మైనార్టీ యువతిని మోసం చేసిన కేసులో నిందితుడు రాహుల్రెడ్డికి కూటమి నేతల అండ
ఆడియో లీక్లో విశాఖ దక్షిణ ఎమ్మెల్యే పేరు!
ఇద్దరు ఎమ్మెల్యేలు, సీఎంవో నుంచీ బెదిరింపులొచ్చాయంటున్న బాధితురాలు
రాహుల్రెడ్డి, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ సహా 11 మందిపై కేసు
మధురవాడ: విశాఖలో మైనార్టీ వర్గానికి చెందిన ఓ యువతిని పెళ్లి పెరుతో లొంగదీసుకొని మోసం చేసిన కేసు అధికార కూటమి నేతల మెడకు చుట్టుకుంటోంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకోవడం, గర్భస్రావానికి ఒత్తిడి చేయడం, ఆపై బ్లాక్మెయిలింగ్, బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో కార్పురపు రాహుల్రెడ్డి, ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ సహా 11మందిపై మైనార్టీ యువతి కేసు పెట్టిన విషయం తెలిసిందే.
ఈ కేసును నిర్వీర్యం చేసేందుకు టీడీపీ కూటమి నేతలు రంగంలోకి దిగారు. బాధితురాలిని పలు విధాలుగా బెదిరింపులకు గురి చేస్తున్నారు. తనను బెదిరించి, లొంగదీసుకునేందుకు ఇద్దరు కూటమి ఎమ్మెల్యేలతో పాటు నేరుగా సీఎం కార్యాలయం నుంచి కూడా తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు తెచ్చారని బాధితురాలు ఆరోపించడం సంచలనంగా మారింది. ఇవన్నీ నిందితుడు రాహుల్రెడ్డికి అధికార కూటమి నేతలతో ఉన్న బలమైన సంబంధాలను వెల్లడిస్తున్నాయని బాధితురాలి వర్గం చెబుతోంది
వైరల్ అవుతున్న ఆడియో
నిందితుడు రాహుల్రెడ్డికి విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్యాదవ్తో సన్నిహిత సంబం«దాలు ఉన్నాయని, కూటమికి చెందిన మరో ఎమ్మెల్యే అతనికి మద్దతు ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించి బాధితురాలి తరపు న్యాయవాదికి సంబంధించినదిగా ప్రచారంలో ఉన్న ఒక ఆడియో సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ పేరు అందులో ప్రస్తావనకు రావడం పెద్ద దుమారానికే దారితీసింది. నిందితుడు రాహుల్రెడ్డికి ఆ ఎమ్మెల్యేతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని, ఆయన పేరును అడ్డుపెట్టుకుని తనను బెదిరించారని బాధితురాలు కూడా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఎమ్మెల్యేకు చెందిన కీలక వ్యాపార వ్యవహారాలను కూడా రాహుల్రెడ్డి చూస్తున్నారనే విషయం ఆడియోలో ఉన్నట్లు బాధితురాలి వర్గాలు వెల్లడిస్తున్నాయి.
రూ.20 కోట్ల బెదిరింపుల వెనుక ఎవరు?
ఈ ఏడాది చివరికి రూ.20 కోట్లు సంపాదించి బాధితురాలి అంతం చూస్తానని రాహుల్రెడ్డి బెదిరింపులకు దిగడం కేసు తీవ్రతను వెల్లడిస్తోంది. ఒక వ్యక్తిగత వివాదం వెనుక ఇంత పెద్దమొత్తంలో ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయా? రాహుల్రెడ్డికి రూ.20 కోట్లు సంపాదిస్తాననే ధీమా ఇచ్చిన నాయకులు ఎవరన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కక్షపూరిత వేధింపులు
పలువురు తనను బెదిరించారని, బ్లాక్మెయిల్ చేశారని, తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు ఉపయోగించి ఒత్తిడికి గురిచేశారని బాధితురాలు ఫిర్యాదులో ఆరోపించారు. తాను హనీట్రాప్ అని, వ్యభిచారం చేస్తున్నట్లు.. హెచ్ఐవీ ఉందంటూ తప్పుడు ప్రచారం చేశారని పేర్కొన్నారు. ఇంతటి స్థాయిలో వేధింపులు కొనసాగుతున్నాయంటే.. రాహుల్రెడ్డి వెనుక రాజకీయంగా, అధికారికంగా ఎవరు అండగా ఉన్నారని ఆమె ప్రశ్నిస్తోంది.


