సాక్షి,హైదరాబాద్: పోలీసులు తనపై దుర్మర్గంగా వ్యవహారించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించారు. బీఆర్ఎస్పై జరుగుతున్న దాడిని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ నేతలు నాటకాలాడుతున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
మరోవైపు తాతా మధు చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన చేసిన కామెంట్స్పై అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ సందర్భంగా తాతా మధు మీడియాతో మాట్లాడుతూ... నేను స్పీకర్ను దూషించలేదు. స్పీకర్ చైర్పై నాకు అపారమైన గౌరవం ఉంది. పోలీసులు నాపై దుర్మార్గంగా వ్యవహారించారు. అనారోగ్యంతో ఉన్న నన్ను పోలీసులు గొంతు పట్టుకున్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు రక్షణ లేకుండా పోయింది. నన్ను ఇబ్బంది పెట్టిన పోలీసులపైనే మాట్లాడాను. కాంగ్రెస్ కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. బీఆర్ఎస్పై దాడిని కప్పిపుచ్చుకునేందుకే ఈ నాటకాలన్నీ ఆడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్రెడ్డి స్పందన
తాతా మధు వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘చెప్పలేని భాషతో స్పీకర్ను దూషించారు. చట్టసభ నుంచి తాతా మధును డిస్మిస్ చేయాలి. తాతా మధు చేసిన వ్యాఖ్యలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి. ఇది సభకు జరిగిన తీవ్ర అవమానం. కేసీఆర్ ఫాంహౌస్లో కుట్రకు ప్లాన్ వేసి, ఈరోజు అసెంబ్లీ ముందు ఆ ప్లాన్ను అమలు చేశారు. సభాపతినే కాదు, సభాపతి కుటుంబ సభ్యులను కూడా అవమానించారు’ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.


