ప్రత్యేక శిబిరాల ద్వారా రూ.7,320 కోట్లు చెల్లింపు
ఖాతాదారు మరణిస్తే నామినీలకు ఆ ఖాతా గురించి తెలియడం లేదు
చిరునామా, ఫోన్ నంబర్, ఈ–మెయిల్ ఐడీ అసంపూర్ణంగా ఉండటమూ సమస్యే
క్లెయిమ్ చేయని ఖాతాలను గుర్తించేందుకు బ్యాంకులు ప్రత్యేక చర్యలు
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో ఖాతాదారులు, వారి కుటుంబ సభ్యులు క్లెయిమ్ చేయని డిపాజిట్ల సొమ్ము బ్యాంకుల్లో ఏడాదికేడాదికి పెరిగిపోతోంది. ఈ ఏడాది జనవరి నెలాఖరునాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్ల సొమ్ము దాదాపు రూ.లక్ష కోట్లకు చేరింది. గత ఏడాది జూన్ నాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్ల సొమ్ము రూ.90,545 కోట్లు ఉండగా అదే ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి రూ.98,073 కోట్లకు చేరింది. క్లెయిమ్ చేయని డిపాజిట్ల సొమ్ము పెరిగిపోవడానికి ప్రధాన కారణం ఎటువంటి లావాదేవీలూ లేని ఖాతాలు, మరణించిన బంధువుల నిధుల గురించి కుటుంబాలకు తెలియకపోవడమేనని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
క్లెయిమ్ చేయని డిపాజిట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్కు బదిలీ చేశారని తెలిపింది. ఖాతాదారు మరణిస్తే నామినీలకు ఆ ఖాతా గురించి తెలియకపోవడం, చిరునామా, ఫోన్ నంబర్, ఇ–మెయిల్ ఐడీ అసంపూర్ణంగా ఉండటం, లేదా చట్టపరమైన వారసులకు నిరూపించుకోవడానికి అవసరమైన పత్రాలు లేకపోవడంతో క్లెయిమ్ చేయలేకపోతున్నారని పేర్కొంది. క్లెయిమ్ చేయని డిపాజిట్లకు సంబంధించి అర్హులైన చట్టపరమైన వారసులను సకాలంలో గుర్తించేందుకు ఆర్బీఐ అనేక చర్యలను తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
క్లెయిమ్ చేయని డిపాజిట్లకు సంబంధించి చట్టపరమైన వారసులను గుర్తించి ఆ డిపాజిట్లను చెల్లించేందుకు బ్యాంకులను ప్రోత్సహించేందుకు ఆర్బీఐ చర్యలను చేపట్టిందని తెలిపింది. ప్రత్యేక శిబిరాల ద్వారా క్లెయిమ్ చేయని డిపాజిట్లకు సంబంధించి వినియోగదారులు, వారి నామినీలు లేదా చట్టపరమైన వారసుల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నాలను చేపడుతున్నట్లు పేర్కొంది.. దేశ వ్యాప్తంగా 748 జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడంతోపాటు ఈ ఏడాది జూన్ నెలాఖరు నాటికి రూ. 7,320 కోట్ల విలువైన క్లెయిమ్ చేయని డిపాజిట్లను నిజమైన యజమానులకు తిరిగి అప్పగించినట్లు తెలిపింది. క్లెయిమ్ చేయని డిపాజిట్లలో 90 శాతం 30 బ్యాంకుల్లోనే ఉన్నాయని, ఆ వివరాలన్నింటినీ ప్రత్యేక పోర్టల్లో అందుబాటులో ఉంచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


