-
Pillala Katha: ఎవరు నిజాయితీ పరుడు?
సింహగిరిని హిమవంతుడు పాలించేవాడు. ఒకరోజు ఆ రాజు.. మంత్రి వసంతుడితో ‘ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మంది పనివాళ్లలో ఎవరు నిజాయితీపరుడో తెలుసుకోవాలని ఉంది మంత్రివర్యా! అందుకు వజ్రాలను వారికి దొరికేలా చేద్దాం. వాటికి ఆశపడని వాడే నిజాయితీపరుడు. ఏమంటారు?’ అని అడిగాడు. ‘అలాగే మహారాజా.. మీరన్నట్టే చేద్దాం! నిజాయితీపరుడెవరో తేలుతుంది’ అన్నాడు మంత్రి. మరుసటిరోజే మంత్రితో చెప్పి ఉద్యానవనంలో కొత్తగా చేరిన పది మందీ పనిచేసే ప్రాంతంలో ఒక్కొక్కరికీ ఒక్కో వజ్రం దొరికేలా ఏర్పాటు చేయించాడు రాజు. ఒక గంట తరువాత ఉద్యానవనం చూసుకునే అధికారి ఆ పది మందినీ పిలిచి ‘పొరపాటున ఉద్యానవనంలో పది వజ్రాలు పడిపోయాయి. దొరికిన వాళ్లు వాటిని తీసుకెళ్లి రాజు గారికి ఇస్తే వారికి రాజు గారు ఐదు వెండి నాణేలు ఇస్తారు’ అని చెప్పాడు. అది విన్న పది మందిలో తొమ్మిది మంది అతి సులువుగా ఒక్కో వజ్రాన్ని స్వంతం చేసుకున్నారు. వారిలో ఒకడు ‘మనమేమన్నా పిచ్చివాళ్లమా? వజ్రానికి వెండి నాణేలు తీసుకోవడానికి? మనకు దొరికిన వజ్రాన్ని అమ్ముకుంటే ఎంతో ధనం వస్తుంది’ అన్నాడు. ‘అవునవును’ అన్నారు మిగతావారు. అందరూ మాట్లాడుకుని నేరుగా బంగారు అంగడి భూషయ్య వద్దకు బయలుదేరారు. పదవ వాడైన రామయ్య వద్దకు ఆ అధికారి వచ్చి ‘నేను వజ్రాల గురించి చెబుతున్నా వినకుండా నీ పాటికి నువ్వు పనిచేసుకుంటూ పోతున్నావేంటీ’ అని కసురుకున్నాడు. ‘నాకు పని ముఖ్యం. పనైపోయాక విరామ సమయంలో వెతుకుతాను’ అని బదులిచ్చాడు రామయ్య. అన్నట్టుగానే రామయ్య.. విరామ సమయంలో భోజనం చేసి వజ్రాన్ని వెతికి తీసుకెళ్లి ‘మహారాజా! ఇదిగోండి నాకు దొరికిన వజ్రం’ అంటూ రాజుకు ఇచ్చి ‘తోటలో పని ఉంది’ అంటూ వెంటనే వెళ్లిపోయాడు. దారిలో తొమ్మిది మందిలో ఒకడు ‘ఉద్యానవనంలో పనికి మనకిచ్చే జీతం చాలా తక్కువ. అందుకే ఈ వజ్రాన్ని అమ్మితే వచ్చే ధనంతో నేను పొరుగు దేశం వెళ్లి వ్యాపారం చేసుకుంటాను’ అన్నాడు. మరొకడు ‘పంట పొలం కొంటాన’న్నాడు. ఇలా మిగిలిన వాళ్లూ తమ తమ ఆలోచనలను పంచుకుంటూ భూషయ్య అంగడికి చేరుకున్నారు. వజ్రాలు అమ్మడానికి వచ్చామంటూ భూషయ్యకు తమ దగ్గరున్న వజ్రాలను ఇచ్చారు. వాటిని పరీక్షించిన భూషయ్య ‘ఇవి వజ్రాలు కావు. నాసిరకం రంగు రాళ్లు. నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావు’ అని తేల్చాడు. ‘ఒరే! మనం పొరబడ్డాము. తిన్నగా కోటకు వెళ్లి వీటిని రాజు గారికి ఇచ్చి వెండినాణేలు దక్కించుకుందాము’ అన్నాడు వారిలో ఒకడు. ‘అవునురా’ అంటూ వంత పాడారు మిగిలిన వాళ్లు. వెంటనే కోటకు పయనమయ్యారు. రాజు గారి కొలువుకు చేరుకొని ‘మహారాజా! ఇవిగోండి.. మాకు దొరికిన వజ్రాలు’ అంటూ ఆ తొమ్మండుగురూ వాటిని రాజుకిచ్చారు. ‘మీకు భోజన సమయానికి ముందు వజ్రాలు దొరికితే.. అవి అసలైనవనుకుని అమ్మడానికి భూషయ్య వద్దకు వెళ్లారు. అక్కడవి నకిలీవని తేలగానే ఇటు వచ్చారు కదా’ అని గద్దించాడు రాజు. సమాధానమివ్వలేక పోయారు వాళ్లు. ‘రామయ్య ఒక్కడే పని చూసుకుని వజ్రం దొరికిందని ఇచ్చి వెళ్ళాడు. మీలో నిజాయితీపరుడు ఎవరో తెలుసుకోవడం కోసం నేను ఆడిన నాటకం ఇది’ అన్నాడు రాజు. ‘నిజాయితీతో పని చేయలేని మీ అందరినీ మహారాజు గారు కొలువు నుండి తొలగిస్తున్నారు. మీరు పక్షం రోజులు పనిచేసినా మాసం జీతం ఇస్తున్నారు. తీసుకుని వెళ్ళండి’ అన్నాడు మంత్రి. తరువాత రామయ్యను పిలిచి ‘వృత్తికి విలువ ఇచ్చిన తరువాతనే నిజాయితీగా వజ్రం తెచ్చి ఇచ్చావు. అన్న మాట ప్రకారం నీకు ఐదు వెండినాణేలు ఇవ్వాలి. కానీ పది బంగారు నాణేలు ఇస్తున్నాను’ అన్నాడు రాజు. ‘మహారాజా! నాది కానిది పూచిక పుల్ల కూడా నాకు అవసరం లేదు. దొరికిన వజ్రం మీకు తెచ్చిచ్చాను. నాకిచ్చిన కొలువు బంగారం కంటే విలువైనది. మీరిచ్చే జీతం నాకు చాలు’ అని వందనం చేసి వెళ్లిపోయాడు రామయ్య. మరొక్కమారు రామయ్య నిజాయితీని ప్రశంసించి ‘చూశారుగా మంత్రీ.. మన పథకం ఎలా పారిందో!’ అన్నాడు రాజు గర్వంగా. ‘అవును మహారాజా!’ అన్నాడు మంత్రి మెచ్చుకోలుగా! - యు.విజయశేఖర రెడ్డి -
అతిపెద్ద గొయ్యి.. ఇక్కడ తవ్వే కొద్ది వజ్రాలు!
తూర్పు సెర్బియాలో ఉన్న వజ్రాల గని ఇది. భూమ్మీద అతిపెద్ద గోతుల్లో ఒకటిగా ఇది రికార్డులకెక్కింది. దీని వ్యాసం 1200 మీటర్లు, లోతు 525 మీటర్లు. తొలిసారిగా ఈ ప్రాంతంలో వజ్రాల నిక్షేపాలు ఉన్నట్లు 1955లో నాటి సోవియట్ భూగర్భ శాస్త్రవేత్త యూరీ ఖబార్దిన్ గుర్తించారు. వజ్రాలను వెలికి తీసేందుకు అప్పటి సోవియట్ ప్రభుత్వం 1957లో ఇక్కడ మిర్నీ మైన్ పేరిట గనిని ప్రారంభించింది. ఈ గని నుంచి ఏకధాటిగా 2001 వరకు వజ్రాల వెలికితీత కొనసాగింది. తర్వాత కొన్నాళ్లు ఇది మూతబడింది. ఇది రష్యన్ వజ్రాల కంపెనీ ‘ఎయిరోసా’ చేతుల్లోకి వెళ్లడంతో 2009 నుంచి మళ్లీ వజ్రాల వెలికితీత కొనసాగుతోంది. ఇక్కడ వజ్రాల గని ప్రారంభమైన నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున కోటి కేరట్ల (రెండువేల కిలోలు) వజ్రాల వెలికితీత జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. మరో నలబై ఏళ్లకు పైగా ఇక్కడి నుంచి వజ్రాలను వెలికితీసే అవకాశాలు ఉన్నాయని ఎయిరోసా కంపెనీ భావిస్తోంది. -
పిల్లల కథ -‘తెలిసొచ్చింది మహా ప్రభో’
మధిర రాజ్యాన్ని పాలిస్తున్న రాజు భీమశంకరుడు మంచి పరిపాలనాదక్షుడు. రాజ్యాన్ని చక్కగా పాలిస్తుండేవాడు. కానీ రాజ్యంలోని ప్రజల్లో చాలామంది సోమరిపోతులు! బద్ధకంతో ఏ పనీ చేయకుండా ఉండేవారు. ఆ బద్ధకాన్ని పోగొట్టడానికి ఎన్ని విధాల ప్రయత్నించినా లాభం లేకపోయింది.ఒకరోజు రాజ్యంలోకి ఒక సాధువు వచ్చాడని అతని వద్దకు అందరూ వెళుతున్నారని.. ఎవరికి ఏ సమస్య ఉన్నా వారికి అతను తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాడని రాజుకు తెలిసింది. మారువేషంలో అతని దగ్గరకు వెళ్లి.. సలహా తీసుకురమ్మని మంత్రిని ఆదేశించాడు. మారువేషంలో మంత్రి సాధువు వద్దకు వెళ్లి ‘ప్రణామాలు సాధుపుంగవా! మా రాజ్యంలో చాలామంది బద్ధకస్తులున్నారు. ఎన్ని విధాల ప్రయత్నించినా వారు మారడంలేదు. దాంతో వారి విషయంలో మా రాజుగారు విరక్తి చెందారు. ఈ సమస్యకు పరిష్కారం తెలియజేయగలరు’ అని ప్రార్థించాడు. ‘దీనికి పరిష్కారం ఉంది’ అంటూ మంత్రి చెవిలో ఏదో చెప్పాడు ఆ సాధువు. ఆ విషయాన్ని రాజుకు చెప్పాడు మంత్రి. ‘సాధువు చెప్పినట్లుగా చేయండి’ అని మంత్రిని ఆదేశించాడు రాజు. ‘అలాగే రాజా’ అని చెప్పి.. ‘రాబోవు దసరా పండుగనాడు ప్రతి ఇంట్లోని మగవారి కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం. కనుక దసరా రోజున పురుషులంతా.. మన రాజ్యం నడి బొడ్డునున్న సమావేశ ప్రాంగణానికి హాజరు కావలెను. వచ్చేటప్పుడు ప్రతిఒక్కరూ ఒక సంచి, ఒక పొడవాటి కర్ర తెచ్చుకొనవలెను’ అని చాటింపు వేయించాడు. ఆ చాటింపు విన్న ప్రజలకు.. సంచి, కర్ర ఎందుకు తెచ్చుకోమన్నారో అర్థం కాలేదు. దసరా రానే వచ్చింది. ఆ రోజు పురుషులందరూ సమావేశ ప్రాంగణానికి చేరుకున్నారు. కానీ బద్ధకస్తులు చాలామంది సంచి, కర్ర, తెచ్చుకోకుండానే వచ్చారు. రాజు.. అక్కడికి వచ్చిన వారినుద్దేశించి ‘మన రాజ్యంలో ఇప్పటి నుంచి కొత్త విధానాన్ని అవలంబించబోతున్నాం. అందులో భాగంగా మీరందరూ.. తెచ్చుకున్న సంచి, కర్రతో మన రాజ్యానికి ఉత్తరాన ఉన్న అడవిలోకి వెళ్లి.. కర్రతో అక్కడ చెట్లకున్న పండ్లను కొట్టి.. సంచిలో నింపుకొని రావాలి. ఇప్పుడే బయలుదేరి మీకప్పగించిన పని ముగించుకుని సాయంకాలానికల్లా మళ్లీ ఇదే ప్రాంగణానికి రావాలి’ అని చెప్పాడు. చిత్తం అంటూ బయలుదేరారంతా. సంచి,కర్రలు ఉన్నవాళ్లు పండ్లను కొట్టి.. సంచి నింపుకొని వచ్చారు. వాటిని తీసుకెళ్ళని బద్ధకస్తులు చేతికి అందిన కొన్ని పండ్లను మాత్రమే తెంపుకొని వారు వేసుకున్న చొక్కా లేదా కండువాలో కట్టుకొని వచ్చారు. సంచులు, కర్రలు తెచ్చుకున్న వారిని సంచితో సహా ఇంటికి వెళ్ళమన్నారు. అలా తీసుకురాని వారందరినీ వారం రోజులపాటు చెరసాలలో బంధించాలని ఆదేశించారు. వెంటనే రాజ భటులు వారందరినీ తీసుకెళ్లి ఒకొక్కరిని ఒక్కో గదిలో బంధించారు. బద్ధకం వల్ల వారు సంచి, కర్రను తీసుకెళ్లనందువల్ల వారు అడవి నుంచి తక్కువ పండ్లను తీసుకురావాల్సి వచ్చింది. చెరసాలలో ఉన్న వారం రోజులూ వారు ఆ పండ్లను మాత్రమే ఆహారంగా తీసుకోవాలని.. బయట నుంచి వారికి ఇతర ఆహారమేమీ ఇవ్వకూడదని భటులను ఆదేశించారు. దాంతో వాళ్లకు ఆ పండ్లు రెండు రోజులకే సరిపోయాయి. మిగిలిన రోజుల్లో ఆకలితో అలమటించారు. బద్ధకించకుండా తామూ సంచి, కర్ర తీసుకువెళ్లి ఉంటే ఈ రోజు తమకు ఆ దుస్థితి పట్టేది కాదని మథన పడ్డారు. తిండి లేక నీరసించిన వాళ్లను చెరసాల నుంచి బయటకి తీసుకొచ్చారు. అప్పుడు వారినుద్దేశించి రాజు ‘ఇప్పటికైనా మీరు చేస్తున్న తప్పును గమనించారా? మనం ఏ పని చేసినా బద్ధకం లేకుండా మన పూర్తి శక్తిని కేంద్రీకరించి చేయాలి. అలా చేయకపోతే దాని పరిణామం ఇదిగో ఇలా ఉంటుంది’ అన్నాడు. వెంటనే వాళ్లంతా ‘క్షమించండి రాజా! తప్పు తెలుసుకున్నాం. ఇప్పటి నుంచి బద్ధకాన్ని వీడి కష్టపడి పనిచేస్తాం’ అన్నారు ముక్తకంఠంతో. ఏదైనా పని చేసుకోవడానికి వారందరికీ కొంత ధనం ఇప్పించి పంపించేశాడు రాజు. ఆ డబ్బుతో ఎవరికి వచ్చిన పనిని వారు చేసుకుంటూ రాజ్యాభివృద్ధిలో పాలుపంచుకోసాగారు. ఆ తర్వాత రాజ్యంలో బద్ధకస్తుల జాడే లేకుండా పోయింది. - ఏడుకొండలు కళ్ళేపల్లి -
మంత్ర ఖడ్గం!
పూర్వం ఉజ్జయినిని మహామల్లుడనే రాజు పాలించేవాడు. ఆయన పేరుకు తగ్గట్టే మహాయోధుడు. అయితే ఆయనకు ఒక చింత ఉండేది. ఒక్కగానొక్క కొడుకు మణిదీపుడు యుద్ధ విద్యలందు ఏమాత్రం ఆసక్తి చూపేవాడుకాదు. రాజ్యాన్ని కాపాడుకోవాలంటే రాజు తిరుగులేని యోధుడై ఉండాలి అని మహామల్లుడు కొడుక్కి ఎంతచెప్పినా ఫలితం ఉండేదికాదు. మణిదీపుడికి కష్టపడి యుద్ధవిద్యలు నేర్వడం ఇష్టంలేదు. చిన్నప్పుడు విన్న కథల్లోలాగ మంత్రఖడ్గాన్ని సంపాదించి దానితో విజయాలను అందుకోవాలని అతను కలలు కంటుండేవాడు. ఒకరోజు.. రాజుగారి దర్శనానికి ఒక సాధువు వచ్చాడు. తన బాధను సాధువుతో చెప్పాడు మహామల్లుడు. ‘దాని గురించి మీరు చింత పడకండి. మణిదీపుడిని నాతో పంపండి. అతని కోరిౖకైన మంత్రఖడ్గాన్ని ఇచ్చి పంపుతాను. కానీ దానిని ఉపయోగించాలంటే కనీస నైపుణ్యం ఉండాలి కదా! దాన్ని కూడా మణిదీపుడికి ఏమాత్రం కష్టంలేకుండా అతి తక్కువ సమయంలో నేర్పించి పంపిస్తాను’ అన్నాడు. మణిదీపుడి ఆనందానికి హద్దులు లేకుండాపోయాయి. ఇటు యుద్ధవిద్యలూ వస్తున్నాయి. అటు తాను కోరుకున్న మంత్రఖడ్గమూ లభిస్తున్నది. ఇంకేం కావాలి! సాధువు వెంట బయలుదేరి ఆశ్రమం చేరాడు. సాధువు తానే మణిదీపుడికి కత్తియుద్ధం నేర్పించడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యపోతున్న మణిదీపుడితో ‘సాధువుకి క్షత్రియవిద్యలు ఎలా తెలుసా అని ఆశ్చర్యపోతున్నావా? నేను వయసులో ఉన్నప్పుడు మనరాజ్య సైన్యంలో పనిచేశాను. వయసయ్యాక ప్రశాంత జీవితం గడపాలని ఆశ్రమం నిర్మించుకున్నాను. అయితే నావద్దకు వచ్చినవారికి కాదనకుండా క్షత్రియ విద్యలు నేర్పిస్తున్నాను’ అన్నాడు. ఆరోజు సాయంత్రం అభ్యాసం అయ్యాక మణిదీపుడి భుజంతట్టి ‘ఎంతో అనుభవం ఉన్నవాడిలా చేస్తున్నావు. నేననుకున్నదానికంటే ముందే యుద్ధవిద్యలు నేర్చుకోగలవు’ అంటూ ప్రశంసించాడు. మణిదీపుడి మీద సాధువు పొగడ్తలు బాగా పనిచేశాయి. ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. యుద్ధవిద్యలు కష్టం అనుకున్నాడు. కానీ అవి తేలికే అని గ్రహించాడు. యుద్ధవిద్యలన్నీ నేర్పి అతనిని తిరిగి రాజధానికి పంపే సమయంలో.. సాధువు మంత్రఖడ్గాన్ని ఇస్తూ ‘ఇది మా పూర్వీకులది. నేను సైన్యంలో పనిచేస్తున్నప్పటి నుండీ నా దగ్గర ఉంది. ఇది నీకు భవిష్యత్లో ఉపయోగపడుతుంది’ అన్నాడు. మణిదీపుడు ఆనందంగా రాజ్యం చేరుకున్నాడు. కొడుకు ప్రయోజకుడై వచ్చినందుకు మహామల్లుడు సంతోషించి పట్టాభిషేకం చేశాడు. రాజయ్యాక కూడా మణిదీపుడు రోజూ అభ్యాసం చేయకుండా ఉండలేకపోయేవాడు! కొంతకాలానికి పొరుగున ఉన్న కోసలరాజుకు దుర్బుద్ధి పుట్టింది. బాగా అభివృద్ధి చెందిన ఉజ్జయినిని జయించి తమ రాజ్యంలో కలుపుకోవాలని దాడిచేశాడు. తన వద్ద ఉన్న మంత్రఖడ్గంతో మణిదీపుడు యుద్ధరంగాన చెలరేగిపోయాడు. ఘన విజయం లభించాక సాధువుని కలసి ‘మీరు ప్రసాదించిన మంత్రఖడ్గం వల్ల ఇంతటి విజయం లభించింది!’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ‘విజయం ఖడ్గానిది కాదు. నీ నైపుణ్యానిది. యుద్ధవిద్యలంటే ఇష్టంలేని నీవు ఒకసారి వాటిని నేర్చుకోవడం ప్రారంభించాక నీలో ఎక్కడలేని ఆసక్తి కలిగింది. అది సహజం. ఏవిద్య అయినా నేర్చుకోవడం మొదలుపెడితే ఇక దానిని వదలబుద్ధికాదు. ఆ లక్షణమే నీకు యుద్ధంలో విజయం లభించేట్టు చేసింది. ఇందులో మంత్రతంత్రాల ప్రమేయం ఏమీలేదు. నీ మనసులో యుద్ధవిద్యల పట్ల ఆసక్తికలగడానికి నేను మంత్రఖడ్గం అనే అబద్ధం ఆడాను. అది మామూలు ఖడ్గమే! కృషిని నమ్ముకునేవారికి విజయం వెన్నంటే ఉంటుంది. ఈ విషయం ఎప్పుడూ మరిచిపోకు’ అన్నాడు. ఆ సాధువు మణిదీపుడిని వెంటబెట్టుకుని మహామల్లుడి వద్దకు వచ్చాడు. ‘ప్రభూ! మీరు నన్ను మన్నించాలి. మణిదీపుడు యుద్ధవిద్యల పట్ల ఆసక్తి చూపడం లేదని మీరు బాధపడుతున్నారని తెలిసి నేను సాధువుగా మీ వద్దకు వచ్చి మంత్రఖడ్గం పేరుతో మణిదీపుడ్ని ఆకర్షించి యుద్ధవిద్యల్లో ఆరితేరేట్టు చేశాను. ఒకప్పుడు నేను మీ సైన్యంలో పనిచేసి మీ ఉప్పు తిన్నవాణ్ణి. ఆ కృతజ్ఞత కొద్దీ మీ బాధ తీర్చాలని భావించాను. సాధువుగా వచ్చి పరదేశినని అబద్ధం చెప్పాను. నేను చేసిందాంట్లో ఏదైనా తప్పుంటే మన్నించండి’ అన్నాడు సాధువు. దానికి మహామల్లుడు ఆనందిస్తూ ‘మీ స్వామిభక్తి ఆశ్చర్య పరుస్తున్నది. మీలాంటివారు ఆస్థానంలో ఉండాలి. ఇకమీదట మీరు మా ముఖ్య సలహాదారునిగా ఉండి రాజ్యరక్షణలో మీ శిష్యునికి తోడ్పడండి’ అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. సాధువు సంతోషంగా అంగీకరించాడు. -డా. గంగి శెట్టి శివకుమార్ -
స్టీలు ఇల్లు..ఈజీగా మడతేసి తీసుకుపోవచ్చు!
‘స్టీలు సామాన్లు కొంటాం.. పాత ఇనుప సామాన్లు కొంటాం..’ అనేది పాతదే. త్వరలోనే ‘స్టీలు ఇళ్లను కొంటాం..’ అని కూడా వినపడొచ్చు. ఎందుకంటే, భవిష్యత్తులో చాలామంది స్టీలు ఇళ్లల్లోనే నివసించనున్నారు. ఈ మధ్యనే వాషింగ్టన్లోని ఓ ప్రైవేటు సంస్థ నాలుగు స్టీల్ గ్రెయిన్ హౌస్లను నిర్మించింది. చూడటానికి పాతకాలపు ధ్యానపు డబ్బాల్లా ఉన్నాయి. కానీ, వీటిలోపల విశాలమైన బెడ్రూమ్, కిచెన్, బాత్రూమ్ ఉన్నాయి. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే విధంగా ఇందులోని టెంపరేచర్ సిస్టమ్ పనిచేస్తుంది. పైగా ఇన్బిల్ట్ సీసీ కెమెరాలతో పనిచేసే స్మార్ట్ హోమ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంటిని కంటికిరెప్పలా కాపాడుతుంది. దీన్ని మడతేసి ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లచ్చు కూడా. అవుట్డోర్ వాతావరణాన్ని ఎంజాయ్ చేసేవారికి ఈ ఇల్లు భలే బాగుంటుంది. అయితే ఈ ఇంటి ధర 1.6 మిలియన్ డాలర్లు (అంటే రూ. 13 కోట్లు). ఈ ఇళ్ల ఫొటోలను ఫేస్బుక్లో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్గా మారింది. త్వరలోనే ఈ స్టీలు ఇళ్లను పూర్తిస్థాయిలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. (చదవండి: కొండను కొంటారా? ఔను! అమ్మకానికి సిద్ధంగా ఉంది!)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు రాష్ట్రానికి అమిత్ షా, రాజ్నాథ్సింగ్ రాక
జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
Jammu and Kashmir: ఉగ్ర ఘాతుకం
తెల్దేవర్పల్లి @ 46.7
బాలసదనాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం
సోషల్ మీడియా ప్రకటనలపై నిఘా : ఎస్పీ
చెరువు శిఖం కబ్జా
ఎన్నికల విధుల కేటాయింపులో ఇష్టారాజ్యం
రిజర్వేషన్లపై మోదీ స్పష్టత ఇచ్చినా.. రేవంత్ గోబెల్స్ ప్రచారం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement