TS Adilabad Assembly Constituency: ఫస్ట్‌లిస్ట్‌లో పేరు కోసం తంటాలు
Sakshi News home page

TS Election 2023: త్వరలోనే మొదటి జాబితా విడుదలవుతుందనే సంకేతాలు..

Aug 13 2023 8:07 AM | Updated on Aug 13 2023 8:07 AM

Indications Are That The First List Will Be Released Soon - Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండగా రాజకీయ పార్టీల్లో కోలాహలం మొదలైంది. పార్టీ టికెట్‌పై నమ్మకంతో నియోజకవర్గాల్లో పలువురు నేతలు జనంబాట పట్టారు. ప్రజల అండదండలున్న నేతలకే గ్రేడింగ్‌ ఆధారంగా టికెట్లు కేటాయిస్తామని అధికార బీఆర్‌ఎస్‌ అధిష్టానం స్పష్టం చేయగా నాయకులు జనాలను కలుస్తున్నారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ పార్టీ ముఖ్యనేతల దృష్టిలో పడేందుకు యత్నిస్తున్నారు.

బీజేపీ, కాంగ్రెస్‌లోనూ ఇదే పరిస్థితి ఉంది. కాగా, ఆయా పార్టీలకు సంబంధించి త్వరలోనే మొదటి జాబితా విడుదలవుతుందనే సంకేతాలు వస్తుండగా తమ పేరే ఉండాలని కోరుకుంటున్నారు. మొత్తంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పొలిటికల్‌ హీట్‌ పెరిగింది.

ఇదీ పరిస్థితి..
ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి అధికార బీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే జోగు రామన్న మరోసారి టికెట్‌ తనకే వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ప్రభుత్వ పథకాలను జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్తున్నారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రంగినేని మనీషా ఇక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్‌ఖాన్, టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ గండ్రత్‌ సుజాత, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అల్లూరి సంజీవ్‌రెడ్డి తమలో ఎవరికి టికెట్‌ వచ్చినా కలిసే పని చేస్తామని సంకేతాలిస్తున్నారు.

మరో పక్క డీసీసీ మాజీ అధ్యక్షుడు భార్గవ్‌దేశ్‌పాండే కూడా టికెట్‌ కోసం ప్రయత్నం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. మరోనేత కంది శ్రీనివాస్‌రెడ్డి కూడా అధిష్టానం అండదండలు తనకే ఉన్నాయని, టికెట్‌ రావడం ఖాయమనే ధీమాతో కార్యకర్తలతో కలిసి ముందుకు కదులుతున్నారు. బీజేపీలో జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చిట్యాల సుహాసినీరెడ్డి టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. బోథ్‌ నియోజకవర్గంలో అధికార బీఆర్‌ఎస్‌లో మాజీ ఎంపీ గోడం నగేశ్, నేరడిగొండ జెడ్పీటీసీ అనిల్‌ జాదవ్‌ టికెట్‌ కోసం ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు.

ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు ఈసారి తనకే టికెట్‌ ఖాయమని చెప్పుకొంటున్నారు. అయితే ఇక్కడ పోటీ తీవ్రంగా ఉండగా అధిష్టానం ప్రజాదరణ ఆధారంగా గ్రేడింగ్‌ మార్కులు ఎవరికి ఎక్కువ వస్తాయో వారికే టికెట్‌ కేటాయిస్తామని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో జనంలో ఆదరణ పొందేందుకు నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బీజేపీ నుంచి రాష్ట్ర నాయకులు సాకాటి దశరథ్, అడే మనాజీ, అధ్యాపకుడు బలరాం జాదవ్‌ టికెట్‌ కోసం యత్నిస్తున్నారు. కాంగ్రెస్‌ నుంచి అడే గజేందర్, వన్నెల అశోక్‌ ప్రయత్నిస్తున్నారు.

ఖానాపూర్‌ నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే రేఖానాయక్, భూక్యా జాన్సన్‌ నాయక్, ఆర్టీవో శాఖలో పని చేసి రిటైర్డయిన శ్యామ్‌నాయక్, మాజీ ఐఏఎస్‌ శర్వన్‌నాయక్‌ తీవ్రంగా యత్నిస్తున్నారు. బీజేపీ నుంచి రాథోడ్‌ రమేశ్, కాంగ్రెస్‌ నుంచి భరత్‌ చౌహాన్, చారులత, వెడ్మ బొజ్జు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆసిఫాబాద్‌లో అధికార పార్టీ నుంచి ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి టికెట్‌ రేసులో ఉన్నారు. ఇక్కడ ఇతర పార్టీల్లోనూ కొన్ని పేర్లు వినబడుతున్నా పోటీదారులపై ఇంకా స్పష్టత రావడంలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement