తిరుమల: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు | Bhumana Karunakar Says TTD Governing Body Key Decisions | Sakshi
Sakshi News home page

తిరుమల: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు

Mar 11 2024 2:37 PM | Updated on Mar 11 2024 6:58 PM

Bhumana Karunakar Says TTD Governing Body Key Decisions - Sakshi

సాక్షి, తిరుమల: టీటీడీ ఉద్యోగులకు మరో తీపి కబురు తెలిపారు పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి. నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కాంట్రాక్ట్ ఉద్యోగులతో సహా బోర్డు తీర్మానం ద్వారా ఎంపికైన వారిని కూడా రెగ్యూలైజ్ చేయాలని నిర్ణయించారు. 2014 ఏడాదిని కట్ ఆఫ్ ఇయర్‌గా పరిగణనలోకి తీసుకొని టీటీడీ పరిధిలో ఉన్న ఉద్యోగులకు కూడా జీఓ వర్తించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు తీర్మానం చేశారు. ఈ నిర్ణయం ద్వారా వేలాదిమంది ఉద్యోగుల మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

టీటీడీ పాలకమండలి సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం నిర్ణయాలను టీటీడీ పాలకమండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి మీడియా ముందు ప్రకటించారు. స్విమ్స్ ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 479 నర్సు పోస్టుల భర్తీకి పాలకమండలి ఆమోదం తెలిపింది. టీటీడీ విద్యాసంస్థల్లో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా ఏర్పాట్లకు, నూతన హాస్టల్ భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపింది.
చదవండి: మాటలు కావవి.. ప్రతిపక్షాలకు గుచ్చే బాణాలు

రూ. 1.88 కోట్లతో పీఏసీ అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు, యాత్రికుల వసతి సముదాయాలలో లిప్ట్ ఏర్పాటు చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. తిరుమల చుట్టూ రూ. 1.50 కోట్లతో మిగిలిన ఔటర్ ఫెన్సింగ్ ఏర్పాటకు ఆమోదం తెలిపారు. రూ. 14 కోట్లతో ఉద్యోగస్తుల వసతి సముదాయాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. తిరుపతి గోవింద రాజస్వామి ఆలయంలోని భాస్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి, పార్థ సారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి బంగారు అభరణాల బంగారు పూతకు ఆమోదించారు.

టీటీడీ ఐటీ సేవల కోసం టెక్ రీప్లేస్ మెంట్ కోసం ఐదేళ్ల పాటు నిర్వహణ కోసం రూ. 12 కోట్లు నిధులు కేటాయించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆద్వర్యంలో ఉన్న ఆలయాల్లో అభివృద్ధి పనులకు చెయ్యాలని ఆమోదం తెలిపింది పాలకమండలి. ఇటీవల ఘాట్ రోడ్డులో మరణించిన శ్రీవారి ఆలయ అర్చకుడు యతిరాజు నరసింహులు కుటుంబానికి రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. తిరుమలను నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించడం కుదరదని కేంద్ర విమానాయన మంత్రిత్వశాఖ తెలిపిందని భూమన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement