హైదరాబాద్: తాము నిరసన తెలిపే క్రమంలో పోలీసుల బలగం అత్యంత దుర్మార్గంగా వ్యహరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. పోలీసులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలంతా చూశారని మండిపడ్డారు. ప్రధానంగా సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా వ్యవహరించారన్నారు. పోలీసు చర్యలతో సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారన్నారు.
ఈరోజు(సోమవారం, సెప్టెంబర్ 7వ తేదీ) తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ‘ ఇది శాసన సభ కాదు.. దుశ్శాసన సభ. లోక్సభకు రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని వెళ్తున్నారు. మేం టీ షర్ట్లు వేసుకుంటే తప్పేంటి.. ఏ రూల్ ప్రకారం అడ్డుకుంటున్నారు.
పార్లమెంటరీ, అన్ పార్లమెంటరీ డిసైడ్ చేయడానికి డీసీపీ ఎవరు?, మహిళా నేతలపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రజల తరఫున గొంతు వినిపించడం మా హక్కు.
స్పీకర్ వివక్ష చూపడం తగదు. సీఎంను విమర్శిస్తే మైక్ ఇవ్వను అని స్పీకర్ అనడం ఏంటి?, ప్రజలపై చేసే దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకాలపై సభలో నిలదీస్తాం. ఈ రోజు జరిగిన ఘటనకు బాధ్యుడు సీఎం రేవంత్. సీఎం రేవంత్ బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్పాలి. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ మహిళా లోకానికి ఇవాళ అవమానం జరిగింది’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఈ రోజు జరిగిన ఘటనపై హైకోర్టుకు వెళ్లాం. ఎన్హెచ్ఆర్సీ, మహిళా కమిషన్కు కూడా వెళ్తాం. బీజేపీ-కాంగ్రెస్ జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుపుతున్నాయి. బీజేపీ-కాంగ్రెస్ కుమ్మక్కై మమ్మల్ని అడ్డుకుంటున్నారు’ అని విమర్శించారు.
ఇదీ చదవండి:


