గుండెపోటుతో ‘సాక్షి’ ఉద్యోగి మృతి | Sakshi Employee Died Due To Heart Attack In Khairatabad | Sakshi
Sakshi News home page

గుండెపోటుతో ‘సాక్షి’ ఉద్యోగి మృతి

Jan 21 2025 7:00 AM | Updated on Jan 21 2025 8:42 AM

-

ఖైరతాబాద్‌(హైదరాబాద్‌): గుండెపోటుతో సాక్షి దినపత్రికలో పనిచేస్తున్న ఉద్యోగి మృతి చెందిన సంఘటన ఖైరతాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లా యలమంచిలి ప్రాంతానికి చెందిన పి.శేషాచలపతిరావు(55) కుటుంబ సమేతంగా హైదరాబాద్‌ నగరానికి విచ్చేసి అల్వాల్‌లో నివాసముంటూ బంజారాహిల్స్‌లోని సాక్షి దినపత్రిక కార్యాలయంలో ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ డిపార్ట్‌మెంట్‌లో డిప్యూటీ మేనేజర్‌గా పని చేస్తున్నారు. 

సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఐసీఐసీఐ బ్యాంక్‌ ఎదురుగా ఉన్న బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురికావడంతో బస్టాప్‌లోని ఫుట్‌పాత్‌పై పడిపోయాడు. అచేతనంగా పడి ఉన్న ఆయనను ప్రయాణికులు గమనించి 100 డయల్‌కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. 

వెంటనే అక్కడికి చేరుకున్న ఎస్‌ఐ అమర్‌నాథ్‌, ఏఎస్‌ఐ శ్రీరాములు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. వివరాల కోసం ఆరా తీయగా బ్యాగులో సాక్షి దినపత్రిక ఐడీ కార్డు, బస్‌ పాస్‌ లభించాయి. దీంతో కుటుంబ సభ్యుల వివరాలు సేకరించి, వారంతా వైజాగ్‌కు వెళ్లినట్లు తెలుసుకొని భార్య, బావమరిది, వదినకు సమాచారమిచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement