్ల క్రితం పక్షవాతం బారిన పడటంతో రెండు కాళ్లూ పనిచేయడం లేదు. వికలాంగ పింఛన్‌ కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా కనికరించడం లేదు. ఏడాదిగా ఇలా ఎంతో మంది పింఛన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు.

⇒ తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో ఉంటున్న సీలి విజయకు గత ప్రభుత్వంలో ఇంటి స్థలం వచ్చింది. ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఎంత ప్రయత్నించినా రుణం ఇవ్వడం లేదని, కనీసం డ్వాక్రా రుణాలు కూడా ఇవ్వడం లేదని ఆవేదనగా చెబుతోంది. వలంటీర్‌గా పనిచేసే తన కోడలిని తొలగించారని, మనవళ్లకు అమ్మ ఒడి రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏడాదిలో ఏమీ చేయని ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో చేస్తుందని నమ్మకం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

⇒  పశ్చిమ గోదావరి జిల్లా కడియద్ద గ్రామంలో పొలానికి నీరు పెడుతున్న ఈ రైతు పేరు యాతం రామాంజనేయులు. పంట కోత దశకు వచ్చే సమయంలో విద్యుత్‌ సరఫరా సక్రమంగా లేక తడి అందక పంట ఎండిపోయింది. కౌలుకి తీసుకున్న మూడెకరాలకు ఎకరాకు రూ.35 వేలు చొప్పున కట్టాలి. గతంలో రైతు భరోసా వచ్చేదని, ఎకరాకు రూ.20 వేలు ఇస్తామన్న చంద్రబాబు పైసా కూడా ఇవ్వలేదని నిర్వేదం వ్యక్తం  చేస్తున్నారు.

⇒  ‘గత ప్రభుత్వంలో నాకు చేయూత ఇచ్చేవారు. నా భర్తకు పింఛన్‌ వచ్చేది. నా కోడలికి అమ్మ ఒడి అందేది. నా మనవళ్లకు పుస్తకాలు, దుస్తులు ఉచితంగా ఇచ్చి మంచి భోజనం పెట్టేవారు. కరోనా సమయంలో వలంటీర్లు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. కూటమి ప్రభుత్వం సూపర్‌ సిక్స్‌ హామీలిచ్చింది. మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితమన్నారు, ఒకటి ఇచ్చేశామంటున్నారు. కానీ నాకుగానీ, నా కోడలికిగానీ రాలేదు. మేమే కాదు మా ఊరిలో అందరం ఇలాగే బాధపడుతున్నాం. జగన్‌ ఉన్నప్పుడు రూ.10 వేలు ఇచ్చేవారు, ఇప్పుడు ఇవ్వడం లేదని ఆటోడ్రైవర్లు అంటున్నారు.’   
 – మణెమ్మ, తాళ్లపాలెం, తూర్పుగోదావరి జిల్లా.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement