● లక్షణాలుంటే పరీక్ష : జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కోవిడ్ పరీక్ష చేయించుకోవడం మంచిది.
● మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరి : రద్దీగా ఉండే ప్రాంతాలు, ఇండోర్ ప్రదేశాలకు వెళ్లినప్పుడు కచ్చితంగా మాస్కులు ధరించాలి. చేతులను తరచూ శుభ్రం చేసుకోవాలి లేదా శానిటైజర్ ఉపయోగించాలి.
● దూరంగా ఉండాలి : వృద్ధులు, చిన్నపిల్లలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జనసమ్మర్థం ఎక్కువగా ఉండే ప్రాంతాలకు వెళ్లకపోవడమే శ్రేయస్కరం.
● అత్యవసర సంప్రదింపులు: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైనా లేదా శరీరంలో ఆక్సిజన్ శాతం 94 కంటే తగ్గినా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి.
భీమవరం (ప్రకాశంచౌక్) : కరోనా మహమ్మారి మళ్లీ కోరలు చాస్తుండటంతో ఉమ్మడి గోదావరి, రాయలసీమ జిల్లాల ప్రజలు తీవ్ర భ యాందోళనలకు గురవుతున్నారు. కాకినాడ జిల్లాలో ఒకరు, కడప జిల్లాలో ఇద్దరు ఈ వైరస్ బారిన పడి మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆరేళ్ల క్రితం కరోనా మూడు విడతల్లో సృష్టించిన బీభత్సాన్ని, ఆప్తులను కోల్పోయి అనుభవించిన హృదయవిదారక వేదనను ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. గత నాలుగేళ్లుగా పరిస్థితి ప్రశాంతంగా ఉన్న తరుణంలో మళ్లీ మరణాలు సంభవించడం అందరినీ కలచివేస్తోంది. ఇటీవల ఏలూరు జిల్లాలో ఆగిరిపల్లిలో ఓ వృద్ధురాలికి కరోనా పాజిటివ్ రాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
కాగితాలకే పరిమితమైన ముందస్తు చర్యలు
పక్క జిల్లాల్లో కరోనా వ్యాప్తి చెందుతున్నా జిల్లా వైద్యారోగ్య శాఖ మాత్రం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో జ్వ రాలపై సర్వేలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా వాస్తవానికి ఎక్కడా ఇంటింటి సర్వేలు జరగ డం లేదు. ఫలితంగా కరోనా, తీవ్ర జ్వరాల లక్షణా లు ఉన్న రోగులు బయటపడటం లేదు. అనారోగ్యానికి గురైన వారు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నా, అక్కడ నమోదవుతున్న ఫ్లూ కేసుల వివరాలను సేకరించే యంత్రాంగం కూడా లోపించింది. దీనివల్ల వైరస్ వ్యాప్తి చెందినా ప్రాథమిక దశలోనే గుర్తించే అవకాశం లేకుండా పోతోంది.
ఆన్లైన్లో ‘ఉన్నాయి’.. ఆసుపత్రుల్లో ‘లేవు’!
కరోనా లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయడానికి అవసరమైన ర్యాపిడ్ కిట్లు జిల్లాలోని ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనూ అందుబాటులో లేవు. వైద్యారోగ్య శాఖ రికార్డుల్లో, కంప్యూటర్ ఆన్లైన్ డేటాలో మాత్రం కిట్లు ఉన్నట్లు చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం వైరస్ నిర్ధారణ కోసం ప్రజలు పూర్తిగా ప్రైవేటు ల్యాబ్లపైనే ఆధారపడాల్సి వస్తోంది.
నిఘా కరువు
ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న కడప, కాకినాడ, ఏలూరు జిల్లాల నుంచి వచ్చే ప్రయాణికులను గుర్తించేందుకు గానీ, వారికి కనీస స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించేందుకు గానీ ఎలాంటి ఏర్పాట్లు లేవు. జిల్లాలో ప్రస్తుతానికి కేసులు లేవనే నెపంతో అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందక ముందే ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చేవారిని గుర్తించి, లక్షణాలు ఉన్నవారిని ఐసోలేషన్లో ఉంచాల్సిన బాధ్యతను యంత్రాంగం విస్మరించిందనే ఆరోపణలు వస్తున్నాయి.
వైద్యుల సూచనలు
గుండె, ఊపిరితిత్తులు, శ్వాసకోస సంబంధిత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఫ్లూ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
పొరుగు జిల్లాల్లో పాజిటివ్ కేసులు
జిల్లాలో అప్రమత్తత కరువు
చర్యలు చేపట్టని వైద్యారోగ్యశాఖ
సర్వే లేదు.. టెస్టింగ్ కిట్లు నిల్
నమోదవుతున్న జ్వరాల కేసులు


