సర్వజనాస్పత్రి బాత్రూమ్‌లో మృతశిశువు కలకలం | Babys body found in bathroom at Anantapur General Hospital | Sakshi
Sakshi News home page

సర్వజనాస్పత్రి బాత్రూమ్‌లో మృతశిశువు కలకలం

Jun 26 2026 4:23 AM | Updated on Jun 26 2026 4:23 AM

Babys body found in bathroom at Anantapur General Hospital

అనంతపురం సిటీ: అనంతపురం సర్వజనా­స్ప­త్రి­లోని గైనిక్‌ విభాగం బాత్రూమ్‌లో శిశువు మృత­దేహం కలకలం రేపింది. గురువారం బాత్రూమ్‌ శుభ్రం చేసేందుకు వెళ్లిన పారిశుధ్య కార్మికురాలు మృతశిశువును గుర్తించి సూపర్‌వైజర్‌కు సమా­చారమిచ్చారు. ఆయన సూచనతో మృత శిశువును గుట్టుచప్పుడు కాకుండా అక్కడి నుంచి తొలగించారు. కాగా, ఈ అంశంపై అన్నీ అనుమానాలే వ్యక్తమవు­తున్నాయి. పూర్తి స్థాయిలో అవయ­వాలు ఎదగని స్థితిలో ఉన్న పిండాన్ని బాగా శుభ్రం చేసి బాత్రూమ్‌లో పడేసినట్లుగా తెలుస్తోంది. 

కాగా..రెండు, మూడు రోజులుగా జీజీహెచ్‌లో­ని లేబర్‌ వార్డులో ఎలాంటి అబార్షన్లూ జరగలే­దని ఆస్పత్రి రికా­ర్డులు స్పష్టం చేస్తు­న్నాయి. బాత్రూమ్‌లో అబార్షన్‌ జరిగి ఉంటే అక్కడ రక్తపు మరకలు పడి ఉండాలి. కానీ అలాంటి ఆనవాళ్లు ఏవీ అక్కడ లేవు. అంతేకాక, మృతశిశువుపై కూడా ఎలాంటి రక్తపు మరకలు లేకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశంపై జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మల్లీశ్వరి విచారణకు ఆదేశించారు.

కాగా, గైనిక్‌ విభాగంలోని నర్సింగ్‌ సిబ్బందితో తమకున్న విభేదాల కారణంగా నర్సులను ఇబ్బంది పెట్టే క్రమంలో బాత్రూ­మ్‌లో మృతశిశువు అంశాన్ని పారిశుధ్య కార్మికులు ఉపయోగించుకున్నారనే ఆరో­పణ­లు­న్నాయి. ఈ నేపథ్యంలోనే తాము తీసిన ఫొటోను తెలిసిన వారికి పంపి, అంశం కాస్త బహిర్గత­మయ్యేలా చేసినట్లు అనుమాని­స్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement