కామవరపుకోట : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన కామవరపుకోట శివారు ఉప్పలపాడు సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామానికి చెందిన కొలుకులూరి రమేష్ (30), గ్రామంలో వ్యవసాయం చేస్తూ జీవిస్తుంటాడు. శుక్రవారం తన కుమార్తె పుట్టినరోజు సందర్భంగా దేవులపల్లి నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరి కామవరపుకోట వచ్చి, కేక్, స్వీట్స్ తీసుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా.. కామవరపుకోట శివారు ఉప్పలపాడు సమీపంలోకి వెళ్లేసరికి ఎదురుగా వస్తున్న ట్రక్ ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో రమేష్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. తడికలపూడి ఎస్సై వల్లీ పద్మ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.


