
తిరుమల: భక్తుల సౌకర్యార్థం 2024 ఫిబ్రవరి నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను శుక్రవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. అదేవిధంగా తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని www.tirumala.org వెబ్సైట్లో ముందస్తుగా దర్శన టికెట్లు, గదులను బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
27న శ్రీవారి సేవ కోటా విడుదల: 2024 ఫిబ్రవరి 16న రథసప్తమి పర్వదినానికి సంబంధించిన శ్రీవారి సేవ స్లాట్లను ఈ నెల 27న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. 18 నుంచి 50 ఏళ్ల వరకు వయోపరిమితి ఉన్నవారు మాత్రమే ఈ స్లాట్లను బుక్ చేసుకునేందుకు అర్హులు.
తిరుమల, తిరుపతిలో భక్తులకు స్వచ్ఛంద సేవ చేసేందుకు గాను 2024 జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన శ్రీవారి సేవ, నవనీత సేవ కోటాను అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేస్తారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు పరకామణి సేవ కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఈ సేవలను www.tirumala.org వెబ్సైట్లో భక్తులు బుక్ చేసుకోవచ్చు. కాగా, తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 27న పరిపాలన కారణాల వల్ల బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.